AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goutham Reddy: ప్రత్యేక నేవీ హెలికాప్టర్‌లో నెల్లూరుకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం తరలింపు

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని ఆంధ్రప్రదేశ్‌ తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌ జూబ్లిహిల్స్ నివాసం నుంచి నెల్లూరుకు తరలిస్తున్నారు.

Goutham Reddy: ప్రత్యేక నేవీ హెలికాప్టర్‌లో నెల్లూరుకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం తరలింపు
Gouthamreddy
Balaraju Goud
|

Updated on: Feb 22, 2022 | 11:30 AM

Share

AP Minister Mekapati Goutham Reddy: నెల్లూరు(Nellore) రోదిస్తోంది. గుండెలవిసేలా రోదిస్తోంది. అభిమాన నేత హఠాన్మరాణాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఎదురుచూస్తోంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌ జూబ్లిహిల్స్ నివాసం నుంచి అంబులెన్స్‌లో బేగంపేట ఎయిర్‌పోర్టుకు తరలించారు. అంబులెన్స్‌లో గౌతంరెడ్డి భౌతికకాయంతో పాటు తల్లి మణిమంజరి, సతీమణి శ్రీకిర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌ పోర్ట్ నుంచి నేవీ హెలీకాప్టర్‌లో గౌతమ్‌ రెడ్డి డెడ్‌బాడీని తరలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక నేవీ హెలికాప్టర్‌లో ఉదయం 11:25 గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్డులోని క్యాంప్ కార్యాలయానికి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం చేరుకునే అవకాశం ఉంది. ఉదయం 11:30 నుంచి అభిమానుల సందర్శనార్థం గౌతమ్ రెడ్డి పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అమెరికా నుంచి గౌతమ్‌రెడ్డి కుమారుడు కృష్ణార్జునరెడ్డి రాత్రి 11 గంటల ప్రాంతంలో నెల్లూరు చేరుకునే అవకాశం ఉంది. రేపు ఉదయగిరిలో మేకపాటి ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాసేపట్లో పార్ధివదేహం నెల్లూరు చేరుకోనుంది. ఇంటి దగ్గర గౌతమ్‌ రెడ్డి భౌతికకాయం కోసం అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, బంధువులు ఎదురుచూస్తున్నారు.

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమ సంస్కారాలకు సంబంధించిన ఏర్పాట్ల బాధ్యతను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అప్పగించారు. భౌతికకాయాన్ని బేగంపేట విమానాశ్రయానికి చేర్చిన అనంతరం నెల్లూరు జిల్లా క్యాంపు కార్యాలయానికి మంత్రి ఆదిమూలపు సురేష్ రోడ్డు మార్గంలో బయలుదేరారు. రాజకీయాల్లో అజాతశత్రువుగా పేరొందిన గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని చూసేందుకు జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు తరలి రానుండటంతో అందుకు తగ్గట్లు అక్కడి ఏర్పాట్లను మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, నెల్లూరు జిల్లా వైఎస్సా్‌సీపీ అధ్యక్షుడు కాకాణి పర్యవేక్షిస్తున్నారు.

కాసేపట్లో నెల్లూరు చేరుకోనుంది నేవీ హెలీకాప్టర్. అభిమానుల సందర్శనార్థం అక్కడ ఏర్పాట్లు చేశారు. రాత్రికి గౌతమ్‌రెడ్డి కుమారుడు నెల్లూరు చేరుకుంటాడు. రేపు ఉదయగిరిలో అధికార లాంఛనాలతో నిర్వహించే అంత్యక్రియలకు సీఎం జగన్‌, మంత్రులు, ప్రముఖులు హాజరవుతారు. అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించగా.. ఉదయగిరి మెరిట్ ఇంజనీరింగ్ కాలేజీలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నెల్లూరు ఇన్‌చార్జి మంత్రి హోదాలో అంతిమ సంస్కారాల పనులను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పర్యవేక్షిస్తున్నారు.