
డబ్బు, అస్తి ముందు బంధాలు, ఆప్యాయతలు పనిచేయడం లేదు. ఆస్తి కోసం సొంత వారినే కడతేరుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. రిటైర్మెంట్ కానున్న భర్త ప్రాణాలను.. కట్టుకున్న భార్యే బలితీసుకుంది. అది కూడా డబ్బు, ఆస్తి పంపకాల వల్లే కావడం గమనార్హం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆసిఫాబాద్లో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న 62 ఏళ్ల వెంకటేశంను ఆయన భార్య రాజమణి దారుణంగా హతమార్చింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మృతుడు వెంకటేశం ఈ నెలలోనే ఉద్యోగ విరమణ పొందాల్సి ఉంది. రిటైర్మెంట్ తర్వాత వచ్చే భారీ మొత్తంలో డబ్బు, అలాగే ఆస్తి పంపకాల విషయంలో గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. రిటైర్మెంట్ డబ్బులను తన పేరిట రాయాలని, లేదా ఆస్తులను పంచాలని భార్య రాజమణి భర్తతో తరచూ గొడవ పడుతోంది.
ఈ క్రమంలోనే హనుమాన్ నగర్లోని నివాసంలో మరోసారి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాటమాట పెరగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన రాజమణి.. ఇంట్లోని రోకలిబండను తీసుకుని వెంకటేశం తలపై బలంగా కొట్టింది. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంకటేశం అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న హుస్నాబాద్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆస్తి కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చిన ఈ ఘటన హుస్నాబాద్లో తీవ్ర సంచలనంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.