Viral: కళ్లు మసకబారిపోయి ఆస్పత్రికి వెళ్లిన 35 ఏళ్ల వ్యక్తి.. ఎక్స్‌రేలో కనిపించింది చూసి అంతా షాక్

చూపు మందగించిందని ఓ వ్యక్తి హుటాహుటిన కంటి డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. పరీక్షలు చేయించి.. కట్ స్కాన్ తీయించాడు. ఇక ఆ డాక్టర్లకు అతడి కంటి లోపల కనిపించింది చూసి దెబ్బకు షాక్ అయ్యారు. ఆ వ్యక్తి కంటి లోపల ఓ పరాన్నజీవి నెమ్మదిగా కదులుతూ కనిపించింది. ఆ వివరాలు ఇలా..

Viral: కళ్లు మసకబారిపోయి ఆస్పత్రికి వెళ్లిన 35 ఏళ్ల వ్యక్తి.. ఎక్స్‌రేలో కనిపించింది చూసి అంతా షాక్
Worm In Eyes

Updated on: Aug 20, 2025 | 1:53 PM

మధ్యప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ 35 ఏళ్ల వ్యక్తికి కలిగిన వింత అనుభవం.. ఇప్పుడు వైద్యశాస్త్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ వింత కేసును ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’ అనే జర్నల్‌లో డాక్టర్లు పొందుపరిచారు. సదరు రోగి తన కళ్లు మసకబారుతున్నాయని ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి డాక్టర్లు ఫండోస్కోపి చేశారు. ఇందులో వారికీ షాకింగ్ విషయం బయటపడింది. కంటి వెనుక భాగంలో ఒక పురుగు నెమ్మదిగా కదులుతూ కనిపించింది. దానిపై లోతుగా పరిశీలించగా.. అది ‘గ్నాథోస్టోమా స్పినిగెరమ్’ అనే పరాన్నజీవి అని గుర్తించారు. ఇలాంటివి సాధారణంగా పిల్లులు, కుక్కలు వంటి జంతువులలో కనిపిస్తాయి. సరిగ్గా ఉడకని చేపలు, కోడి మాంసం, పాములు లేదా కప్పల మాంసం తినడం వల్ల ఇవి మనిషి శరీరంలోకి ప్రవేశిస్తాయని వైద్యులు తెలిపారు. సదరు రోగి కూడా గతంలో సరిగ్గా ఉడకని మాంసం తిన్నట్టు గుర్తించారు.

ఈ పరాన్నజీవి.. మొదటిగా రక్తంలోకి ప్రవేశించి.. ఆ తర్వాత అలా కంటిలోకి చేరుతుందని వైద్యులు చెప్పారు. వెంటనే అతడికి ‘పార్స్ ప్లానా విట్రెక్టమీ (పీపీవీ)’ అనే స్పెషల్ శస్త్రచికిత్సను చేసి.. కంటిలోని ఆ పురుగును బయటకు తీశారు. అనంతరం దానిని మైక్రోస్కోప్ ద్వారా పరీక్షించగా.. అది గ్నాథోస్టోమాగా నిర్ధారించారు. దీనిపై అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ నిపుణుడు డాక్టర్ అబ్ధిశ్‌ భవ్సర్ మాట్లాడుతూ.. ఇలాంటి పరాన్నజీవులు కంటిలోకి చేరితే తీవ్ర నష్టం వాటిల్లుతుందని.. కొన్నిసార్లు శాశ్వతంగా చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..