
జపాన్లోని కుమామోటో జనరల్ హాస్పిటల్లో శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో ప్రబలమైన భూకంపం సంభవించింది. ఆపరేషన్ థియేటర్ తీవ్రంగా ఊగిపోతూ, వైద్య పరికరాలు కిందపడిపోతున్న భయాందోళన వాతావరణంలో కూడా సర్జన్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగికి అడ్డంగా నిలిచారు. రోగిపై ఏమీ పడకుండా తమ శరీరాలతో కప్పి ఉంచి రక్షించారు. ఈ దృశ్యాలు సిసిటీవి కెమెరాలో రికార్డయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తీవ్రమైన ప్రకంపనలు ఆగిన తర్వాత వైద్య బృందం ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసింది. వైద్యుల కర్తవ్య నిష్ఠకు, మానవత్వానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
జపాన్లోని కుమామోటో ప్రాంతంలో ఉన్న కుమామోటో జనరల్ హాస్పిటల్లో జూలై 28న ఆపరేషన్ థియేటర్లో శస్త్రచికిత్స జరుగుతుండగా ఒకేసారి భయంకరమైన భూకంపం వచ్చింది. ప్రకంపనల తీవ్రతకు సర్జికల్ లైట్లు, భారీ మెడికల్ టట్రోలీలు, ఇతర పరికరాలు తీవ్రంగా ఊగిపోతూ కిందపడిపోయాయి. గదిలోని వైద్య సిబ్బంది కొందరు కిందపడిపోయే పరిస్థితి ఏర్పడింది.
తీవ్రమైన విపత్తు వస్తే ఎవరైనా ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పరుగులు తీస్తారు. కానీ, ఆపరేషన్ థియేటర్లో ఉన్న సర్జన్లు మాత్రం రోగిని వదిలి వెళ్ళలేదు. మత్తులో ఉన్న రోగిపై పైనుంచి ఏవైనా వస్తువులు లేదా లైట్లు పడకుండా వైద్యులు తమ శరీరాలనే కవచంగా మార్చారు. రోగిని గట్టిగా పట్టుకుని, తమ ప్రాణాలకు ముప్పు ఉన్నా లెక్కచేయకుండా కాపాడారు. ఇతర వైద్య సిబ్బంది సురక్షిత తరలింపు మార్గాలను సిద్ధం చేస్తూ సహాయపడ్డారు.
ఆ సమయంలో ఆసుపత్రిలో మొత్తం నాలుగు శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. భూకంప ప్రకంపనలు తగ్గిన వెంటనే వైద్యులు ఏమాత్రం అధైర్యపడకుండా తమ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యం తమ సేవలను సాధారణ స్థితికి తీసుకువచ్చింది.
熊本大地震が発生した時の病院の手術室の映像が公開されていたがとにかく怖すぎる pic.twitter.com/vPA5SdsW4i
— Mahmoud Khaled (@zsantinhaop) August 6, 2026
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో షేర్ అవ్వడంతో నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తమ వృత్తి పట్ల వైద్యులు చూపించిన అంకితభావం, మానవత్వం, ధైర్యాన్ని వేలాది మంది నెటిజన్లు కొనియాడుతున్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ రోగి ప్రాణానికే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిన నిజమైన రక్షకులు వీరే అని ప్రశంసిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..