
పళ్ళు ఊడిపోతే మళ్లీ మొలవడం అసాధ్యమనే నమ్మకాన్ని జపాన్ శాస్త్రవేత్తలు బద్దలు కొట్టారు. ఊడిపోయిన దంతాలను సహజంగా మళ్లీ మొలిపించే సరికొత్త ఔషధాన్ని జపాన్ పరిశోధకులు విజయవంతంగా కనుగొన్నారు. జపాన్లోని క్యోటో యూనివర్సిటీ పరిశోధకులు, కిటానో హాస్పిటల్ నిపుణులు సంయుక్తంగా ఈ పరిశోధన చేశారు. మానవ దంతాల ఎదుగుదలను నియంత్రించే ప్రక్రియపై వీరు సుదీర్ఘకాలం అధ్యయనం చేశారు. మన నోటి చిగుళ్లలో సహజంగానే మూడో తరం దంతాలు మొలవడానికి అవసరమైన టూత్ బడ్స్ (Tooth Buds) నిద్రాణంగా ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, శరీరంలోని USAG-1 అనే ప్రత్యేక ప్రొటీన్ ఈ పళ్ళు పెరగకుండా అడ్డుకుంటుంది (బ్రేక్ వేస్తుంది). జపాన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన యాంటీబాడీ ఔషధం ఈ USAG-1 ప్రొటీన్ పనితీరును సమర్థవంతంగా అడ్డుకుంటుంది. దీనివల్ల నిద్రాణమైన దంత కణాలు మళ్లీ యాక్టివేట్ అయి, కొత్త పళ్ళు సహజంగా పెరగడం ప్రారంభిస్తాయి.
ఈ విప్లవాత్మక మందును శాస్త్రవేత్తలు ఇప్పటికే ఎలుకలు, ఫెర్రెట్స్ (Ferrets) వంటి జంతువులపై ప్రయోగించారు. ఈ ప్రయోగాలలో జంతువులకు ఎటువంటి దుష్ప్రభావాలు (Side Effects) లేకుండా కొత్త దంతాలు విజయవంతంగా మొలిచాయి. ఆ దంతాలు సాధారణ పళ్ళలాగే బలంగా, ఆరోగ్యంగా పనిచేయడం విశేషం.
జంతువులపై ప్రయోగాలు విజయవంతం కావడంతో, శాస్త్రవేత్తలు మానవులపై క్లినికల్ ట్రయల్స్ (Human Trials) ప్రారంభించారు. ఈ ట్రయల్స్ ద్వారా మందు సురక్షితత్వాన్ని, సామర్థ్యాన్ని పూర్తిగా నిర్ధారించనున్నారు. అంతా సజావుగా సాగితే, 2030 నాటికి ఈ టూత్ రీగ్రోత్ మెడిసిన్ ప్రపంచవ్యాప్తంగా సామాన్య ప్రజలకు అందుబాటులోకి రానుంది.
పుట్టుకతోనే పళ్ళు లేని పిల్లలకు (Congenital Anodontia), ప్రమాదాల వల్ల లేదా వయసు పైబడటం వల్ల దంతాలను కోల్పోయిన పెద్దలకు ఈ చికిత్స ఒక వరంగా మారనుంది. శస్త్రచికిత్సలు, డ్రిల్లింగ్ వంటి ఇబ్బందులు లేకుండా, కేవలం ఒక మందు ద్వారా సహజమైన దంతాలను తిరిగి పొందడం దంతవైద్య (Dentistry) చరిత్రలోనే అతిపెద్ద విప్లవంగా నిలవనుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..