జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు.
ఇదేంటి.! ఓ చిరుద్యోగికి ఏకంగా రూ. 13 కోట్ల జీఎస్టీ నోటిసులు వచ్చాయని అనుకుంటున్నారా.? అదేనండీ.! టైటిల్ చూసి షాక్ అవ్వొద్దు.. స్టోరీ చదివితే మరింత షాక్ అవుతారు. మరి అదేంటో తెలియాలంటే ఓ సారి లుక్కేయండి మరి. ఆ వివరాలు..

మనకు ఏదైనా పెద్ద బిజినెస్ ఉంటేనో.. లేక ఓ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ లాంటిది నడుపుతుంటేనో.. మనకు జీఎస్టీ నోటిసులు రావచ్చు. కానీ ఇక్కడ ఓ చిరుద్యోగి.. అదీనూ నెలకు రూ. 8 వేలు జీతం సంపాదించే ఓ మహిళకు ఏకంగా రూ. 13 కోట్ల జీఎస్తీ బకాయిలు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని వెల్లూరు జిల్లా గుడియాతం ప్రాంతంలోని యశోద అనే మహిళ.. స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ షూ కంపెనీలో నెలకు రూ. 8 వేల జీతానికి పని చేస్తోంది. ఆమె భర్త మహాలింగం కార్ డ్రైవర్. ఇటీవల యశోద తన నెల జీతం డబ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా.. తన ఖాతాను అధికారులు ఫ్రీజ్ చేసినట్లు తెలుసుకుంది. ఖాతా ఎందుకు ఫ్రీజ్ చేశారని ఆరా తీయగా.. ఏకంగా రూ. 13 కోట్ల జీఎస్టీ బకాయిలు ఉన్నట్టు బ్యాంక్ అధికారులు తెలిపారు. దీంతో దెబ్బకు బిత్తర ముఖం పెట్టుకుంది సదరు మహిళ.
నెలా జీతానికి పనిచేసే తాను ఇంత భారీ మొత్తంలో జీఎస్టీ ఎలా చెల్లించాలని ఆమె అధికారులను ప్రశ్నించింది. యశోద పేరు మీద ఇంత పెద్ద మొత్తంలో బకాయి ఉండటాన్ని గుర్తించిన బ్యాంక్ అధికారులు.. ఎవరో ఆమె పేరు, డాక్యుమెంట్స్ ఉపయోగించి ఫ్రాడ్ కంపెనీని రిజిస్టర్ చేసి జీఎస్టీని ఎగవేసినట్లు అనుమానించారు. పూర్తి సమాచారం కోసం చెన్నైలోని జీఎస్టీ కార్యాలయానికి వెళ్లాలని యశోద దంపతులకు సూచించారు.
అయితే, చెన్నై కార్యాలయానికి వెళ్లినా తమ సమస్యకు పరిష్కారం లభించలేదని బాధితురాలు వాపోయింది. నెల జీతం డ్రా చేసుకునేందుకు ఛాన్స్ లేకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది యశోద. ఈ వార్త స్థానికంగా పెద్ద చర్చకు దారి తీయగా.. కేటుగాళ్లు అమాయకుల పేర్లు, ఆధార్ కార్డులు లేదా ఇతర వివరాలను ఉపయోగించి నకిలీ కంపెనీల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని.. ఇలాంటి జీఎస్టీ మోసాలపై అధికారులు దృష్టి సారించాలని నిపుణులు కోరుతున్నారు. ఈ తరహా మోసాలను అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కాగా, యశోద సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లు జీఎస్టీ ఉన్నతాధికారులు తెలిపారు.
