కయ్యాలమారి చైనా చేతిలో న్యూక్లియర్ కొరివి.. డ్రాగన్ అణు దాహం తీరనిది..!

|

Jun 21, 2024 | 4:40 PM

అమెరికా, రష్యా, చైనా..! ఈ మూడు అగ్రరాజ్యాల మధ్య.. కొన్నేళ్లుగా ఆయుధాల పోటీ నెలకొంది. నేనే నెంబర్‌ ఒన్‌ అంటే.. లేదు లేదు.. నా దగ్గరే ఎక్కువు అణు బాంబులు ఉన్నాయని ఆ దేశాలు సవాల్‌ విసురుకున్నాయి. ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాలలో 90 శాతం అమెరికా, రష్యా దగ్గరే ఉన్నాయి. ఆయుధ పోటీతో అమెరికా, రష్యాలు కాస్త అలసిపోయినా.. డర్టీ డ్రాగన్‌ అణ్వాయుధ దాహంతో రెచ్చిపోతోంది.

కయ్యాలమారి చైనా చేతిలో న్యూక్లియర్ కొరివి.. డ్రాగన్ అణు దాహం తీరనిది..!
China Nuclear Expansion
Follow us on

అణు యుద్ధం..!! ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య హైటెన్షన్‌ నెలకొన్నా యావత్ ప్రపంచాన్ని వణికించే పదం ఇది..! రెండో ప్రపంచ యుద్ధంలో ఈ న్యూక్లియర్‌ వార్‌తో.. ఏకంగా రెండు నగరాలు సర్వనాశనమయ్యాయి. లక్షలాది మంది జీవితాలను చిదిమేశాయి. రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో న్యూక్లియర్ వార్ భయాలు మళ్లీ ప్రపంచ దేశాల వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. అవసరమైతే ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు ప్రయోగించేందుకు వెనుకాడబోమని పుతిన్ ఇటీవల సంచలన ప్రకటనలతో దడపుట్టించడం తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా అణ్వాయుధాలు ప్రయోగిస్తే ఏర్పడే నష్టం ఏ స్థాయిలో ఉంటుందన్న చర్చ గత రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కొన్ని దేశాల మధ్య నెలకొన్న తీవ్ర అణ్వాయుధ పోటీ ఈ భయాలను నెక్ట్స్ రేంజ్‌కి చేర్చాయి. అయితే పొరుగు దేశం చైనా మాత్రం అణ్వాయుధ దాహంతో ఎగిరెగిరిపడుతుండటం ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేసే అంశం.

అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగితే.. అది సృష్టించే నష్టం మాటలకు, ఊహలకు అందనిది. అణుబాంబు ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో…. హిరోషిమా, నాగసాకి నగరాలను చూస్తేనే అర్థమవుతుంది. రెండో ప్రపంచ యుద్ధంలో న్యూక్లియర్ బాంబుల ప్రయోగం మిగిల్చిన వినాశనం అంతా ఇంతాకాదు. అయినా ఇప్పుడు ఇలాంటి వినాశనాన్ని సృష్టించేందుకే…కొన్ని డర్టీ కంట్రీస్ కుట్రలు పన్నుతున్నాయి. రహస్యంగా అణు ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నాయి. ఆసియాలో చైనా, పాకిస్థాన్‌కు ధీటుగా భారత్ వంటి దేశాలు కూడా ఆత్మరక్షణ కోసం వ్యూహాత్మకంగా న్యూక్లియర్ బాంబులను యేటికేడు పెంచుకుంటున్నాయి. అసలు.. ఏఏ దేశాల దగ్గర ఎన్నెన్ని అణుబాంబులు ఉన్నాయి..? న్యూక్లియర్‌ వార్‌ రేస్‌లో ఏ దేశం ముందుంది..?

Nuclear Weapons

డ్రాగన్ అణ్వాయుధ దాహం..

