
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్చాట్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. గత ఎన్నికల ఓటమి తర్వాత పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు ఆయన సిద్ధం చేసిన కార్యాచరణను ఈ సందర్భంగా బయటపెట్టారు.
బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు గురించి కేటీఆర్ అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ (TRS) పేరును బీఆర్ఎస్ (BRS) గా మార్చడం వల్ల పార్టీకి నష్టం చేకూరిందని ఆయన అంగీకరించారు. ప్రజల్లో బలంగా నాటుకుపోయిన తెలంగాణ సెంటిమెంట్ పార్టీ పేరు మారడంతో కొంత పలచబడిందని భావిస్తున్న ఆయన, పార్టీని తిరిగి ‘టీఆర్ఎస్’గానే మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇది కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే అంశంగా భావిస్తున్నామన్నారు.
గత పదేళ్ల పాలనలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య దూరం పెరిగిందని కేటీఆర్ ఒప్పుకున్నారు. ఈ అంతరాన్ని తగ్గించేందుకు త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని, అప్పుడు తాను ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమని ధీమా వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని కేటీఆర్ తేల్చి చెప్పారు. ముఖ్యంగా బీజేపీతో పొత్తు ఉంటుందనే ప్రచారాన్ని ఆయన ఖచ్చితంగా కొట్టిపారేశారు. జైలుకు వెళ్తేనే సీఎం అవుతారనేది ఒక భ్రమ అని వ్యాఖ్యానిస్తూ, ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు. స్వయంశక్తితోనే మళ్లీ అధికారంలోకి వస్తామని, ప్రజాక్షేత్రంలోనే తమ బలాన్ని నిరూపించుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవల తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాత పేరు, కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తానని తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఫ్రీ అయిందని.. ఇప్పుడు దాన్ని ఎవరైనా వాడుకోవచ్చన్నారు. ఆచార్య జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే తమ పార్టీ నడుస్తుందని చెప్పారు. తమ పార్టీకి సిద్ధాంతకర్త అంటూ ఎవరూ లేరన్నారు. బీఆర్ఎస్ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని విమర్శించారు. కవిత కామెంట్స్ నేపథ్యంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..