కరోనా మహమ్మారి వ్యాప్తి నుంచి దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, మసీదులలో ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలన్ని సడలించారు. కానీ కానీ దేశాల్లో మసీదులు, ప్రార్థన మందిరాలలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా సౌదీ ఆరేబియాలో వ్యాక్సినేషన్ చేసుకున్న వారికి మాత్రమే మసీదుల్లో అనుమతి ఉంటుందని చెబుతోంది. గ్రాండ్, ప్రొఫెట్ మసీదులో ఉమ్రా, ప్రార్థనలపై సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా కీలక ప్రకటన చేసింది. ఆదివారం నుంచి కేవలం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ రెండు మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ దేశ మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిబంధనలు అక్టోబర్ 10 ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న సందర్శకులు గ్రాండ్, ప్రొఫెట్ మసీదులో ఉమ్రా, ప్రార్థనలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది.
యాత్రికులు ఎవరైతే ఇప్పటికే ఈ మసీదుల్లో ఉమ్రా, ప్రార్థనల కోసం రిజర్వేషన్ చేసుకుని పర్మిట్ పొందారో వారు యాత్రకు 48 గంటల ముందు రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్న అనుమతి ఇస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు. లేనిపక్షంలో వారి పర్మిట్ రద్దు చేస్తామని తెలిపింది. అంటువ్యాధికి సంబంధించిన అన్ని ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలు పబ్లిక్ హెల్త్ అథారిటీ నిరంతర మూల్యాంకనానికి లోబడి ఉంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అందుకే కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.