అమెరికా, రష్యా, చైనా..! ఈ మూడు అగ్రరాజ్యాల మధ్య.. కొన్నేళ్లుగా ఆయుధాల పోటీ నెలకొంది. నేనే నెంబర్‌ ఒన్‌ అంటే.. లేదు లేదు.. నా దగ్గరే ఎక్కువు అణు బాంబులు ఉన్నాయని ఆ దేశాలు సవాల్‌ విసురుకున్నాయి. ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాలలో 90 శాతం అమెరికా, రష్యా దగ్గరే ఉన్నాయి. అణ్వాయుధ పోటీతో అమెరికా, రష్యాలు కాస్త అలసిపోయినా.. డర్టీ డ్రాగన్‌ మాత్రం అణ్వాయుధ దాహంతో రెచ్చిపోతోంది. చైనా న్యూక్లియర్ కుతంత్రాలతో యావత్ ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. మొన్నటికి మొన్న ఆ దేశంలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన వినాశనం గురించి అందరికీ తెలుసిందే. ప్రపంచ మానవాళి ఆ పీడకలను మరిచిపోకముందే.. ఇప్పుడు ఆ దేశ అణ్వాయుధ కుతంత్రాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అణ్వాయుదాలను ఇబ్బడిముబ్బడిగా పోగేసుకుంటూ మానవాళి మరో ముప్పు వాకిట్లో నిలుపుతోంది డ్రాగన్ కంట్రీ. దీనికి సంబంధించి ఇటీవల చైనా సీక్రెట్‌ న్యూక్లియర్‌ మిషన్‌ బయటపడింది. చైనా అండర్‌గ్రౌండ్‌లో పెద్ద పెద్ద బాంబులు, న్యూక్లియర్ బాంబులను భద్రపరిచింది. లక్షలు, కోట్ల మందిని చంపేసే బాంబులు ఇప్పుడు డ్రాగన్ కంట్రీ అండర్‌గ్రౌండ్‌లో ఉన్నాయి.

China Nuclear Weapons

అమెరికా, రష్యాతో పోటీపడుతున్న డ్రాగన్..

గత ఏడాది కాలంలో న్యూక్లియర్ బాంబులను పెంచుకోవడంలో చైనా అందరికీ కంటే ముందుంది. డ్రాగన్ కంట్రీ గత ఏడాది కాలంలో అణ్వాయుధాలను భారీగా పెంచున్నట్లు తాజా నివేదికలో వెల్లడయ్యింది. ఏడాది క్రితంతో పోలిస్తే జనవరి 2024లో చైనా దగ్గర న్యూక్లియర్ వార్‌హెడ్స్ సంఖ్య 410 నుంచి 500కు పెరిగాయి. కయ్యాలమారి చైనా అణ్వాయుధ దాహాంతో పేట్రేగిపోతోందని ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. కేవలం ఏడాది కాలంలోనే చైనా అదనంగా 90 న్యూక్లియర్ వార్‌హెడ్స్‌ను సమకూర్చుకుంది. 2030నాటికి ఈ సంఖ్యను రెండింతలు ( అంటే 1000) చేసుకోవాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

అమెరికా, రష్యాతో పోల్చితే చైనా దగ్గర అణ్వాయుధాలు తక్కువే. వాస్తవానికి కోల్డ్ వార్ కాలం నాటితో పోల్చితే అమెరికా, రష్యా దగ్గర అణ్వాయుధాలను గణనీయంగా తగ్గించుకున్నాయి.  వాస్తవానికి కోల్డ్ వార్ సమయంలో అమెరికా, రష్యాల దగ్గర 70 వేలకు పైగా అణ్వాయుధాలు ఉండేవి.  అయితే ఆ తర్వాత క్రమంగా ఆ రెండు దేశాలు అణ్వాయుధాలను తగ్గించుకుంటూ వస్తున్నాయి. అయితే ఆధిపత్య ఆకాంక్షతో రగిలిపోతున్న చైనా.. తన అణ్వాయుధాలను ఏటికేడు పెంచుకుంటూ పోతుండటమే ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేసే అంశం. ఈ దశాబ్ధం చివరినాటికి చైనా తమ ఖండాంతర క్షిపణుల సంఖ్యను అమెరికా లేదా రష్యాకు సమానంగా పెంచుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

China Nuclear Warheads

ఏ దేశం దగ్గర ఎన్ని అణ్వస్త్రాలున్నాయి..?

