
సుహాస్, ప్రియాంక దంపతులు తమ అభిప్రాయాలను నిర్భయంగా పంచుకున్న ఇన్స్టాగ్రామ్ ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అమెరికాలో తాము అనుభవిస్తున్న కష్టాలను ఎలాంటి దాపరికం లేకుండా బయటపెట్టడంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తుఫాను రేపుతోంది!
ఒకప్పుడు భారత్లో మంచి ఉద్యోగం సాధించడం, నాణ్యమైన జీవితాన్ని గడపడం ఎంతో కష్టంగా ఉండేది, అందుకే తాము అమెరికాను ఎంచుకున్నామని, ఇప్పుడు పరిస్థితులు మారాయనీ, ఒకప్పటితో పోల్చితే అమెరికాలో లభించే సౌకర్యాలు, ఉన్నత ఉద్యోగాలు ఇప్పుడు భారత్లోనే లభిస్తున్నాయని సుహాస్ అన్నారు. విదేశీ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నారని ప్రియాంక తెలిపారు. డబ్బు సంపాదన మాత్రమే జీవితం కాదని, సొంత కుటుంబాన్ని, స్నేహితులను వదిలిపెట్టి రావడం వల్ల అనుభవించే ఒంటరితనం తీవ్రంగా బాధిస్తుందని సుహాస్ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో స్థిరపడి ఎంతో కాలం అయినా అమెరికా సమాజం తనను ఇప్పటికీ పరాయివాడిగానే చూస్తుందనీ, అనుబంధం ఆత్మీయత చూపని విదేశీయుల మధ్య జీవించడం కంటే సొంత దేశంలో ఉండటమే ఎంతో మేలని అభిప్రాయపడ్డారు. అవకాశమొస్తే తక్షణం భారత్ తిరిగి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు సుహాస్, ప్రియాంక జంట చెప్పుకొచ్చారు.
భారతీయులకు, చైనీయులకు వ్యత్యాసాన్ని వివరిస్తూ వీరు చేసిన పోలిక ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తోంది. చైనా విద్యార్థులు చదువుకోవడానికి, నైపుణ్యాలు నేర్చుకోవడానికి మాత్రమే వచ్చి తర్వాత చైనాకు వెళ్లిపోతారని ప్రియాంక గుర్తుచేసారు. “కానీ భారతీయులు ఇక్కడే స్థిరపడాలని చూస్తారు” అన్నారు. అమెరికా వీసా కష్టాలపైనా తమదైన శైలిలో కామెంట్ చేసారు. అమెరికా జీవితం అంటే భారీ జీతాలు మాత్రమే కాదు.. వీసా కోసం సుదీర్ఘ నిరీక్షణ, ఉద్యోగ భద్రత లేకపోవడం అన్నారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లోని తీవ్రమైన సవాళ్లను వివరిస్తూ యువతను హెచ్చరించారు.
అమెరికా వెళ్లి సంపాదించాలనే ఆలోచనలో ఉన్నవారు కేవలం ప్యాకేజీలు, జీతాలను మాత్రమే చూసి నిర్ణయం తీసుకోకూడదని సుహాస్ సూచించారు. ఎప్పుడు హెచ్-1బి వీసా స్టేటస్ ఊడుతుందో తెలియని నిరంతర భయంలో గడుపుతున్నామనీ, ఉద్యోగం పోతే లీగల్ స్టేటస్ కోల్పోతామనే ఆందోళన, కంపెనీలపై ఆధారపడాల్సిన పరిస్థితి, గ్రీన్ కార్డ్ ఆలస్యం ప్రభావం జీవిత భాగస్వామి కెరీర్ పై పడటం, పిల్లలకు చట్టబద్ధమైన హోదా లభించడం పై స్పష్టత లేకపోవడం , వృద్ధులైన తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ, అత్యవసర సమయాల్లో కూడా సొంత దేశానికి వెళ్లలేని పరిస్థితిలో తాము ఉన్నట్లు ఒకింత బాధగా చెప్పుకొచ్చారు.
అమెరికా రావద్దు అంటూ అమెరికాలో స్థిరపడిన సుహాస్, ప్రియాంక దంపతులు చేసిన వ్యాఖ్యలపై నెట్టింట చర్చ జరుగుతోంది! దేశం విడిచి వెళ్లడం ఎంత కష్టమో, ఏళ్ల తర్వాత మళ్లీ సొంత దేశం ఇండియా తిరిగి రావడం అంతే కష్టమని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక నెటిజన్ వ్యాఖ్యానిస్తూ… “ఒక దేశం నుంచి మరో దేశానికి మారడం అనేది SIM కార్డు మార్చినంత సులువు కాదు! జీవితాన్ని రెండుసార్లు మొదటి నుంచి నిర్మించుకోవడం చాలా పెద్ద విషయం. అయితే అమెరికాకు వెళ్లడం ఒక రకంగా ‘సన్క్ కాస్ట్ ట్రాప్’ అనే చెప్పాలి. మొదట పొదుపు మొత్తాన్ని చూపించాలి. తర్వాత రోజూ వీసా కష్టాలను టీవీ సీరియల్ లాగా అనుభవించాలి! ఈ రోజు ఎవరైనా నన్ను ఇమ్మిగ్రేషన్ మారాథాన్ను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించమంటే…వద్దే వద్దు అని చెప్తాను” అని రాసుకొచ్చారు.
మరొక యూజర్ ఆ దంపతుల అభిప్రాయాన్ని బలపరుస్తూ… “విదేశాల్లో మనం ఎప్పుడూ రెండవ స్థాయి పౌరులమే. స్వదేశంలో మన వాళ్ల మధ్య ఉంటూ సంపాదించడం లగ్జరీ” అంటూ కామెంట్ చేసారు. సుహాస్, ప్రియాంక జంట ఇన్స్టాగ్రామ్ ఇంటర్వ్చూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. భిన్నాభిప్రాయాలను షేర్ చేస్తున్న యువతను ఆలోచింపజేస్తోంది!