Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు గ్రామాల మధ్య చిచ్చురేపిన దున్నపోతు.. ఏం జరిగిందంటే?

రెండు గ్రామాల మధ్య చిచ్చురేపిన దున్నపోతు.. ఏం జరిగిందంటే?

Samatha J

|

Updated on: Jan 13, 2025 | 9:56 PM

రెండు ఊర్ల మధ్య దున్నపోతు పంచాయితీ తీరని చిక్కుముడిగా మారింది. జాతర విషయంలో రెండు గ్రామాల మధ్య వివాదం రాజుకుంది. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ ఈ సంఘటన అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్ అవుతోంది. కూడేరు మండలం ముద్దలాపురం, కడరకుంట గ్రామాల మధ్య దున్నపోతు వివాదం పెద్ద చిచ్చు రేపింది. ముద్దలాపురంలో ముత్యాలమ్మ తల్లికి బలిచ్చేందుకు మూడేళ్ల క్రితం లేగ దున్నపోతును గ్రామంలోకి వదిలారు గ్రామస్తులు. అయితే ఈ నెలలో ముద్దలాపురంలో ముత్యాలమ్మ తల్లి జాతరలో దున్నపోతును బలిచ్చేందుకు దున్నపోతు కోసం వెతకగా… పక్క గ్రామమైన కడరకుంట గ్రామస్తులు తాడుతో ఆ దున్నపోతును కట్టేసి ఉన్నట్టు వారికి తెలిసింది. ముద్దలాపురం గ్రామస్తులు దున్నపోతు కోసం వెళ్లగా… కడరుకుంట గ్రామస్తులు ఈ దున్నపోతు తమదేనని వాదించారు.

దీంతో రెండు గ్రామాల మధ్య దున్నపోతు కోసం ఘర్షణ ఏర్పడింది. జాతర సమయం దగ్గర పడుతుండడంతో దున్నపోతు పంచాయతీ ఎస్పీ కార్యాలయానికి చేరింది. ముద్దలాపురం గ్రామస్తులు దున్నపోతు తమకు ఇప్పించాలని ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.రెండు గ్రామాల మధ్య వివాదానికి కారణమైన దున్నపోతును కదరకుంట గ్రామంలో తాడుతో కట్టేసి ఉంచారని గుర్తించిన పోలీసులు…. వెంటనే దానిని కూడేరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదేవిధంగా రెండు గ్రామాల మధ్య ఘర్షణ పెరగడంతో… ఈ నెలలో జరగాల్సిన రెండు గ్రామాల జాతర అయిపోయేవరకు దున్నపోతు పోలీస్ స్టేషన్ లోనే ఉంటుందని ఇరు గ్రామాల పెద్దలకు చెప్పారు. రెండు గ్రామాల జాతర అయిపోయే వరకు దున్నపోతును పోలీస్ స్టేషన్లో చెట్టుకు కట్టేసి పోలీసులే సంరక్షిస్తున్నారు. రెండు గ్రామాల జాతర అయిపోయిన తర్వాత దున్నపోతును విడిచిపెడతామని అప్పటివరకు ఇరు గ్రామస్తులు సంయమనం పాటించాలని పోలీసులు సూచించారు. విడిచి పెట్టిన తర్వాత దున్నపోతు ఏ గ్రామంలోకి వెళితే వారు ఆ దున్నపోతును తీసుకోవచ్చని తాత్కాలికంగా దున్నపోతు పంచాయతీకి చెక్ పెట్టారు.