
డ్రైవర్ నిర్లక్ష్యంలో ఓ ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో సుమారు 30 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తర నైజీరియాలోని కానో రాష్ట్రంలో వెలుగు చూసింది. దాదాపు 50 మంది ప్రయాణికులతో కానో నుండి గుజుంగు పట్టణం వైపు వెళ్తున్న ఓ ట్రక్కు సరిగ్గా క్వానార్ బార్డే పట్టణంలోని హైవే వద్దకు రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే సుమారు 30 మంది ప్రయాణికులు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని హస్పిటల్కు తరలించారు. అనంతరం ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే ఈ ప్రమాదంపై కానో గవర్నర్ కార్యాలయం స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగిందని.. ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంది.
అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులందరికీ మెరుగైన చికిత్స అందించాలని గవర్నర్ కానో రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఆదేశించారు. అలాగే, మరణాలను అంచనా వేసి, బాధితుల కుటుంబాలను ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని కోరారు. చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని, మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.