అమెరికా రగిల్చిన చిచ్చు..! ఆయిల్‌ కోసం సాగుతున్న యుద్ధంతో ప్రపంచం ఆగమాగం..

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు 18 శాతం పెరిగాయని రీసెర్చ్‌లు చెబుతున్నాయి. వస్తువుల ధరలు పెరగడం వల్ల 'పర్చేజింగ్ పవర్' పడిపోతుందనే హెచ్చరిలు వినిపిస్తున్నాయి. ఇది మార్కెట్లో డిమాండ్‌ను తగ్గించి, ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం వైపు నెడుతుందని చెబుతున్నారు. ఇరాన్ చెప్పినట్టు యుద్ధం సుదీర్ఘకాలం నడిస్తే.. వ్యాపార రంగాలు కూడా తలకిందులు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

అమెరికా రగిల్చిన చిచ్చు..! ఆయిల్‌ కోసం సాగుతున్న యుద్ధంతో ప్రపంచం ఆగమాగం..
Iran war strategy analysis

Edited By:

Updated on: Mar 09, 2026 | 9:54 PM

‘ఇరాన్‌తో అంత ఈజీ కాదు’ అనుకునేలా ఉండాలని ముందే యుద్ధవ్యూహాన్ని డిజైన్ చేసి పెట్టుకుంది ఇరాన్. దీన్నో ‘ర్యాపిడ్ వార్’గా ముగించేయొచ్చనుకున్నారు ట్రంప్. సుప్రీం లీడర్‌ చనిపోయినా.. ఒకేసారి 40 మంది డిఫెన్స్ కమాండర్స్‌ను హతమార్చినా.. యుద్ధం రెండో వారంలోకి వచ్చిందంటేనే అమెరికా ప్లాన్-ఏ ఫెయిల్ అయిందని మీనింగ్. ప్రపంచానికి ఈ విషయం ఎప్పుడో అర్ధమైంది.. ఒక్క ట్రంప్‌కు తప్ప. సో, అల్టిమేట్‌గా ఇరాన్ ప్లాన్ ఒక్కటే. అంతటి అమెరికానే యుద్ధానికి దిగినప్పుడు ఓటమి తప్పదని తెలుసు. కాని, తన ఓటమి ప్రత్యర్థికి గుర్తుండిపోయేలా చేయాలనుకుంటోంది. చేస్తోంది కూడా. అమెరికా ఆయుధాగారం ఖాళీ అవుతోంది. ఆర్థిక విపత్తు రాబోతోంది. ఇరాన్ స్ట్రాటజీ వల్లే.. భారత్‌లో వంట గ్యాస్ ధర పెరిగింది. పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ 350 రూపాయలైంది. త్వరలో దేశంలో యూరియా కొరత వచ్చినా రావొచ్చు. అంతటితోనే అయిపోదు. సంపన్నుల నుంచి సామాన్యుల వరకు.. స్టాక్‌మార్కెట్ నుంచి సేవింగ్స్ వరకు అన్నిటిపైనా ఇంపాక్ట్ తప్పదు. దీనంతటికీ కారణం.. ట్రంప్ అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం.

