Ayodhya: అహ్మదాబాద్‌- అయోధ్యల మధ్య ప్రారంభమైన ఇండిగో విమానం.. సీతారాముల వేషధారణలో సిబ్బంది

|

Jan 12, 2024 | 3:55 PM

కొన్ని వందల ఏళ్ల ఎదురు చూపులకు స్వస్తి చెబుతూ అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు వైభవంగా  జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో రాములోరి భక్తులను అయోధ్యకు చేర్చడానికి రవాణా వ్యవస్థ సైతం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇండిగో నేరుగా బెంగళూరు నుంచి అయోధ్యకు విమానాలు నడుపుతున్నట్టు ప్రకటించింది. రైల్వే సైతం ఏకంగా వెయ్యి రైళ్లకు పైగా నడుపుతోంది. జనవరి 22న జరిగే కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు.

Ayodhya: అహ్మదాబాద్‌- అయోధ్యల మధ్య ప్రారంభమైన ఇండిగో విమానం.. సీతారాముల వేషధారణలో సిబ్బంది
Indigo Staff Members Dressed Ram Sita Laxman
Follow us on

ఆ సేతు హిమాచలం రామనామ స్మరణతో పులకించిపోతోంది. ఎవరి నోట విన్నా అయోధ్య రాముని ప్రస్తావనే.. జగమంతా రామ మయంగా మారిపోయింది అని చెప్పవచ్చు. శ్రీ రాముడు అంటే ప్రతి ఇంటి దైవం.. దేవుడిగా కొలవడమే కాదు.. తమ ఇంటి పెద్ద కుమారుడిలో శ్రీరాముడిని చూసుకుంటారు. తమ పిల్లలు శ్రీరామ సోదరుల్లా అన్యోన్యంగా ఉండాలనుకుంటారు. ప్రతి తల్లీ తన బిడ్డలో బాలరాముడినే చూసుకుంటుంది… ఆ రామ నామంతోనే జోలపాడుతుంది. అలాంటి ముద్దులొలికే అందాల బాలరాముడు అయోధ్యలో కొలువుతీరుతూ అందరినీ రారమ్మన్ని ఆహ్వానిస్తున్నాడు. ఆ సుమధుర ఘడియల కోసం ప్రపంచంలోని కోట్లాది మంది హిందువులు రామ భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కొన్ని వందల ఏళ్ల ఎదురు చూపులకు స్వస్తి చెబుతూ అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు వైభవంగా  జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో రాములోరి భక్తులను అయోధ్యకు చేర్చడానికి రవాణా వ్యవస్థ సైతం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇండిగో నేరుగా బెంగళూరు నుంచి అయోధ్యకు విమానాలు నడుపుతున్నట్టు ప్రకటించింది. రైల్వే సైతం ఏకంగా వెయ్యి రైళ్లకు పైగా నడుపుతోంది.

జనవరి 22న జరిగే కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపధ్యంలో అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి అహ్మదాబాద్‌ నుంచి ఇండిగో సంస్థ తన తొలి విమానాన్ని గురువారం ప్రారంభించింది. వారానికి మూడు రోజులు అహ్మదాబాద్‌- అయోధ్యల మధ్య ఇండిగో విమానం నడపనుంది. లఖ్‌నవూ నుంచి వర్చువల్‌గా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ గురువారం ఈ విమానాన్ని ప్రారంభించారు.

ఈ క్రమంలో ఇండిగో సిబ్బంది శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడి వేషధారణలో అలరించారు. బోర్డింగ్‌ అనౌన్స్‌మెంట్‌ చేయడంతో పాటు విమానం ఎక్కేందుకు వచ్చిన ప్రయాణికులను దేవతా రూపాలలో ఆహ్వానించారు. శ్రీరాముని పక్కన హనుమంతుడు ఎంత భక్తితో కూర్చుంటాడో అలా ఇండిగో సిబ్బంది ఒకరు హనుమంతుడి వేషధారణలో మోకాలిపై కూర్చుని ప్రయాణికులను ఆకట్టుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..