
కుటుంబాన్ని ఎప్పుడు విస్తరించాలి, పిల్లల కోసం ఎప్పుడు ప్రణాళిక వేసుకోవాలి అనేది సాధారణంగా భార్యాభర్తల మధ్య వ్యక్తిగత నిర్ణయం. అయితే, ఒక పాఠశాల ఉపాధ్యాయురాలితో ఇంటర్వ్యూ సందర్భంగా జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఒక పాఠశాల ప్రిన్సిపాల్ ఒక మహిళా ఉపాధ్యాయురాలితో అన్న మాటలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ మొత్తం విషయం ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అసలు విషయం ఏంటో పూర్తి వివరాల్లోకి వెళితే..
ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేసే మహిళా టీచర్కు ఇటీవలె వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజులకే ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఆమెను తన ఆఫీస్ రూమ్కు పిలిపించారు. స్కూల్ అకడమిక్ ఇయర్ (విద్యా సంవత్సరం) మధ్యలో ప్రసవ సెలవులు (Maternity Leave) తీసుకుంటే విద్యార్థుల చదువు దెబ్బతింటుందని, కాబట్టి ఆమె తన ప్రెగ్నెన్సీని స్కూల్ సెలవులకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఇంకాస్త ముందుకు వెళ్లి, మీరు జూన్ నెలలోనే డెలివరీ అయ్యేలా ప్లాన్ చేసుకోండి, అప్పుడైతే స్కూల్ వేసవి సెలవులతో అది సర్దుకుపోతుంది అని ఆర్డర్ వేశారు.
బాధిత ఉపాధ్యాయురాలు ఈ వింత అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. ఒకరి వ్యక్తిగత జీవితాన్ని, ఫ్యామిలీ ప్లానింగ్ను స్కూల్ యాజమాన్యం ఎలా శాసిస్తుంది? ఇది నా ప్రాథమిక హక్కులను కాలరాయడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఇదెక్కడి అరాచకం? పిల్లలు ఎప్పుడు పుట్టాలో నిర్ణయించడానికి ప్రిన్సిపాల్ ఎవరు?, ఇలాంటి స్కూల్స్ నుండి వెంటనే ఉద్యోగం మానేయడం మంచిది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులపై ఉండే పని ఒత్తిడికి, వారిని కేవలం ఒక యంత్రాలుగా చూసే ధోరణికి ఈ ఘటనే నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..