తన కారుపై ఉన్న ట్రాఫిక్‌ చలాన్‌ కట్టేసిన ముఖ్యమంత్రి! అది కూడా 50 శాతం డిస్కౌంట్‌తో..

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కారుపై ఉన్న ట్రాఫిక్ చలాన్లను 50 శాతం డిస్కౌంట్‌తో చెల్లించారు. హెల్మెట్ లేకుండా, అతివేగం, సిగ్నల్ జంప్ వంటి నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఏడు చలాన్లు ఉన్నాయి. కర్ణాటక ప్రభుత్వం అందించిన 50 శాతం డిస్కౌంట్ స్కీమ్‌ను ఆయన ఉపయోగించుకున్నారు.

తన కారుపై ఉన్న ట్రాఫిక్‌ చలాన్‌ కట్టేసిన ముఖ్యమంత్రి! అది కూడా 50 శాతం డిస్కౌంట్‌తో..
Traffic Fines

Updated on: Sep 06, 2025 | 4:33 PM

హెల్మెట్‌ లేకపోయినా, రాష్‌గా డ్రైవింగ్‌ చేసినా, సిగ్నల్‌ జంప్‌ చేసినా.. ఇలా పలు ట్రాఫిక్‌ రూల్స్‌ను అతిక్రమిస్తే చలాన్‌ పడుతుంది. టెక్నాలజీ పెరిగిపోవడంతో వెళ్తున్న వాహనాన్ని ఫొటో తీసి.. తీరిగ్గా ఇంటికే చలాన్‌ పంపిస్తున్నారు. అయితే ఇలాంటి ట్రాఫిక్‌ చలాన్లు కేవలం సామాన్యులకే అనుకుంటే పొరపాటే.. ముఖ్యమంత్రి కారును కూడా పోలీసులు వదలడం లేదు. అలాగే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కారుపై కూడా కొన్ని ట్రాఫిక్‌ చలాన్లు ఉన్నాయి.

వాటిని తాజాగా ఆయన కట్టేశారు. అది కూడా 50 శాతం డిస్కౌంట్‌తో కట్టారు. ట్రాఫిక్‌ చలానాలపై వాహనదారులకు ఊరట కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఇటీవల 50 శాతం డిస్కౌంట్‌ స్కీమ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రయాణించే కారుపైనా చలాన్లు ఉండటంతో ఆయన ఈ రాయితీని ఉపయోగించి జరిమానాలు కట్టేశారు.

సీఎం ప్రయాణించే కారుపై మొత్తం ఏడు చలాన్లు ఉన్నాయి. ఇందులో సీటు బెల్ట్‌ ధరించనందుకు ఆరుసార్లు, అతివేగానికి సంబంధించి ఒకసారి చలాన్‌ పడింది. సీఎం కారుకు జరిమానా ఉన్నా చెల్లించలేదని సామాజిక మాధ్యమాల్లో ఇటీవల తీవ్ర చర్చ నడిచింది. దీంతో సీఎం యంత్రాంగం డిస్కౌంట్ పథకాన్ని ఉపయోగించుకుంది. ఈ చలానాలకుగానూ రాయితీ అనంతరం రూ.8750 చెల్లించింది. జరిమానా పడిన వాహనదారులు సగం కడితే.. మిగతా మొత్తాన్ని మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆగస్టు 21న ప్రారంభించిన ఈ స్కీమ్‌ సెప్టెంబరు 19వ వరకు అమల్లో ఉండనుంది. రాయితీ పథకంతో ఇప్పటివరకు రూ.40కోట్లు వసూలైనట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి