
ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం, సముద్ర మార్గాల్లో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ ప్రపంచ ఇంధన సరఫరాను (Energy Supply) సురక్షితం చేయడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) యుద్ధ ప్రాతిపదికన అడుగులు వేస్తోంది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన, వివాదాస్పదమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ (Strait of Hormuz) జలసంధిపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు రెండవ అతిపెద్ద ఆయిల్ పైప్లైన్ను యూఏఈ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు పనులు దాదాపు 50 శాతం పూర్తయినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వ చమురు సంస్థ ‘అడ్నాక్’ (ADNOC) సీఈఓ సుల్తాన్ అహ్మద్ అల్ జాబెర్ వెల్లడించారు.
ఇరాన్ యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. 2027 నాటికి ఈ కొత్త పైప్లైన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది పూర్తయితే, ఒమన్ గల్ఫ్లో ఉన్న ‘ఫుజైరా పోర్ట్’ (Fujairah Port) ద్వారా చమురును ఎగుమతి చేసే యూఏఈ సామర్థ్యం రెట్టింపు కానుంది. ప్రస్తుతం పాత పైప్లైన్ ద్వారా ఫుజైరా పోర్టుకు రోజుకు గరిష్టంగా 18 లక్షల (1.8 మిలియన్) బారెళ్ల చమురును మాత్రమే యూఏఈ పంపగలుగుతోంది, ఇది ఆ దేశ వాస్తవ సామర్థ్యం కంటే చాలా తక్కువ. ఈ ఇబ్బందిని అధిగమించేందుకే ఈ రెండవ పైప్లైన్ను వేగంగా నిర్మిస్తున్నారు.
చరిత్రలోనే అతిపెద్ద ఇంధన సంక్షోభం: అడ్నాక్ సీఈఓ
అట్లాంటిక్ కౌన్సిల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అడ్నాక్ సీఈఓ సుల్తాన్ అహ్మద్ అల్ జాబెర్ ప్రపంచ దేశాలను హెచ్చరిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. “నేటికీ ప్రపంచ ఇంధన అవసరాలు కొన్ని ఇరుకైన సముద్ర మార్గాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ఏదైనా ఒక దేశం ప్రపంచంలోనే అత్యంత కీలకమైన జలమార్గాన్ని బంధీగా మార్చుకోగలదనడానికి ఇదొక ప్రమాదకరమైన ఉదాహరణ.” అని సుల్తాన్ అహ్మద్ స్పష్టం చేశారు.
ఇదిలావుంటే, హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా చరిత్రలోనే అతిపెద్ద చమురు సంక్షోభం ఏర్పడింది. ఇప్పటివరకు 100 కోట్ల (1 బిలియన్) బారెళ్లకు పైగా చమురు నష్టం వాటిల్లింది. ఈ మార్గం మూతపడటం వల్ల ప్రతి వారం మరో 10 కోట్ల బారెళ్ల నష్టం అదనంగా చేరుతోంది. యథాస్థితికి రావడానికి సమయం పడుతుంది: ఒకవేళ ఈ రోజుకు ఈ యుద్ధం ముగిసినా సరే, చమురు సరఫరాను సాధారణ స్థాయిలోని 80 శాతానికి తీసుకురావడానికి కనీసం 4 నెలల సమయం పడుతుందని అల్ జాబెర్ స్పష్టం చేశారు. సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి 2027 మొదటి లేదా రెండవ త్రైమాసికం (క్వార్టర్) వరకు సమయం పట్టవచ్చు.
“ఇరాన్ ఈ కార్డును ఒక్కసారే ఉపయోగించగలదు”: అమెరికా
ఈ పరిణామాలపై అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి (Energy Secretary) క్రిస్ రైట్ స్పందిస్తూ.. ఈ యుద్ధం తర్వాత గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ కు ఉన్న ఏకఛత్రాధిపత్యం ఎప్పటికీ అంతమైపోతుందని అభిప్రాయపడ్డారు. క్రిస్ రైట్ ప్రకారం.. గల్ఫ్ దేశాలు ఇప్పుడు హోర్ముజ్ జలసంధిని దాటవేస్తూ ప్రత్యామ్నాయ పైప్లైన్ మార్గాలను సిద్ధం చేసుకుంటున్నాయి. “ఇరాన్ ఈ సముద్ర దిగ్బంధన కార్డును కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలదు. భవిష్యత్తులో పర్షియన్ గల్ఫ్ నుండి ఇంధనాన్ని బయటకు పంపడానికి అనేక ఇతర మార్గాలు సిద్ధమవుతాయి. దీనివల్ల హోర్ముజ్ ప్రాధాన్యత తగ్గొచ్చు. కానీ, గల్ఫ్ దేశాల చమురు ఉత్పత్తి ప్రాముఖ్యత మాత్రం ఎప్పటికీ తగ్గదు” అని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..