
రైలు ప్రయాణంలో కిటికీ పక్కన కూర్చుని ప్రకృతిని ఆస్వాదించడం అందరికీ ఇష్టమే. కానీ అదే రైలులో ప్రపంచంలోనే అత్యంత పొడవైన విష సర్పం కింగ్ కోబ్రా మీతో పాటు ప్రయాణిస్తుందని తెలిస్తే.. వినడానికే వణుకు పుట్టించే ఈ అంశంపై బయోట్రోపికా జర్నల్లో ప్రచురితమైన ఒక తాజా పరిశోధన సంచలన విషయాలను బయటపెట్టింది. పరిశోధకులు 2002 నుండి 2024 మధ్య గోవాలో నమోదైన రెస్క్యూ రికార్డులను పరిశీలించారు. ఈ 22 ఏళ్ల కాలంలో గోవా అంతటా 47 చోట్ల కింగ్ కోబ్రాలను రక్షించారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 5 ప్రధాన రైల్వే కారిడార్ల సమీపంలోనే ఈ పాములు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2017, 2019, 2023లో రైలు పెట్టెల్లో కింగ్ కోబ్రాలు ప్రత్యక్షమైన ఘటనలు ఫోటోలతో సహా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కింగ్ కోబ్రాలు కావాలని రైలు ఎక్కవు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. అటవీ ప్రాంతాల్లో రైళ్లు ఆగినప్పుడు, ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికో లేదా ఆహారం కోసమో పాములు గూడ్స్ రైళ్లలోకి ప్రవేశిస్తాయి. రైలు కదిలినప్పుడు అవి అందులోనే ఉండిపోతాయి. ఫలితంగా అవి తమ సహజ ఆవాసాలైన పశ్చిమ కనుమల అడవుల నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పొడి ప్రాంతాలకు నగరాలకు చేరుకుంటున్నాయి.
ఈ రైలు ప్రయాణం వల్ల అటు మనుషులకు, ఇటు పాములకు కూడా ప్రాణసంకటమేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కింగ్ కోబ్రాలు సాధారణంగా నదులు, వాగులు ఉన్న దట్టమైన అడవుల్లో బతుకుతాయి. రైళ్ల ద్వారా అవి చేరుకుంటున్న కొత్త ప్రాంతాలు చాలా పొడిగా ఉండటం వల్ల అక్కడ వాటికి ఆహారం, వాతావరణం అనుకూలించక చనిపోయే ప్రమాదం ఉంది. రైలు ప్రయాణికులకు ఇది అత్యంత ప్రమాదకరం. కింగ్ కోబ్రా కాటు వేస్తే మనిషి నిమిషాల్లోనే మరణించే అవకాశం ఉంది. భయం వల్ల జనాలు పాములను చంపేయడం కూడా ఆ జాతి అంతరించిపోవడానికి కారణమవుతోంది.
పరిశోధక రచయిత దికాన్ష్ పర్మార్ బృందం ప్రకారం.. రైల్వే నెట్వర్క్ల ద్వారా వన్యప్రాణుల తరలింపుపై అటవీ శాఖ, రైల్వే శాఖ సమన్వయంతో పనిచేయాలి. ప్రజలకు అవగాహన కల్పించడం, పాములు కనిపించినప్పుడు రెస్క్యూ టీమ్లకు సమాచారం అందించే నెట్వర్క్ను బలోపేతం చేయడం ద్వారానే ఈ అసాధారణ సమస్యను అరికట్టవచ్చని వారు సూచిస్తున్నారు.