Korea War Tension: యుద్ధానికి సై అంటోన్న మరో రెండు దేశాలు.. క్షిపణులు ప్రయోగించి కయ్యానికి కాలుదువ్వుతున్న నార్త్ కొరియా

|

Oct 08, 2022 | 9:07 AM

అంతర్జాతీయ ఆంక్షలను సైతం లెక్కపెట్టడం లేదు కిమ్‌ జోంగ్‌ ఉన్‌. దేశ అణ్వాయుధ సంపత్తిని బలోపేతం చేసేందుకు అగ్రదేశాల ఆంక్షలను ధిక్కరిస్తున్నారు. అణ్వాయుధ దేశంగా అమెరికా గుర్తింపు పొందడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు స్పష్టం అవుతోంది.

Korea War Tension: యుద్ధానికి సై అంటోన్న మరో రెండు దేశాలు.. క్షిపణులు ప్రయోగించి కయ్యానికి కాలుదువ్వుతున్న నార్త్ కొరియా
North Korean Tension
Follow us on

యుద్ధం మిగిల్చే విధ్వంసం మాటలకు అందదు.! ఆ వినాశనం మామూలుగా ఉండదు.! ఆ ఎఫెక్ట్‌ నుంచి కోలువడానికి పదులు, వందల ఏళ్లు కూడా సరిపోవు. ఇప్పటికే ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నిరాటకంగా కొనసాగుతోంది. మరోవైపు తైవాన్‌పై ఏక్షణమైనా దాడి చేసేందుకు చైనా ఉవ్విళ్లూరుతోంది. ఇది చాలదా అన్నట్టు తాజాగా ఉత్తరకొరియా, దక్షిణ కొరియాలు జెట్‌ ఫైటర్లతో సవాళ్లు విసురుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం తప్పదనే సంకేతాలు ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి.

కొరియా సరిహద్దులో మరోసారి కవ్వింపు చర్యలకు దిగారు ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌. ఈసారి జపాన్‌ మీదుగా బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించి పుండు మీద కారం జల్లారు. 4వేల 600 కిలోమీటర్ల సుదూర లక్ష్యాలను ఛేదించే మిస్సైల్‌ను జపాన్‌ గగనతలం మీదుగా ప్రయోగించింది నార్త్‌ కొరియా. ఈ క్షిపణి ప్రయోగంతో ఒకేసారి అటు అమెరికాకు, ఇటు జపాన్‌కు హెచ్చరికలు పంపింది ఉత్తర కొరియా. అయితే జపాన్‌ గగనతలం మీదుగా క్షిపణి ప్రయోగం నిర్వహించడంపై ఆ దేశం తీవ్రంగా స్పందించింది. ఉత్తరకొరియా యాక్షన్‌కు రియాక్షన్‌గా అమెరికాతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టింది జపాన్‌. అదే టైమ్‌లో తమ దేశ ప్రజలను అప్రమత్తం చేసింది జపాన్‌.

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది ఇప్పటి వరకూ 40 క్షిపణులు పరీక్షించింది ఉత్తర కొరియా.. గత 10 రోజుల వ్యవధిలోనే 5 మిస్సైల్స్‌ ప్రయోగించి తగ్గేదేలేదంటున్నాడు కిమ్‌.. తాజాగా ప్రయోగించిన మధ్యంతర శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి ఏకంగా జపాన్‌ మీదుగా దూసుకుపోయింది. 4,600 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పసిఫిక్‌ మహాసముద్రంలో కూలిపోయింది. ఇది రెచ్చగొట్టే చర్య, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అంటూ జపాన్‌, దక్షిణ కొరియాలు తీవ్రంగా మండిపడ్డాయి.

ఉత్త ర కొరియా ప్రయోగించిన క్షిపణి హ్వాసాంగ్-12’ అయి ఉండొచ్చని జపాన్ రక్షణ మంత్రి యసుకాజు హమదా అభిప్రాయపడ్డారు. కిమ్‌ చేసిన చేసిన పనితో ఉలిక్కిపడ్డ జపాన్‌ తన క్షిపణి హెచ్చరిక వ్యవస్థను ‘యాక్టివేట్‌’ చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది.

