Video: ముసలి నోట్లో కాళ్లు.. వామ్మో.. జర్రుంటే ఎంత పనయ్యేది.. ఈ వీడియో చూడండి..
ఎప్పటిలాగే అతడు నది తీరంలోకి వెళ్లాడు.. కానీ ఈ సారి అనుకోని రూపంలో మృత్యువు ఎదురొచ్చింది. మొసలి కాలు పట్టుకుని నదిలోకి లాగుతుంటే.. ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న తోటి కార్మికుడిని కాపాడుకోవడానికి మిగితా కూలీలు చేసిన సాహసం అద్భుతమనే చెప్పాలి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

అది ఉత్తరప్రదేశ్లోని గొండా జిల్లా ఘాఘరా నది తీరం. సుమారు 50 మంది కూలీలు అక్కడ నది కోతకు గురికాకుండా పెద్ద పెద్ద బండరాళ్లను అమర్చే పనుల్లో నిమగ్నమయ్యారు. అంతా సాధారణంగానే సాగుతున్న సమయంలో ఊహించని ఘటన జరిగింది. నదిలోంచి వచ్చిన ఒక మొసలి కూలీపై దాడి చేసింది. అయితే తోటి కూలీల ధైర్యం, సమయస్ఫూర్తి వల్ల అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. నది తీరంలో పనులు జరుగుతున్న సమయంలో 40 ఏళ్ల భాను అనే కూలీ సామాగ్రిని కడగడానికి నీటి దగ్గరకు వెళ్లాడు. అదే సమయంలో నదిలోంచి దూసుకొచ్చిన ఒక భారీ మొసలి.. రెప్పపాటులో భాను కాలును తన నోటితో గట్టిగా పట్టుకుంది. అంతేకాకుండా అతడిని నదిలోని లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. ఒక్కసారిగా జరిగిన ఈ దాడితో షాకైన భాను ప్రాణభయంతో గట్టిగా కేకలు వేశాడు.
నిమిషం పాటు సాగిన పోరాటం
భాను కేకలు విన్న తోటి కూలీలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భాను చేతులను, శరీరాన్ని గట్టిగా పట్టుకుని వెనక్కి లాగారు. ఇలా మొసలికి, కూలీలకు మధ్య దాదాపు ఒక నిమిషం పాటు టగ్ ఆఫ్ వార్ సాగింది. అయితే మొసలి తన పట్టును అస్సలు వదలలేదు. పరిస్థితి చేతి దాటిపోతుండటాన్ని గమనించిన ఒక కార్మికుడు.. ఒక భారీ ఇనుప సుత్తితో మొసలి తలపై గట్టిగా బాదాడు. ఆ దెబ్బకు మొసలి పట్టు సడలింది. కాలును వదిలేసి వెంటనే నదిలోకి వెళ్లిపోయింది. తోటి కూలీల సమన్వయం వల్ల భాను చావు నోట్లోంచి ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
మొసలి దాడిలో భాను ప్రాణాలతో బయటపడినప్పటికీ, దాన్ని దాడి వల్ల ఒక కాలు మాంసం ముక్కలు ఊడిపోయి తీవ్ర గాయాలయ్యాయి. రక్తం ఓడుతున్న అతడిని తోటి సిబ్బంది వెంటనే గొండా మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. గతంలో తాను ఎన్నోసార్లు నది తీరానికి వచ్చానని, కానీ ఇంత వేగంగా మొసలి దాడి చేస్తుందని ఊహించలేదని భాను తెలిపాడు. కాగా ఈ భయానక ఘటనతో నది తీరంలో పనిచేసే కూలీలు, స్థానిక గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మళ్లీ నది దగ్గరకు వెళ్లి పనిచేయడానికి కార్మికులు జంకుతున్నారు. వర్షాకాలం కారణంగా నదిలో నీటి మట్టాలు పెరగడం వల్లే మొసళ్లు తీర ప్రాంతాలకు వస్తున్నాయని, నది పరివాహక ప్రాంతాల ప్రజలు, కార్మికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వీడియో చూడండి..
#BREAKING Live video of a crocodile attack in the Ghaghra River in Gonda, Uttar Pradesh. A worker working on the dam was grabbed in its jaws. The crocodile attempted to pull the worker into deep water. A colleague of the worker tried to rescue him. All the workers gathered upon… pic.twitter.com/EqDF7VwHOZ
— NEWS WALA (@NEWSWALApy) June 25, 2026
