
ఈశాన్య థాయ్లాండ్లో గుండెలవిసే విషాదం చోటుచేసుకుంది. ఒక 11 ఏళ్ల బాలుడు నడిపిన పికప్ ట్రక్కు నియంత్రణ కోల్పోయి రోడ్డుపై వెళ్తున్న బౌద్ధ సన్యాసుల ఊరేగింపుపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది బౌద్ధ సన్యాసులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ముక్దహాన్ ప్రావిన్స్లో తీర్థయాత్రలో భాగంగా 35 మంది సన్యాసులు, ఐదుగురు భక్తులు కలిసి ఒక రహదారి గుండా నడుచుకుంటూ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద తీవ్రతకు ఐదుగురు సన్యాసులు ఘటనా స్థలంలోనే చనిపోగా, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన మరో నలుగురు చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఘటన జరిగిన సమయంలో రోడ్డు పక్కన కాషాయ వస్త్రాలు, సన్యాసుల సామాన్లు, ధ్వంసమైన వాహన భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు హృదయవిదారకంగా మారాయి.
పోలీసుల సమాచారం ప్రకారం, సదరు బాలుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లిదండ్రుల అనుమతి లేకుండా పికప్ ట్రక్కు తీసుకుని రోడ్డుపైకి వచ్చాడు. అనారోగ్య కారణాల వల్ల ఆ రోజు అతను పాఠశాలకు వెళ్లలేదని సమాచారం. ఇంట్లో పికప్ వ్యాన్ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చేలోపే ఈ ఘోరం జరిగిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ బాలుడు ప్రత్యేక అవసరాలు గల పిల్లాడిగా తెలుస్తోంది. ప్రస్తుతం బాలుడిని వైద్యులు, సంరక్షకుల పర్యవేక్షణలో ఉంచి విచారణ జరుపుతున్నారు.
ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న ఒక సన్యాసి మాట్లాడుతూ, తామంతా ధ్యాన మంత్రాలు జపిస్తూ వెళ్తుండగా, అకస్మాత్తుగా ఒక పికప్ ట్రక్కు పూర్తి వేగంతో దూసుకొచ్చి ఢీకొట్టిందని, వరుసలో ఉన్న కొందరు సన్యాసులు గాల్లోకి ఎగిరిపడ్డారని కన్నీటిపర్యంతమయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న మరికొందరు సన్యాసుల పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర రక్తదానం చేయాలని ముక్దహాన్ ఆసుపత్రి విజ్ఞప్తి చేసింది.
థాయ్లాండ్ సంస్కృతిలో బౌద్ధ సన్యాసులకు అత్యున్నత గౌరవం ఉంటుంది. ఈ ఘటనపై ముక్దహాన్ ప్రావిన్షియల్ గవర్నర్ వోరాయన్ బున్నారత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలో రహదారి భద్రతపై కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఈ ప్రమాదం అందరికీ ఒక పెద్ద గుణపాఠం కావాలని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..