Afghanistan Crisis: అప్ఘానిస్తాన్ బాంబుల మోతతో దద్ధరిల్లుతోంది. ఐసిస్-కే ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం అంతా ఇంత కాదు. తాలిబన్ల ఆరాచకాలకు బతుకుజీవుడా జనం దేశం విడిచి వెళ్లిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు ఏదోక మార్గంలో దేశం వదిలి వెళ్లేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు ఏదో ఒక విమానం ఎక్కి దేశం విడిచి వెళ్లాలని ప్రయత్నించిన ఆఫ్ఘన్ పౌరులు.. ఇప్పుడు అలాంటి అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు. ఎయిర్ ఎగ్జిట్ పరిస్థితులు మూతపడిన తర్వాత ప్రజలు ఇప్పుడు పాకిస్తాన్గానీ, ఇరాన్కుగానీ వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో దేశం దాటి వెళ్లేందుకు అవకాశం ఉన్న సరిహద్దుల దగ్గరకు చేరుకుంటున్నారు. మరో దేశానికి వెళ్లి తల దాచుకునేందుకు వేలాది మంది ఆఫ్ఘన్ పౌరులు పాక్-ఇరాన్ సరిహద్దు దగ్గరకు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇరాన్-పాకిస్తాన్ సరిహద్దుకు చేరుకుంటుండటంతో.. ఈ దేశాలు తమ సరిహద్దుల వద్ద భద్రతను కఠినతరం చేశాయి.
మరోవైపు, ఆఫ్ఘన్ పౌరులెవరూ సరిహద్దు దాటడానికి అనుమతించడం లేదు. ఆఫ్ఘనిస్తాన్తో మధ్య ఆసియా దేశాల సరిహద్దులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్లోని టోర్ఖామ్ సరిహద్దు వద్ద వేలాది మంది ప్రజలు పాకిస్తాన్ లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని. వేలాది మంది ఆప్ఘాన్లు అనుమతి కోసం ఎదురుచూస్తున్నారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అటు, ఇరాన్ ఇస్లాం కలాన్ సరిహద్దులో వేలాది మంది ఆఫ్ఘన్ పౌరులు చేరుకున్నారు. ఇక్కడి నుంచి కొందరు ఇరాన్లోని వెళ్లడంలో విజయం సాధించారు. అమెరికా సేనలు పూర్తిస్థాయిలో ఆఫ్ఘనిస్థాన్ను విడిచి వెళ్లడంతో.. కాబూల్ విమానాశ్రయాన్ని తాలిబన్లు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో అక్కడి నుంచి విమాన రాకపోకలు సాగడం లేదు.
ఇదిలావుంటే, ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ సుప్రీం కమాండర్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం, కేబినెట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తాలిబాన్లకు, ఇతర ఆఫ్ఘన్ నేతలకు మధ్య చర్చల్లో ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరింది. కొద్ది రోజుల్లో దీనిపై ప్రకటన వెలువడుతుందని తాలిబాన్ అధికారి ఒకరు తెలిపారు. తాలిబన్ సుప్రీం కమాండర్ హైబతుల్లా అఖుండ్ జాదా పాలక మండలి ఉన్నత నేతగా వుంటారని గ్రూపు సాంస్కృతిక కమిషన్ సభ్యుడు బిలాల్ కరిమి చెప్పారు.
తాలిబాన్ నేతగా బయట అందరికీ తెలిసిన, అఖుండ్ జాదా ముగ్గురు డిప్యూటీల్లో ఒకరైన ముల్లా అబ్దుల్ ఘని బరాదర్ ప్రభుత్వ రోజువారీ కార్యకలాపాల ఇన్చార్జిగా వుంటారని తెలుస్తోంది. అందరినీ కలుపుకుని పోయేలా ఆఫ్ఘన్ ప్రభుత్వ ఏర్పాటుపై సంప్రదింపులు అధికారికంగా ముగిశాయని కరిమి చెప్పారు. పూర్వపు ప్రభుత్వంలోని నేతలు, ఇతర కీలక నేతలతో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరిగాయి. వారందరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇక కొద్ది రోజుల్లో కేబినెట్, ప్రభుత్వ పనితీరుపై ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also…. Scrub Typhu: ఉత్తర భారతంలో కొత్త కలవరం.. చిన్నారులకు ప్రబలుతున్న వింత వ్యాధి.. యూపీలో 8మంది మృత్యువాత!
India Rains: భారీ వర్షాలతో రాజధాని సహా ఉత్తర భారతం భీతావహం.. అసోంలో 7 లక్షల మంది నిరాశ్రయులు