2024 జనవరినాటికి ప్రపంచ వ్యాప్తంగా 12,121 అణ్వస్త్రాలు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే అణ్వస్త్రాల సంఖ్య 60 పెరిగింది. వివిధ దేశాల దగ్గర ప్రస్తుతమున్న అణ్వాయుధాల విషయానికి వస్తే అత్యధికంగా రష్యా వద్ద  5,580 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. ఆ తర్వాత స్థానం అమెరికాది. అమెరికా ఆయుధాగారంలో మొత్తం 5,044 అణ్వాయుధాలున్నాయన్నది తాజాగా సిప్రీ నివేదిక అంచనా. ఆ తర్వాత చైనా 500 అణ్వాయుధాలతో మూడో స్థానంలో ఉండగా.. 290 న్యూక్లియర్ వార్ హెడ్స్‌తో ఫ్రాన్స్ నాల్గో స్థానంలో ఉండగా, బ్రిటన్ 225 అణ్వాయుధాలతో ఐదో స్థానంలో ఉంది. భారత్ వద్ద 172, పాకిస్తాన్ వద్ద 170, ఇజ్రాయెల్ వద్ద 90, ఉత్తర కొరియా వద్ద 50 అణ్వాయుధాలు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. భారత్ దగ్గరున్న అణ్వస్త్రాల సంఖ్యతో పోల్చితే చైనా దగ్గర మూడింతలు ఎక్కువ ఉన్నాయి. ఓ రకంగా ఏటికేడు అణ్వస్త్రాలను పెంచుకుంటూ చైనా దూకుడు కొనసాగిస్తుండడంతో ఆ మేరకు అణ్వస్త్రాలను పెంచుకునేలా భారత్‌పై ఒత్తిడి పెరుగుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అణ్వస్త్రాల్లో ఏ క్షణమైనా ప్రయోగానికి సిద్ధంగా ఉంచిన అణ్వస్త్రాల సంఖ్య 2,100గా సిప్రి తన నివేదికలో వెల్లడించింది. ప్రయోగానికి సిద్ధంగా ఉంచిన అణ్వస్త్రాల్లో అత్యధికం అమెరికా, రష్యా దేశాల దగ్గరే ఉన్నాయి. తొలిసారిగా చైనా కూడా 24 అణ్వస్త్రాలను ప్రయోగ సన్నద్ధతతో కూడిన స్థితిలో ఉంచింది.

Nuclear Warheads Country Wise

పాక్ కంటే భారత్ దగ్గరే అణ్వాయుధాలు ఎక్కువ..

చైనా, అమెరికా, రష్యాతో పాటు భారత్, పాక్, బ్రిటన్, ఫ్రాన్స్, ఉత్తరకొరియా, ఇజ్రాయెల్ దేశాలు అణ్వాయుధ రేసులో ముందున్నాయి. ఈ 9 అణ్వాయుధ దేశాలు.. న్యూక్లియర్ బాంబులను ఆధునీకరించే కార్యక్రమాలను 2023లో కూడా చురుగ్గా కొనసాగించాయి. స్వీడన్‌కు చెందిన మేథో సంస్థ స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) నివేదిక మేరకు ప్రస్తుతం పాకిస్థాన్ దగ్గర కంటే భారత్ దగ్గరే ఎక్కువ న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉన్నాయి. పాకిస్థాన్ దగ్గర 170, భారత్ దగ్గర 172 వార్ హెడ్స్ ఉన్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. 2023 జనవరి నాటికి భారత్ కంటే పాకిస్థాన్ దగ్గరే ఎక్కువ న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉండేవి. సిప్రి గణాంకాల మేరకు 2023 జనవరిలో పాకిస్థాన్ దగ్గర 170 వార్‌హెడ్స్ ఉండగా.. భారత్ వద్ద 164 ఉండేవి. అయితే ఇప్పుడు అదనంగా 8 వార్‌హెడ్స్‌ను సమకూర్చుకోవడం ద్వారా గత ఏడాది కాలంలో భారత్.. పాకిస్థాన్‌ను అధిగమించింది. చైనా వ్యాప్తంగా అన్ని సుదూర టార్గెట్స్‌ను చేరుకునే సామర్థ్యంతో అణ్వాయుధాలను సిద్ధం చేసుకోవడంపై భారత్ దృష్టిసారించినట్లు సిప్రి నివేదిక తెలిపింది.

మానవాళికి అత్యంత ప్రమాదకారిగా కిమ్..

న్యూక్లియర్ బాంబుల ముప్పుకు సంబంధించి ఎప్పుడు ఎక్కడ చర్చ జరిగినా.. నార్త్ కొరియా నియంత కిమ్ జాంగ్ వున్ అందరికీ గుర్తుకు వస్తాడు. ప్రపంచాన్ని భస్మం చేస్తా.. నాశనం చేస్తా అంటూ శపథాలు చేసే రాక్షసులను పురాణాల్లో చూశాం. కానీ ఇప్పుడు కిమ్‌ జాంగ్‌ వున్‌ ఒక మోడ్రన్‌ టైమ్‌ భస్మాసురుడు.అవకాశం దొరికినప్పుడల్లా పెద్ద పెద్ద బాంబులను ప్రదర్శిస్తుంటాడు. అణ్వాయుధాలతో శత్రు దేశాలను లేపేస్తామంటూ ఇతర దేశాలతో కయ్యానికి కాలుదువ్వుతాడు కిమ్. కిమ్‌ భరతం పట్టే దిశగా.. ఐక్యరాజ్య సమితి గతంలో తీసుకున్న చర్యలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. శాంతి చర్చలతో కిమ్‌ను దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆశించిన లక్ష్యాన్ని సాధించలేకపోయారు.