మరోవైపు ఉత్తర కొరియాను హెచ్చరించే దిశగా దక్షిణ కొరియా, అమెరికాలు సంయుక్తంగా వైమానిక విన్యాసాలు నిర్వహించాయి. దక్షిణ కొరియాకు చెందిన నాలుగు ఎఫ్‌-15కే యుద్ధ విమానాలు, అమెరికాకు చెందిన నాలుగు ఎఫ్‌-16 జెట్‌లు ఈ డ్రిల్‌లో పాల్గొన్నాయి. ఈ విమానాలు జనావాసాలు లేని జిక్డో ద్వీపంలో రెండు JDAM బాంబులను పరీక్షించాయి. ఉత్తర, దక్షిణ కొరియాల సరిహద్దుల్లో రెండు దేశాలకు చెందిన యుద్ధవిమానాలు పోటాపోటీగా గాల్లో చక్కర్లు కొట్టాయి. కవ్వింపు చర్యల్లో భాగంగా ఉత్తర కొరియా రెండు ఖండాంతర క్షిపణులను తన తూర్పు జలాల్లో ప్రయోగించింది. దీంతోపాటు సరిహద్దుల్లో 12 యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టించింది. వీటిలో ఎనిమిది ఫైటర్‌ జెట్లు, నాలుగు బాంబర్లు ఉన్నాయి. వెంటనే దక్షిణ కొరియా కూడా 30 ఫైటర్‌ జెట్లను మరికొన్ని యుద్ధ విమానాలను బదులుగా పంపింది. కొద్దిసేపటి తరువాత అవి తిరిగి వాటి స్థావరాలకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి చల్లబడింది.

 

ఇటీవల జపాన్‌ మీదుగా అణు క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించిన నేపథ్యంలో కొరియా ద్వీపకల్పం సమీపంలోని జలాల్లో యుద్ధవిమాన వాహకనౌక యూఎస్‌ఎస్‌ రోనాల్డ్‌ రీగన్‌ను అమెరికా తిరిగి మోహరించింది. ఈ నేపథ్యంలో ప్యాంగ్యాంగ్‌ క్షిపణుల ప్రయోగం జరపడం గమనార్హం. కాగా ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగానికి ప్రతిగా దక్షిణ కొరియా చేపట్టిన మిస్సైల్‌ ప్రయోగం విఫలం అయ్యింది. గాంగ్నెయుంగ్‌ నగరంలోని ఎయిర్‌ ఫోర్స్‌ బేస్‌లో హ్యూమూ-2 క్షిపణిని ప్రయోగించిన కొద్దిసేపటికే నేల కూలింది.

అంతర్జాతీయ ఆంక్షలను సైతం లెక్కపెట్టడం లేదు కిమ్‌ జోంగ్‌ ఉన్‌. దేశ అణ్వాయుధ సంపత్తిని బలోపేతం చేసేందుకు అగ్రదేశాల ఆంక్షలను ధిక్కరిస్తున్నారు. అణ్వాయుధ దేశంగా అమెరికా గుర్తింపు పొందడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు స్పష్టం అవుతోంది. తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయించడమే కిమ్‌ లక్ష్యమని పలువురు నిపుణులంటున్నారు. మరోవైపు కవ్వింపు చర్యలకు బలమైన రియాక్షన్‌ ఉంటుందని ప్యాంగ్యాంగ్‌ను హెచ్చరించింది దక్షిణ కొరియా.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ఉత్తర కొరియా చర్యలకు రష్యా, చైనాల నుంచి లభిస్తున్న రక్షణే కారణమని అమెరికా నిందించింది. జపాన్‌పై నుంచి క్షిపణి పరీక్షకు ప్రతిస్పందనగా జపాన్‌-దక్షిణ కొరియా యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. జపాన్‌ మీదుగా క్షిపణి ప్రయోగాన్ని అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌తో పాటు భారత్‌ కూడా గట్టిగా ఖండించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..