పక్కిళ్లు తగలబడుతుంటే తన ఇంటికి నీళ్లు చల్లుకున్నాడట. ఇది విని నవ్వుకుంటాం గానీ, ఇప్పుడదే పరిస్థితి ఉంది. ఓ ఉదాహరణ చెప్పుకుందాం. బంగ్లాదేశ్‌నే ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. అక్కడ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు అన్నిటినీ మూసేయాలని ఆదేశాలిచ్చారు. కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు, ల్యాబ్‌లు.. ఇవేవీ తెరవొద్దని స్ట్రిక్ట్ ఆర్డర్స్. స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ స్కూల్‌కి వెళ్లకపోతే పెట్రోల్, డీజిల్ ఆదా అవుతుంది కదా. ఆటోమేటిక్‌గా ట్రాఫిక్ తగ్గి వాహనాల ఇంధన వృధా కూడా తగ్గుతుంది. ఇలా ఆలోచించింది బంగ్లాదేశ్. ఎందుకంటే.. క్రూడాయిల్ భారాన్ని తట్టుకోలేక. ఇక పాకిస్తాన్‌లో అయితే.. లీటర్ పెట్రోల్ 321 రూపాయలు. డీజిల్ 336 రూపాయలు. అంత ధర పెట్టినా మున్ముందు పెట్రోల్, డీజిల్ దొరకదేమో అని బంక్‌ల దగ్గర బారులు. ఇదీ పాకిస్తాన్‌లో పరిస్థితి. అసలు ప్రపంచం మొత్తం ఇదే పరిస్థితి.

హోర్ముజ్ జలసంధి కేవలం చమురు రవాణాకే కాదు.. సరుకు రవాణాకు కూడా కీలకం. ఆ స్ట్రెయిట్ దగ్గర కనీసం 700 నౌకలు నిలిచిపోయాయి. సో, దిగుమతులపై ఆధారపడుతున్న దేశాలన్నీ ఆ నౌకలు రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నాయి. ఆల్రడీ క్రూడాయిల్ ధర భగ్గుమంటోంది. 100 డాలర్లను క్రాస్ చేసింది. క్రూడాయిల్ 100 డాలర్లు దాటితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఐఎమ్​ఎఫ్​ అంచనా ప్రకారం చమురు ధరలు 10 శాతం పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు అర శాతం వరకు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఎరువుల తయారీ ఖర్చు పెరుగుతుంది. విద్యుత్ ఉత్పత్తి ఖర్చూ భారం అవుతుంంది. ఇది ప్రతి కుటుంబంపైనా ధరాభారం మోపుతుంది. అసలు హోర్ముజ్‌ను మూసేసిన వెంటనే ప్రపంచ మార్కెట్లో చమురు ధర 8 శాతం పెరిగింది. యూరప్‌లో అయితే గ్యాస్ ధరలు ఒకేసారి 20 శాతం పెరిగాయి. యుద్ధం రెండోవారంలోకి ఎంటర్ అవడంతో అక్కడ గ్యాస్ ధరలు 50 శాతం దాకా పెరిగాయి. అసలే.. యూరప్ దగ్గర గ్యాస్ నిల్వలు అడుగంటాయి. ఇప్పుడు.. మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది.

ఇవి కూడా చదవండి

క్రూడాయిల్ రేట్ పెరుగుతున్నందున ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. పశ్చిమాసియా నుంచి ఎల్​ఎన్‌జీ సప్లై నిలిచిపోవడంతో ముఖ్యంగా దక్షిణాసియా దేశాల ప్రజలపై మోయలేని భారం పడుతోంది. అయితే.. భారత్‌పై మాత్రమే ఈ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి రష్యా నుంచి భారత్‌కు ఆయిల్ వస్తోంది. కాకపోతే.. భారత్‌పై మరో రకమైన ఇంపాక్ట్ పడబోతోంది.

పశ్చిమాసియా దేశాలకు అవసరమైన ఉల్లిపాయలు భారత్ నుంచి 15 శాతం ఎగుమతి అవుతాయి. పోర్ట్‌లు మూసేయడంతో ఇప్పుడా ఉల్లి మొత్తం మార్కెట్లోకి వచ్చేస్తుంది. ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఒక్క ఉల్లిపాయలే కాదు.. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, సుగంధ ద్రవ్యాల ఎగుమతులదీ ఇదే పరిస్థితి. హోర్ముజ్ జలసంధి మూసేయడంతో భారత్ నుంచి టెక్స్‌టైల్ ఎగుమతులకు బ్రేక్ పడుతోంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతులకూ తిప్పలు తప్పేలా లేవు. పోనీ.. రూట్ మారుద్దామా అంటే 20-25 రోజులు అదనపు సమయం పడుతుంది. ఆ ప్రయాణ ఖర్చులు భరించడం కష్టం. ఇక.. రాబోయే అతిపెద్ద సమస్య.. ఎరువులు. ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున యూరియా, అమ్మోనియా దిగుమతి చేసుకుంటోంది భారత్. పైగా, యూరియా తయారీ ప్లాంట్లకు గ్యాస్ కావాలి. ఖతార్ నుంచి వచ్చే గ్యాస్ కూడా ఆగిపోవడంతో ఇది పెద్ద సంక్షోభానికి దారి తీసే ప్రమాదం ఉందనే వాదన వినిపిస్తోంది. యూరియా తయారీకి సల్ఫ్యూరిక్ యాసిడ్ కావాలి. దాదాపు 65 శాతం సల్ఫర్‌ను దిగుమతి చేసుకుంటున్నాం మనం. ఇదంతా యూరియాపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. జూన్‌ వస్తే ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. సో, యుద్ధం త్వరగా ముగిసిపోతేనే అంతా సవ్యంగా సాగుతుంది. ఇక సిమెంట్ ఉత్పత్తికి లైమ్‌స్టోన్, జిప్సం కావాలి. వీటిని 60 శాతానికిపైగా దిగుమతి చేసుకుంటోంది భారత్. సప్లై చైన్‌పై ఎఫెక్ట్‌తో సిమెంట్ ధరలు పెరిగి, నిర్మాణరంగంపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు.. స్టీల్ తయారీకి డైరెక్ట్ రెడ్యూస్డ్ ఐరన్ కావాలి. ఈ ముడిపదార్ధాన్ని 60 శాతం దిగుమతి చేసుకుంటున్నాం. దీని సప్లైలో అంతరాయం వస్తే.. స్టీల్ ప్రొడక్షన్‌పైనా, నిర్మాణరంగంపైనా ఇంపాక్ట్ పడుతుంది. మొత్తంగా.. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ప్రపంచంవ్యాప్తంగా ప్రభావం చూపిస్తోంది.

ఇరాన్‌తో యుద్ధానికే అమెరికా దగ్గర ఆయుధాలు అడుగంటాయా? అది కూడా 10 రోజులకే? ప్రపంచంలోనే భీకర బాంబులు, రక్షణ బలం ఉన్న అమెరికాకు ఆయుధాల కొరత వచ్చిందంటే నమ్మరెవరూ. కాని, అదే నిజం. అమెరికా ఏడాదికి కేవలం 12 యూనిట్ల ‘స్టాండర్డ్ మిస్సైల్-3’ క్షిపణులను మాత్రమే తయారు చేయగలదు. వీటినే ఇంటర్‌సెప్టర్స్ అంటారు. కాని, ఇరాన్ డ్రోన్లను అడ్డుకోడానికి డజన్ల కొద్దీ మిస్సైల్స్‌ను వాడుతోంది. అంటే.. ఏడాదంతా కష్టపడి తయారు చేసిన ఇంటర్‌సెప్టర్స్‌ను కొన్ని గంటల్లో వాడాల్సి వస్తోంది. ఇక 155mm ఆర్టిలరీ షెల్స్ పరిస్థితీ అంతే. ఉక్రెయిన్‌కే 20 లక్షల షెల్స్ పంపింది. ఇప్పుడు ఇరాన్‌తో యుద్ధానికి వాడుతోంది. కాని, ఈ ఆర్టిలరీ షెల్స్‌ను నెలకు 14వేలు మాత్రమే తయారుచేసే కెపాసిటీ ఉంది అమెరికా దగ్గర. ఈ సామర్ధ్యాన్ని 60వేలకు పెంచారు. బట్.. ప్రొడక్షన్ కంటే యుద్ధంలో ఖర్చు చేస్తున్న షెల్స్ ఎక్కువగా ఉన్నాయి. సో, ఖాళీ అవుతున్న అమెరికా ఆయుధాగారాన్ని మళ్లీ పూర్తిస్థాయిలో నింపాలంటే.. ఐదారేళ్లు పడుతుంది. ఇదీ.. ఇరాన్ అనుసరిస్తున్న స్ట్రాటజీ. పైరిక్ విక్టరీకి అర్థం ఇదే.

అమెరికా డిఫెన్స్ బడ్జెట్ చాలా పెద్దది. ప్రపంచంలో మరే దేశం ఆ స్థాయిలో ఖర్చు పెట్టదు. 2026లో అమెరికా రక్షణ వ్యయం 80 లక్షల కోట్ల రూపాయలు. అమెరికా దగ్గర సుమారు 3,700 న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉన్నాయి. అందులో 1,770 యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యాధునిక మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అమెరికా దగ్గర ఉన్నాయి. పాట్రియాట్ మిస్సైల్ సిస్టమ్, థాడ్ సిస్టమ్, ఎస్ఎం-3 ఇంటర్‌సెప్టర్స్ కలిసి ఒక మల్టీ లేయర్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌గా పనిచేస్తాయి. బాగానే ఉంది గానీ.. వీటిని కొన్నేళ్లుగా ఖర్చు చేస్తూనే ఉంది అమెరికా. రష్యా నుంచి ఉక్రెయిన్‌ను కాపాడడానికి ఇచ్చింది. ఇప్పుడు ఇరాన్ నుంచి రక్షణ కోసం వాడుతోంది. ఇరాన్‌పై అటాక్స్ ప్రారంభించిన తరువాత.. మొదటి 100 గంటల్లోనే 32వేల 320 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అమెరికా. ఇరాన్‌పై మొదటిరోజు దాడికే.. అమెరికాకు 8వేల 221 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ లెక్కన ఈ వారంలో అమెరికా చేసిన ఖర్చు.. 55వేల 362 కోట్ల రూపాయలు.

పైగా.. అత్యంత ఖరీదైన మిస్సైల్స్ వాడుతోంది అమెరికా. అమెరికా నౌకలు, సబ్‌మరైన్ల నుంచి ప్రయోగించే టోమాహాక్ లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్స్‌ను.. ఇరాన్‌లోని కమాండ్ సెంటర్లు, రాడార్ వ్యవస్థలపై దాడులకు వాడుతోంది. ఇక థాడ్ ఇంటర్‌సెప్టర్ మిస్సైల్స్‌ను ఉపయోగిస్తోంది. ఒక్కో థాడ్ ఇంటర్‌సెప్టర్ మిస్సైల్ కాస్ట్ 120 కోట్ల రూపాయలు. ఇక ఇరాన్ నుంచి వచ్చే బాలిస్టిక్ మిస్సైళ్లను అడ్డుకునేందుకు పాట్రియాట్ మిస్సైల్ సిస్టమ్‌ను వాడుతోంది. ఈ పాట్రియాట్ మిస్సైల్స్‌ను ఏడాదికి 600 నుంచి 650 మాత్రమే తయారుచేయగలదు అమెరికా. ఇప్పటికైతే.. అగ్రరాజ్యం దగ్గర కేవలం 25 శాతం పాట్రియాట్ మిస్సైల్స్ మాత్రమే స్టాక్ ఉన్నాయి. థాడ్ ఇంటర్‌సెప్టర్స్‌ను ఏడాదికి 96, టోమాహాక్ క్రూయిజ్ మిస్సైల్స్‌ను సంవత్సరానికి వెయ్యి వరకు తయారు చేయగలదు. ప్రస్తుతం వీటి నిల్వలు కూడా అడుగంటాయి. ఇదే వేగంతో అమెరికా యుద్ధం చేస్తే.. మరో 10 రోజుల్లో ఎస్ఎం-3, ఎస్ఎం-6, పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్స్ మిస్సైల్స్ అట్టడుగు స్థాయికి పడిపోతాయని స్వయంగా పెంటగానే ట్రంప్ ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది.

పైగా.. లక్షల కోట్లు ఉన్నాయి కదా అని ఇప్పటికిప్పుడు ఆయుధాలను తయారుచేయలేదు అమెరికా. మిసైల్ తయారీ అనేది ఒక్క ఫ్యాక్టరీ పని కాదు. ఇందులో అనేక భాగాలు ఉంటాయి. మిసైల్ తయారీకి పెద్ద సప్లై చైన్ అవసరం. సాలిడ్ రాకెట్ మోటార్స్, సెన్సార్స్, క్యాస్టింగ్స్, వార్ హెడ్స్.. ఇలా సరఫరా వ్యవస్థ ఉంటుంది. ఇవన్నీ ఎట్ ఏ టైమ్ పనిచేసి ప్రొడక్షన్ ఇస్తేనే మిస్సైల్స్ బయటకు వస్తాయి. ఆల్రడీ ఉక్రెయిన్‌కు ఇచ్చింది. ఇప్పుడు ఇరాన్‌లోనూ వాడుతుండడంతో అమెరికా దగ్గర ఆయుధాల కొరత వచ్చింది.

ఖర్చంటే మిస్సైల్స్ తయారీ ఒక్కటే కాదు. Center for Strategic and International Studies విశ్లేషణ ప్రకారం.. మూడు ప్రధాన రంగాల్లో ఎక్కువ ఖర్చు అవుతోంది అమెరికాకు. వైమానిక ఆపరేషన్ల కోసం రోజుకు 276 కోట్ల రూపాయలు, నౌకాదళ ఆపరేషన్లకు రోజుకు 138 కోట్లు, గ్రౌండ్ ఆపరేషన్స్ కోసం రోజుకు 15 కోట్లు ఖర్చు చేస్తోంది.

ఇంతేనా అనుకోవద్దు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సైనిక వ్యవస్థలు అమెరికావే. ట్యాంకర్ & కార్గో విమానాల కోసం రోజుకు 83 కోట్ల రూపాయలు, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఎయిర్ వింగ్ కోసం రోజుకు 46 కోట్ల రూపాయలు, నాన్-స్టెల్త్ ఫైటర్ జెట్స్ కోసం రోజుకు మరో 46 కోట్ల రూపాయలు, స్టెల్త్ ఫైటర్ జెట్స్ కోసం కూడా రోజుకు 46 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఇదంతా ఎయిర్ డిఫెన్స్ కోసమే. ఇక నేవీ డిఫెన్స్ కోసం చేస్తున్న ఖర్చు వేరే. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ కోసం రోజుకు 55 కోట్ల రూపాయలు, డిస్ట్రాయర్ నౌక కోసం రోజుకు 46 కోట్లు, గ్రౌండ్ ఆపరేషన్స్‌లో భాగంగా ఆర్టిలరీ బ్రిగేడ్ కోసం రోజుకు 10 కోట్లు, నేషనల్ గార్డ్ బెటాలియన్ కోసం రోజుకు మరో 10 కోట్లు ఖర్చు చేస్తోంది. మరి ఊరికే అవ్వవు కదా రోజుకు 8వేల కోట్లూ..!. ఈ యుద్ధమే గనక సుదీర్ఘ కాలం సాగితే.. కనీసం 19 లక్షల 35వేల 780 కోట్ల రూపాయలు అమెరికా ఖర్చు చేయాల్సి వస్తుందని పెన్ వార్టన్ బడ్జెట్ మోడల్ అంచనా వేసింది.

ఇంత ఖర్చు దేని కోసం చేస్తోందో తెలుసా. ఇరాన్ వాడుతున్న డ్రోన్లను పడగొట్టడానికి. కేవలం కొన్ని లక్షల రూపాయల ఖర్చుతో తయారైన డ్రోన్లను కూల్చడానికి వేల కోట్లు ఖర్చు చేస్తోంది అమెరికా. ఇలాగే మరో నాలుగు రోజులు యుద్దం కొనసాగితే డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ వార్షిక బడ్జెట్ మొత్తం ఖర్చయిపోతే పరిస్థితి ఏర్పడుతుంది. హోంల్యాండ్ సెక్యూరిటీ బడ్జెట్ ఖాళీ అయితే.. అమెరికా లోపల రక్షణ కల్పించే వ్యవస్థలు స్తంభించిపోతాయి. అమెరికా సముద్ర తీరాల పహారా నిలిచిపోతుంది. యుద్ధ సమయంలో శత్రు దేశాల నౌకలు లేదా సబ్ మెరైన్లు చొరబడే అవకాశం పెరుగుతుంది. బోర్డర్ సెక్యూరిటీ సరిహద్దులో నిఘా ఉండదు. అక్రమ వలసలు, స్మగ్లింగ్ నియంత్రణ తప్పి దేశంలోకి అరాచక శక్తులు ప్రవేశించే ప్రమాదం ఉంది. విమానాశ్రయాల్లో సెక్యూరిటీ చెకింగ్ చేసే సిబ్బందికి జీతాలు ఉండవు. దీనివల్ల విమాన సర్వీసులు రద్దు కావడమో లేదా తీవ్రమైన భద్రతా లోపాలు తలెత్తడమో జరుగుతుంది. హోంల్యాండ్ సెక్యూరిటీ బడ్జెట్ అయిపోవడం అంటే అర్థం.. ప్రభుత్వం దివాలా తీయడమనే. సో, లక్షలాది మంది భద్రతా సిబ్బందికి జీతాలు అందవు. మొత్తానికి.. ఇరాన్ కొడుతున్న ఆర్థిక దెబ్బ అమెరికాకు గట్టిగానే తగులుతోంది.

ఇందాక చెప్పుకున్నట్టు ఇరాన్‌కు ఇదేం సర్‌ప్రైజ్ అటాక్ కాదు. అందుకే, మిస్సైల్స్‌ను భారీగా తయారు చేసి పెట్టుకుంది. ఇక్కడ.. ఇరాన్ ఇస్తున్న మరో స్టేట్‌మెంట్ ఏంటంటే.. ఇప్పటిదాకా వాడింది ఫస్ట్ అండ్ సెకండ్ జనరేషన్ ఆయుధాలనేనట. గత పదేళ్లలో తయారైన ఆయుధాలను ఇంకా బయటికే తీయలేదంటోంది. వాటిని నాశనం చేయడం అంత ఈజీ కాకపోవచ్చు. ఎందుకంటే.. ఇరాన్‌లో భారీ కొండలున్నాయి. ఏ గుట్టల కింద వాటిని దాచిపెట్టిందో కనుక్కోవడం కష్టం. కనిపెట్టినా బాంబులతో దాడి చేయడమూ కష్టమే. సో, ఇరాన్ చెబుతున్నట్టు ఈ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే మాత్రం.. ప్రపంచం మరో మాంద్యాన్ని చూస్తుందేమో.

గల్ఫ్ దేశాలపై దాడి చేయబోం అని క్షమాపణలు చెప్పి మరీ స్టేట్‌మెంట్ ఇచ్చారుగా ఇరాన్ ప్రెసిడెంట్. మరెందుకని దాడి చేస్తోంది. సింపుల్. గల్ఫ్ దేశాలకు మంచి నీళ్లు కావాలన్నా ఆయిల్ అమ్ముకున్న డబ్బులతోనే కొనాలి. ఆ పరిస్థితి లేకుండా చేసింది. పైగా.. ఆరు నెలల పాటు యుద్ధాన్ని కొనసాగిస్తే.. గల్ఫ్ మొత్తం అల్లాడిపోతుంది. అప్పుడిక.. యుద్ధం ఆపేలా అమెరికాపై ఒత్తిడి తెచ్చేది గల్ఫ్ దేశాలే అవుతాయి. అంతేకాదు.. అమెరికా స్థావరాలు ఉన్నవి కూడా గల్ఫ్‌లోనే. ఆ అమెరికన్ సైనికులకీ ఆహారం దొరకడం కష్టమే. సో, ఇరాన్ గట్టి స్ట్రాటజీనే తయారు చేసుకుంది.

గల్ఫ్ పరిస్థితేమో గానీ.. అదే ఆరు నెలల పాటు యుద్ధం కొనసాగితే ప్రపంచం పరిస్థితి తలకిందులవుతుంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో విధ్వంసం కొనసాగుతోంది. యుద్ధం మొదలైన ఈ 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్త ఇన్వెస్టర్ల సంపద సుమారు 265 లక్షల కోట్లు ఆవిరైపోయిందని డేటా చెబుతోంది. దలాల్ స్ట్రీట్‌లోనూ బ్లడ్ బాత్ కనిపిస్తోంది. ఏ ఇన్వెస్టర్‌ను కదిపినా.. గుక్కపెట్టి ఏడ్చేలా ఉన్నాడు. అటు సేవింగ్స్ కూడా ఖాళీ అవుతున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు తమ పిల్లల చదువుల కోసం, రిటైర్‌మెంట్ కోసం దాచుకున్న మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ విలువ 12 నుంచి 15 శాతం పడిపోయింది. తన కళ్ల ముందే తన కష్టార్జితం కరిగిపోతుంటే దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు సామాన్యుడు.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు 18 శాతం పెరిగాయని రీసెర్చ్‌లు చెబుతున్నాయి. వస్తువుల ధరలు పెరగడం వల్ల ‘పర్చేజింగ్ పవర్’ పడిపోతుందనే హెచ్చరిలు వినిపిస్తున్నాయి. ఇది మార్కెట్లో డిమాండ్‌ను తగ్గించి, ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం వైపు నెడుతుందని చెబుతున్నారు. ఇరాన్ చెప్పినట్టు యుద్ధం సుదీర్ఘకాలం నడిస్తే.. వ్యాపార రంగాలు కూడా తలకిందులు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సప్లై చైన్ దెబ్బతినడం వల్ల పరిశ్రమలు ఉత్పత్తిని నిలిపివేసే ప్రమాదం ఏర్పడుతుంది. పైగా క్రూడాయిల్ ధరను 200 డాలర్లకు పెంచేలా తమ కార్యాచరణ ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. అదే గానీ జరిగితే.. ప్లాస్టిక్, కెమికల్స్, పెయింట్స్, ఫెర్టిలైజర్ కంపెనీల ఉత్పత్తి ఖర్చు 30 శాతం దాకా పెరుగుతుందని అంచనా.

ఆర్డర్లు ఉన్నా సరుకు పంపలేని పరిస్థితే కొనసాగితే.. MSME రంగం కుదేలవుతుంది. చిన్న పరిశ్రమలు పెరిగిన కరెంట్ బిల్లులు, రవాణా ఛార్జీలను భరించలేక మూతపడే ప్రమాదం ఉంటుంది. ఒకవిధంగా ఉపాధిరంగంపై పిడుగు పడుతున్నట్టే లెక్క. ‘కాస్ట్ కటింగ్’ పేరుతో ఉద్యోగాల కోత మొదలవొచ్చు. యూరప్, అమెరికా ఆర్థిక వ్యవస్థలు మందగిస్తే.. ఇండియన్ ఐటీ సెక్టార్‌పై ఆ ప్రభావం ఉండొచ్చు. ఇన్ని అనర్ధాలకు కారణమవుతోంది ఈ యుద్ధం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us