బంగ్లాదేశ్లో దుర్గా పూజ మండపాలపై దాడులు.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థపై అనుమానాలు
Bangladesh News: బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లో దుర్గా పూజ మండపాలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. దీంతో ఆ దేశంలో పలు ప్రాంతాల్లో జరిగిన మత ఘర్షణల్లో నలుగురు దుర్మరణం చెందారు.
Bangladesh News: బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లో దుర్గా పూజ మండపాలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. దుర్గా దేవి, హిందూ దేవతా మూర్తుల విగ్రహాలను ధ్వంసం చేశారు. దీంతో ఆ దేశంలో పలు ప్రాంతాల్లో జరిగిన మత ఘర్షణల్లో ఇప్పటి వరకు నలుగురు దుర్మరణం చెందారు. భారీ సంఖ్యలో గాయపడ్డారు. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించారు. హిందువులు ఏర్పాటు చేసిన దుర్గా పూజ మండపాలపై జరిగిన దాడుల వెనుక పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జమాతీ ఇష్లామీ(JEI) ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘర్షణలకు కారణమైన ఏ మతానికి చెందిన వారైనా ఉపేక్షించేది లేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది.
పలు చోట్ల మత ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆ దేశంతో భద్రతా పరిస్థితిని సమీక్షించారు. 22 జిల్లాల్లో పారామిలిటరీ బలగాలను మోహరించాలని ఆదేశించారు. దుర్గా పూజ మండపాలపై దాడులకు పాల్పడిన వారిని శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అలాగే దాడులకు కారణమైన వారు ఏ మతానికి చెందినా ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. కొన్నిచోట్ల పోలీసులపై అల్లరి మూకలు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో భారీ సంఖ్యలో గాయపడ్డారు. బంగ్లాదేశ్లో మత ఘర్షణల నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇటు భారత ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై దృష్టిసారించింది.భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వంతో టచ్లో ఉన్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు. బంగ్లాదేశ్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిపై దాడులు వంటి దురదృష్టకర ఘటనలు చోటుచేసుకున్నట్లు తమకు సమాచారం అందినట్లు చెప్పారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
16.9 కోట్ల మంది జనాభా కలిగిన బంగ్లాదేశ్లో 10 శాతం మంది హిందువులు ఉన్నారు. దుర్గా నవరాత్రి ఉత్సవాలను ప్రతియేటా అక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అక్కడ అల్లర్లు సృష్టించి, దుర్గా పూజ మండపాలపై దాడులకు మత ఛాందసవాదులను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పురిగొల్పినట్లు తెలుస్తోంది.
Also Read..
Sai Dharam Tej: దసరా పండుగ వేళ మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్