చూసి రెండేళ్లయింది.. మాట్లాడి ఏడాదైంది: కుమారుడిని తలుచుకుని ధావన్ కన్నీరు
టీమ్ఇండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తన కుమారుడ్ని తలచుకొని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన కుమారుడు జొరావర్ను చూసి రెండేళ్లు గడిచిపోయిందని, తనతో మాట్లాడి ఏడాది దాటిందని తెలిపారు. తన కుమారుడితో మాట్లాడేందుకు అన్ని దారులు మూసుకుపోయాయని, అయినా తాను తన కుమారుడికి ఎల్లప్పుడూ దగ్గరగానే ఉంటానని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కుమారుడి గురించి తెలుపుతూ భావోద్వేగానికి గురయ్యాడు.తన కొడుకుని చూసి రెండేళ్లు అయిందని, తనతో చివరగా ఏడాది క్రితం మాట్లాడానని, చాలా కష్టంగా ఉన్నా అలానే ఉండటం అలవాటు చేసుకున్నానని చెప్పారు.
తనతో నేరుగా మాట్లాడకపోయినా, కలవకపోయినా మనసులో ఎప్పుడూ తనతో మాట్లాడుతున్నట్లు, తనను హగ్చేసుకున్నట్లు ఫీలవుతుంటానని తెలిపారు. తన కుమారుడిని కలిసేందుకు ఇదే సరైన మార్గమని తెలిపారు. తన కుమారుడితో రెండున్నరేళ్లు మాత్రమే గడిపానని, ఇప్పుడు తనకు పదకొండేళ్లని చెప్పారు. కొడుకుని కలవగానే మీరు ఆడిన ఏ ఇన్నింగ్స్ చూపిస్తారు అని ప్రశ్నించగా.. ధావన్ భావోద్వేగానికి గురైయ్యారు. మొదట తనని ప్రేమతో హత్తుకుంటానని, వీలయినంత సమయం తనతో గడుపుతానని చెప్పారు. తను నాతో ఏదైనా చెప్తే ఆసాంతం వింటా..ఒకవేళ తను కన్నీళ్లు పెట్టుకుంటే నేను కూడా తనతోపాటు తన కన్నీళ్లను పంచుకుంటానని చెప్పారు. నా కుమారుడిని కలిసిన సమయాన్ని క్షణం కూడా వృధా చేసుకోనని, పూర్తిగా ఆస్వాదిస్తానని తెలిపారు.