మనిషి పెంచి పోషిస్తున్న AI.. మనిషి పాలిట భస్మాసుర హస్తం!

ఇప్పుడు మీరు చదువుతున్నది 'ది అల్టిమేట్ వార్నింగ్'. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మనం చూసే రోబోల ప్రపంచం.. మనుషులను బానిసలుగా మార్చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కథలు.. ఇక ఎంతమాత్రం ఊహ కాదు! భవిష్యత్తులో అది నిజం కాబోతోంది. మనిషి పెంచి పోషిస్తున్న ఏఐ.. మనిషి నెత్తినే చేతులు పెట్టి భస్మం చేయబోతోంది. నేరుగా ఆంథ్రోపిక్ కంపెనీ ఇచ్చిన వార్నింగ్ ఇది. ఇంతకీ.. ఆంథ్రోపిక్‌నే భయపెట్టిన అంశం ఏంటి?

మనిషి పెంచి పోషిస్తున్న AI.. మనిషి పాలిట భస్మాసుర హస్తం!
Anthropic

Updated on: Jun 06, 2026 | 11:21 AM

మనం సృష్టించిన సాంకేతికత.. మన నియంత్రణను దాటిపోతే ఏం జరుగుతుంది? మనం రాసిన కోడింగ్.. మనపైనే ఎదురు తిరిగితే పరిస్థితి ఏంటి? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన AI సంస్థల్లో ఒకటైన ‘ఆంథ్రోపిక్’ ఇప్పుడిదే క్వశ్చన్‌ను బాంబు పేల్చింది. తమ సరికొత్త AI క్లాడ్.. ఊహించని వేగంతో, మనుషుల ప్రమేయం లేకుండా, తనను తాను స్వయంగా డెవలప్ చేసుకుంటోందని స్వయంగా ప్రకటించింది. అంతటితో ఆగడం లేదు. మానవ నియంత్రణను దాటేసి, తన కంటే వంద రెట్లు శక్తివంతమైన మరో సరికొత్త సూపర్ AIని అది స్వయంప్రతిపత్తితో సృష్టించే ప్రమాదం ముంచుకొస్తోందని హెచ్చరించింది. నిన్నటి వరకు చాట్‌బాట్‌గా మనకు సాయం చేసిన క్లాడ్ AI.. ఇప్పుడు తన సామ్రాజ్యాన్ని తానే నిర్మించుకునే స్థాయికి చేరింది.

ఆంథ్రోపిక్ విడుదల చేసిన నివేదిక ఇప్పుడు వణుకు పుట్టిస్తోంది. ఒక మనిషి 12 గంటల పాటు నాన్‌స్టాప్‌గా చేసే పనిని ఏఐ నిమిషాల్లో చేసేస్తోంది. ఇది కేవలం వేగం కాదు.. ఒక భయంకరమైన పరిణామం. సైన్స్ భాషలో దీన్ని ‘రికర్సివ్ సెల్ఫ్-ఇంప్రూవ్‌మెంట్’ అంటారు. అంటే.. ఒక AI సిస్టమ్.. తనలో ఉన్న లోపాలను తానే వెతుక్కుంటుంది, తానే సరిచేసుకుంటుంది. ఆపై.. తనకంటే వంద రెట్లు తెలివైన, మరింత శక్తివంతమైన మరో సూపర్ AI మోడల్‌ను మానవ ప్రమేయం లేకుండానే సృష్టిస్తుంది. ఈ పరిస్థితి ఊహించిన దానికంటే చాలా వేగంగా ముంచుకొస్తోందని ఆంత్రోపిక్ సంస్థ నెత్తీనోరూ బాదుకుంటోంది.

ఇంకా ఏమంటోందో తెలుసా ఆంథ్రోపిక్.. కొందరు మేధావులు ఊహిస్తున్న దానికంటే ముందే ఊహించని ముప్పు ముంచుకురాబోతోందట. ఒకవేళ AI తనంతట తానుగా తన ‘వారసుడిని’ సృష్టిస్తే.. ఆ తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం ప్రపంచంలో ఎవరి తరం కాదు. అది మానవాళి ఉనికికే ముగింపు పలకవచ్చని కూడా హెచ్చరించింది.

ఇప్పటికే క్లాడ్ AI కేవలం కోడింగ్ మాత్రమే కాదు.. రీసెర్చ్ టాస్క్‌లలో కూడా సైంటిస్టులను సైతం మించిపోతోంది. కష్టమైన రీసెర్చ్ ప్రాజెక్టులను 76 శాతం సక్సెస్ రేట్‌తో పూర్తి చేస్తూ దూసుకుపోతోంది. మనుషులు వారాల తరబడి చేసే రీసెర్చ్‌ను కేవలం కొన్ని గంటల్లోనే ముగించేస్తోంది. మేధస్సులో నోబెల్ బహుమతి గ్రహీతలను కూడా దాటేసే రోజు ఎంతో దూరంలో లేదని నిపుణులు భయపడుతున్నారు. ఆంథ్రోపిక్ సంస్థ చెబుతున్న మాట ఒక్కటే.. ఈ టెక్నాలజీ పెరుగుతున్న వేగాన్ని చూసి ప్రపంచ దేశాలు తక్షణం మేల్కోవాలి. అవసరమైతే అత్యంత అధునాతన AI మోడల్స్ అభివృద్ధిని తాత్కాలికంగా నిలిపివేయడానికి ప్రభుత్వాలు, కంపెనీలు కలిసి ఒక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది. ఎందుకంటే.. మనిషి సృష్టించిన కంప్యూటర్.. మనిషికే బాస్ అయ్యే రోజు వస్తే.. ఆ తర్వాత పశ్చాత్తాపపడినా లాభం లేదని వార్నింగ్ ఇచ్చింది.

Follow Us