Kim Jong Un

భారత్-పాక్ మధ్య అణు యుద్ధం జరిగితే..?

కశ్మీర్‌ అంశంపై భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ఇప్పటివి కావు. అణ్వాయుధ ప్రయోగానికి కూడా వెనకాడబోమని పాకిస్థాన్‌ పదేపదే కవ్విస్తోంది. తమ అమ్ములపొదిలో ఉన్న అణ్వాయుధాలను ప్రయోగించే పరిస్థితీ రావచ్చని గతంలో ఆ దేశ పాలకులు బెదిరింపులకు దిగిన సందర్భాలు అనేకమే. మీరు అణ్వాయుధాలు ప్రయోగిస్తే.. మేము అణ్వాయుధాలను దీపావళి కోసం దాచుకుంటామా అంటూ భారత నేతలు పాక్‌కు దిమ్మదిరిగే కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. సైనికపరంగా భారత్‌ను అడ్డుకునే శక్తి పాకిస్థాన్‌కు లేదన్న విషయం ప్రపంచానికీ తెలుసు. అయితే ఉగ్రవాదులకు నారునీరు అందిస్తూ భారత్‌పై ఉసిగొల్పుతున్న పాక్.. ఎంతటి ఘాతుకానికైనా తెగబడవచ్చన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య అణు యుద్ధం జరిగితే ఒక వారం రోజుల్లో సంభవించే ప్రాణ, ఆస్తి, పర్యావరణ నష్టాలు అత్యంత దారుణంగా ఉంటాయని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కొలొరాడో బౌల్డర్‌, రట్గర్స్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు గతంలో అంచనావేశారు.

Nuclear Weapons

భారత్, పాక్‌ల మధ్య ఒకవేళ 2025లో యుద్ధం జరిగితే చోటు చేసుకునే పరిణామాలపై వారు అధ్యయనం చేశారు. భారత్, పాక్‌ల వద్ద అణ్వాయుధాలు 2025 నాటికి 200 నుంచి 250 వరకు పెరిగే అవకాశముందని అంచనావేశారు. భారత్, పాక్‌ యుద్ధం వల్ల సాధారణ మరణ రేటు ఒక్కసారిగా రెట్టింపు అవుతుందని.. యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడొ బౌల్డర్‌లో ప్రొఫెసర్‌ బ్రయాన్‌ టూన్‌ తెలిపారు. అణుయుద్ధం ప్రారంభమైన వారం రోజుల్లోనే 5 కోట్ల నుంచి 12.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని స్పష్టం చేసింది. అది రెండో ప్రపంచయుద్ధం జరిగిన ఆరేళ్లలో జరిగిన ప్రాణ నష్టం కంటే ఎక్కువని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధ ప్రభావం ఉంటుందన్నారు.

అగ్రరాజ్యాలు మారితేనే శాంతి..!

న్యూక్లియర్​ ఆయుధాలు కలిగిన దేశాల మధ్య యుద్ధం వస్తే అది రెండు దేశాలకే పరిమితం కాదు. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశముంది. ఇది జరగకుండా మరింత చురుకై పాత్ర పోషించాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితిపై ఉంది. అణ్వాయుధాల నియంత్రణ పేరుతో ఇతర దేశాలపై పెత్తనం చెలాయిస్తున్న అగ్ర రాజ్యాలు తీరు గురివింద గింజ చందంగానే ఉంది. ఆధిపత్య పోకడలతో రెచ్చిపోతున్న చైనా దుందుడుకు చర్యలకు ఇప్పుడు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో ప్రమాదకారిగా పరిణమించే ముప్పు ఉంది. అణ్వాయుధాలను తగ్గించుకునే దిశగా అగ్ర రాజ్యాలు స్వియ నియంత్రణ పాటిస్తే యావత్ మానవళికి మేలు జరుగుతుంది. ప్రపంచంలో మరింత శాంతి నెలకొంటుంది.