8 రోజులు.. 10వేల కి.మీ. ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం.. ప్రకృతి ఒడిలో..

ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ రైలు ప్రయాణం మాస్కో నుండి ప్యోంగ్యాంగ్ వరకు సాగుతుంది. 10,000 కి.మీ. దూరం, 8 రోజుల పాటు కొనసాగే ఈ ప్రయాణం గిన్నిస్ రికార్డు సాధించింది. ట్రాన్స్-సైబీరియన్ మార్గంలో పచ్చని ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు. భారత్‌లో వివేక్ ఎక్స్‌ప్రెస్ కూడా సుదీర్ఘ ప్రయాణానికి ప్రసిద్ధి. ఇది కేవలం ప్రయాణం కాదు.. అద్భుతమైన అనుభవం

8 రోజులు.. 10వేల కి.మీ. ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం.. ప్రకృతి ఒడిలో..
World's Longest Train Journey

Updated on: Nov 20, 2025 | 6:13 PM

రైలు ప్రయాణం అంటేనే ఒక అద్భుతమైన అనుభూతి. పచ్చని పర్వతాలు, విస్తారమైన పొలాలు, దట్టమైన అడవుల గుండా సాగే ఈ ప్రయాణం చాలా మందికి ఇష్టమైనది. అయితే ప్రపంచ రికార్డు సృష్టించిన ఒక సుదీర్ఘ రైలు ప్రయాణం గురించి మీకు తెలుసా..? ఇది దాదాపు 8 రోజుల పాటు 10 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణికులను తీసుకువెళుతుంది. ఈ సుదీర్ఘ ప్రయాణానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రత్యేక గుర్తింపు లభించింది.

మాస్కో నుంచి ప్యోంగ్యాంగ్ వరకు..

ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఈ రైలు మార్గం రష్యా రాజధాని మాస్కో నుండి ప్రారంభమై.. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ వరకు కొనసాగుతుంది. దాదాపు 10,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ జర్నీ, ప్రయాణికులకు అసాధారణమైన అనుభూతిని అందిస్తుంది. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మంచుతో కప్పబడిన పర్వతాలు, విశాలమైన మైదానాలు, దట్టమైన సైబీరియన్ అడవులు, అరుదుగా కనిపించే చిన్న గ్రామాలు వంటి విభిన్న ప్రకృతి దృశ్యాలను కళ్ళారా చూడవచ్చు.

ప్రయాణ మార్గం ఎలా ఉంటుంది..?

ప్రపంచంలో ట్రాన్స్‌-సైబీరియన్ రైల్వేలైన్‌ సుదీర్ఘ ప్రయాణానికి ప్రసిద్ధి. ట్రాన్స్‌-సైబీరియన్ రైల్వేలైన్‌ అనేది రష్యాలో తూర్పున ఉన్న పసిఫిక్ మహాసముద్ర తీరాన్ని, పశ్చిమాన ఉన్న యూరోపియన్ రష్యాను కలుపుతూ సాగే ఒక భారీ లైన్ ఇది. దీనిపైనే ఈ రైలు ప్రయాణం ఎక్కువగా ఉంటుంది. ఇది 9,000 కిలోమీటర్లకు పైగా దూరం మాస్కో నుండి రష్యాలోని వ్లాడివోస్టాక్ వరకు నడుస్తుంది. వ్లాడివోస్టాక్ చేరుకున్న తర్వాత రైలు మార్పు ఉంటుంది. అక్కడి నుండి ఉత్తర కొరియాకు చెందిన ప్రత్యేక రైలుకు అనుసంధానించి ప్రయాణికులను ప్యోంగ్యాంగ్‌ తీసుకెళుతుంది.

కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020లో ఈ సేవ తాత్కాలికంగా నిలిపివేశారు. అయినప్పటికీ, రష్యా-ఉత్తర కొరియా మధ్య సంబంధాలు మెరుగుపడటంతో ఈ సుదీర్ఘ రైలు ప్రయాణ సేవను మళ్లీ పునరుద్ధరించారు. ఈ సుదీర్ఘ ప్రయాణం కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు, ప్రకృతిని దగ్గరగా చూస్తూ, వివిధ సంస్కృతులను అనుభవించడానికి ఒక అద్భుతమైన అవకాశం.

భారత్‌లోనూ..

భారత్‌లో కూడా తూర్పు నుంచి దక్షిణాన దాదాపు దేశాన్ని చుట్టివచ్చే ఒక అద్భుతమైన రైలు మార్గం ఉంది. అదే వివేక్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే మార్గం. ఈ రైలు దేశంలోనే సుదీర్ఘ ప్రయాణం చేసే రైలుగా గుర్తింపు పొందింది. వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలు అస్సాంలోని డిబ్రుఘడ్ నుండి ప్రయాణం ప్రారంభించ.. కన్యాకుమారి వరకు రాకపోకలు సాగిస్తుంది. ఈ 4,218 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు నాలుగు రోజులు పడుతుంది. ఈ రైలు మొత్తం 8 రాష్ట్రాల మీదుగా వెళుతుంది.