
పెళ్లంటే నూరేళ్ల పండగ అంటారు. వివాహం చేసుకున్నాక సంతోషంగా పిల్లాపాపలతో జీవించాలని ప్రతి భార్య భర్త కోరుకుంటారు. అయితే ఓ యువతి పెళ్లైన నెలరోజులకే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వసంత్నగర్లో ఉండే నరేష్ గౌడ్ అనే వ్యక్తి గాజుల రామారానికి చెందిన నందిని(23)ని నెల రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఇరు కుటుంబాల పెద్దలు ఘనంగా వీరి పెళ్లి జరిపించారు. పెళ్లి అనంతరం జరగాల్సిన కార్యక్రమాలు పూర్తయ్యాక.. నందినిని అత్తవారింటికి పంపించారు. అయితే ఆమె శనివారం రాత్రి 7 గంటలకు ఇంట్లోని గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
చాలాసేపటికీ గదిలో నుంచి నందిని బయటకు రాకపోగా నందిని అత్త, భర్త తలుపుతట్టి చూశారు. ఎంత పిలిచినా ఆమె నుంచి ఉలుకుపలుకు లేకపోవటంతో అనుమానం వచ్చి గది తలపులు బద్దలుకొట్టిచూశారు. ఆమె ఫ్యాన్కు ఉరేసుకొని వేలాడటం ఒక్కసారిగా షాకయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నందిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అత్తింటివారి వేధింపుల వల్ల నందిని ఆత్మహత్య చేసుకుందా లేదా ఇతర వ్యక్తగత, అనారోగ్య సమస్యల వల్ల ఇలాంటి పనికి పాల్పడిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. పోస్టు మార్టం నివేదిక వచ్చిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి…