యుద్ధం ముగియకపోతే పరిస్థితి దారుణం.. ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ వార్నింగ్..!

నెదర్లాండ్స్‌లోని హేగ్‌ నగరంలో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భవిష్యత్తు గురించి ప్రపంచాన్ని హెచ్చరించారు. నెదర్లాండ్స్‌లో నివసిస్తున్న భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచం ఎదుర్కొంటున్న ముప్పులను హెచ్చరిస్తూనే, మరోవైపు భారతదేశం సాధిస్తున్న అద్భుతమైన ప్రగతిని, సాంకేతిక విజయాలను ప్రపంచ వేదికపై ఘనంగా చాటిచెప్పారు.

యుద్ధం ముగియకపోతే పరిస్థితి దారుణం.. ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ వార్నింగ్..!
Pm Modi Netherlands Visit

Updated on: May 16, 2026 | 5:41 PM

నెదర్లాండ్స్‌లోని హేగ్‌ నగరంలో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భవిష్యత్తు గురించి ప్రపంచాన్ని హెచ్చరించారు. నెదర్లాండ్స్‌లో నివసిస్తున్న భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచం ఎదుర్కొంటున్న ముప్పులను హెచ్చరిస్తూనే, మరోవైపు భారతదేశం సాధిస్తున్న అద్భుతమైన ప్రగతిని, సాంకేతిక విజయాలను ప్రపంచ వేదికపై ఘనంగా చాటిచెప్పారు.

ప్రస్తుత ప్రపంచ పరిస్థితులపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మానవాళి ఇప్పుడు అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. “మొదట కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది, ఆ తర్వాత యుద్ధాలు ప్రారంభమయ్యాయి, ఇప్పుడు ఇంధన సంక్షోభం ముంచుకొస్తోంది. ఈ దశాబ్దం ప్రపంచానికి విపత్తుల దశాబ్దంగా మారుతోంది” అని మోదీ వ్యాఖ్యానించారు. కొనసాగుతున్న యుద్ధాలు, అంతర్జాతీయ అస్థిరత కారణంగా గత దశాబ్దాలుగా సాధించిన పురోగతి రివర్స్ అయ్యే ప్రమాదం ఉందని, తద్వారా ప్రపంచ జనాభాలో చాలా మంది మళ్లీ పేదరికంలోకి నెట్టబడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ పరిస్థితి మారడానికి తక్షణ చర్యలు అవసరమని పిలుపునిచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా అస్థిరత ఉన్నప్పటికీ, భారతదేశం మాత్రం అప్రతిహతంగా దూసుకుపోతోందని ప్రధాని స్పష్టం చేశారు. దేశం సాధించిన కొన్ని కీలక విజయాలను ఆయన వివరించారు. ఇటీవలి కాలంలో భారత్ భూమికి, చంద్రునికి మధ్య ఉన్న దూరం కంటే 11 రెట్లు ఎక్కువ పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను వేసి డిజిటల్ విప్లవానికి బాటలు వేసిందన్నారు. పదేళ్ల క్రితం మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకున్న భారత్, నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా ఎదిగిందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) సదస్సుతో పాటు, జీ-20 సదస్సును భారత్ అత్యంత విజయవంతంగా నిర్వహించిందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. “నేటి భారతదేశం ఆవిష్కరణల శక్తి కేంద్రంగా మారిందన్న ప్రధాని.. మన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.” అని మోదీ స్పష్టం చేశారు.

భారత యువత ఆకాంక్షలకు ఆకాశమే హద్దు అని, అందుకే వారి ప్రయత్నాలు కూడా అపరిమితంగా ఉన్నాయని మోదీ అన్నారు. 12 ఏళ్ల క్రితం దేశంలో కేవలం 500 లోపు స్టార్టప్‌లు మాత్రమే ఉండగా, నేడు ఆ సంఖ్య 2 లక్షలు దాటింది. 2014 లో కేవలం 4 యూనికార్న్‌లు ఉంటే, ఇప్పుడు వాటి సంఖ్య 1,25,000 కు చేరిందని, ఒక్క 2025 లోనే 44,000 కొత్త స్టార్టప్‌లు నమోదయ్యే దిశగా సాగుతున్నాయని చెప్పారు. ఇవి ఏఐ, రక్షణ, అంతరిక్ష రంగాలలో అద్భుతాలు సృష్టిస్తున్నాయన్నారు.

పరిశోధనల విషయానికొస్తే, గత ఏడాది కాలంలోనే దేశంలో పది లక్షలకు పైగా పేటెంట్లు దాఖలయ్యాయని ప్రధాని వెల్లడించారు. అలాగే, సెమీకండక్టర్ రంగంలో భారత్ స్వయంసమృద్ధి సాధిస్తోందని, ప్రస్తుతం దేశంలో 12 సెమీకండక్టర్ ప్లాంట్లు పనిచేస్తుండగా, అందులో రెండు ప్లాంట్లలో ఉత్పత్తి కూడా మొదలైందని తెలిపారు. ఇకపై చిప్‌లను భారతదేశంలోనే డిజైన్ చేసి, ఇక్కడే తయారు చేస్తామని మోదీ గర్వంగా ప్రకటించారు. భారతదేశానికి కేవలం సాధారణ మార్పులు సరిపోవని, అత్యుత్తమమైన, అత్యంత వేగవంతమైన పరివర్తనే లక్ష్యంగా దేశం ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us