
సీజన్ కు ముందే ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం అయితే చాలు భానుడి భగభగలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మండే ఎండల్లో ఎలా ప్రయాణించాలి, కారులో అయితే బెటర్ అనుకునే ఈ రోజుల్లో ఓ సాధారణ వ్యక్తి అలాంటి ఫీలింగ్ ని ఎంజాయ్ చేయడానికి తన బైకును ఏకంగా చలవ పందిరి మాదిరిగా ఏర్పాటు చేసుకొని హాయిగా ప్రయాణం చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రానికి చెందిన షర్ఫద్దీన్ వృత్తిరీత్యా రైస్ మిల్లులలో మెకానిక్ గా పనిచేస్తున్నాడు. కాగా రోజుకో ప్రాంతానికి తన ద్విచక్ర వాహనంపై ప్రయాణం కొనసాగిస్తూ అక్కడి రైస్ మిల్లులలో మరమ్మతులు నిర్వహిస్తుంటాడు.
అయితే ఇటీవల ఎండలు మండుతుండడంతో తన బైక్ పై ప్రయాణం కొనసాగించాలంటే ఇబ్బందికరంగా మారింది. తాను చేస్తున్న వృత్తిరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లక తప్పదన్న ఉద్దేశంతో ఎండల ధాటికి తట్టుకునేందుకు తనకు వచ్చిన ఓ చిన్న ఆలోచనను ఆచరణలో పెట్టాడు. విజయవంతంగా అమలు చేసి ఇప్పుడు పట్టణ వాసుల దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నాడు. తన బైక్ బంపర్ కు చిన్నపాటి ఇనుప రాడ్లు, ఇనుప పట్టీలతో వెల్డింగ్ చేయించి గోనె సంచులు, నెట్, వెదురు డబ్బాలతో గుడిసె మాదిరిగా చలువ పందిరిని స్వయంగా ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో ఎలాంటి ఎండ వేడిమి తగలకుండా తన విధుల నిమిత్తం కిలోమీటర్ల మేర ఇతర ప్రాంతాలకు హాయిగా బైక్ పై వెళుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. కేవలం రూ.4000తో మండే ఎండలోనూ చల్లని ప్రయాణం సాధ్యమైంది.
ఇక జడ్చర్ల ప్రాంతంలో షర్ఫద్దీన్ బైక్ ను చూసి చాలా మంది ద్విచక్ర వాహనదారులు అశ్చర్యపోతున్నారు. ప్రతి ఒక్కరూ షర్ఫద్దీన్ బైక్ పై ఏర్పాటు చేసిన గుడిసే లాంటి గొడుగును ఆసక్తికరంగా గమనిస్తున్నారు. ఉపాధిలో భాగంగా ఈ వినూత్న బైక్ తోనే షర్ఫద్దీన్ కల్వకుర్తి, కోస్గి, నారాయణపేట, అచ్చంపేట వంటి ప్రాంతాలకు వెళ్లివస్తున్నాడు.
వీడియో ఇక్కడ చూడండి..
అయితే రంజాన్ మాసం కావడంతో తనకు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఎండ వేడిమికి తట్టుకోవడం ఇబ్బందికరంగా మారిందని షర్పద్దీన్ చెబుతున్నాడు. దీంతో ప్రత్యామ్నాయంగా ఉపశమనం కోసం స్వయంగా తాను తన ద్విచక్ర వాహనానికి గుడిసె మాదిరిగా చలవ పందిరి ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పాడు. తన బైక్ పై వెళుతుంటే ఏకంగా కారులో వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుందంటున్నాడు. ఈ గుడిసే లాంటి గొడుగు ను చాలా మంది ఇష్టపడుతున్నారని తమకు కూడా చేయించమని అడుగుతున్నారని షర్పద్దీన్ చెబుతున్నాడు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..