తల్లిదండ్రులు గల్లంతు..కన్నీళ్లను అదిమిపట్టి.. నీట్ రాసిన నేపాలీ బిడ్డ

67 మంది సభ్యుల బృందంతో కైలాస మానసరోవర యాత్రకు వెళ్లిన తల్లిదండ్రుల జాడ తెలియలేదు. నేపాల్‌లోని ఇమిగ్రేషన్ సెంటర్‌ నుంచి చివరిసారిగా మాట్లాడారు. ఆ బాధను దిగమింగుకుని వారు తన పక్కన లేకపోయినా వారి కోరిక మేరకు నీట్‌ రాసినట్లు తన్వి తన పోస్ట్ లో తెలిపింది.  

తల్లిదండ్రులు గల్లంతు..కన్నీళ్లను అదిమిపట్టి.. నీట్ రాసిన నేపాలీ బిడ్డ
Girl Attempts Neet As Parents Go Missing After Nepal Floods

Updated on: Sep 01, 2026 | 3:30 PM

తన తల్లిదండ్రులు వెంకట్రామ్ అన్నందేవర, అనఘ 67 మంది బృందంతో కలిసి కైలాస యాత్రకు వెళ్లినట్లు నేపాల్ యువతి తన పోస్టులో రాసుకొచ్చింది. కైలాస మానసరోవర యాత్రకు వెళ్లిన కొన్ని వందల మంది  భారతీయులు గల్లంతయ్యారు. యాత్రకు వెళ్లిన తన తల్లిదండ్రులు కూడా చిక్కుకుపోయారని వారు కోరుకున్న ప్రకారం నీట్‌ పరీక్ష రాసినట్లు తన్వి సోషల్‌ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది.

నేపాల్‌ జల ప్రళయం.. ఒకే ఇంట్లో 23 మృతదేహాలు..

నేపాల్‌ జల ప్రళయం అంతులేని విషాదాన్ని మిగిల్చింది.  గల్లంతయిన వారిలో 4 వేలమందికి పైగా ఆచూకీ తెలియడం లేదు.  బురద కింద మృతదేహాలను వెలికి తీయడానికి సహాయక బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి. నువాకోట్‌లోని ఓ భవనం వరద ప్రభావానికి కూలింది. అందులో ఏకంగా 23 మృతదేహాలు లభించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అవి కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో ఖననం చేసేందుకు తరలించారు. నేపాల్‌ చైనా సరిహద్దు జిల్లాలలో వరద పోటుకు ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయాయి.  ఇప్పటి వరకు 978 మృతదేహాలను వెలికి తీసారు. నేపాల్‌, టిబెట్‌లో కలిపి మొత్తం 4,471 మంది గల్లంతయ్యారు.

నేపాల్‌లో ఆకస్మిక వరదకు కారణమైన భారీ మంచు గడ్డ విరిగిపడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. చైనాకు చెందిన ఓ కెమెరామాన్ అనుకోకుండా ఆ దృశ్యాలను తన డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించాడు.   అతడు డ్రోన్ తో  షూట్ చేస్తున్న సమయంలో  లిరుంగ్ పర్వత శిఖరం వద్ద భారీ మంచు గడ్డ విరిగింది.  ఈ  పర్వతం సముద్ర మట్టానికి 7,200 మీటర్ల ఎత్తులో ఉంది. అంతెత్తు నుంచి భారీ మొత్తంలో మంచుతో పాటు, కొండరాళ్లు, బురద కలగలిసి 1,200 మీటర్ల కింద ఉన్న లోయలోకి వేగంగా పడిపోయాయి.


దీంతో భోటెకోశీ, త్రిశూలి నదులు ఉప్పొంగి నేపాల్ టిబెట్ సరిహద్దు జిల్లాలకు వరద పోటెత్తింది. రసువా, నువాకోట్‌లోని జల విద్యుత్ కేంద్రాలలో 900 మందికిపైగా కార్మికులు చిక్కుకుపోయారు. సొరంగం చుట్టూ దట్టమైన బురద పేరుకుపోవడం, వర్షం పడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. గల్లంతైన తమ వారి కోసం  వెతుకుతున్న వేలాది మంది ప్రజలతో శవాగారాలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు కిక్కిరిసిపోతున్నాయి.

ఒకే మృతదేహాన్ని తమ బంధువుగా చెబుతున్న పలు కుటుంబాలు

 

ఆసుపత్రిలో ఒకే మృతదేహాన్ని తమ బంధువుగా చెబుతూ పలు కుటుంబాలు వస్తుండడంతో మృతదేహాల గుర్తింపు ఆలస్యం అవుతోందని అధికారులు తెలిపారు. ఈ  సమస్యను నివారించడానికి అన్ని మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేపాల్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని గండక్ నదిలోకి ఇటీవల ఏడు మృతదేహాలు కొట్టుకొచ్చిన విషయం తెలిసిందే. మరో 6 మృతదేహాలు కూడా కొట్టుకువచ్చినట్లు స్థానిక అధికారులు తెలిపారు. వాటిని తిరిగి నేపాల్ కు  అప్పగించేందుకు అధికారులతో సమన్వయం చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us