Bandi Sanjay: ప్రజా సంగ్రామ యాత్ర ఆపాలంటూ పోలీసుల నోటీసులు.. ససేమిరా అంటున్న బీజేపీ నేతలు

Praja Sangrama Yatra: జనగామ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని నోటీసులో పేర్కొన్న పోలీసులు.  పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. అయితే..

Bandi Sanjay: ప్రజా సంగ్రామ యాత్ర ఆపాలంటూ పోలీసుల నోటీసులు.. ససేమిరా అంటున్న బీజేపీ నేతలు
Bandi Sanjay

Updated on: Aug 23, 2022 | 4:12 PM

ప్రజా సంగ్రామ యాత్ర ఆపాలంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి నోటీసు జారీ చేశారు వర్ధన్నపేట ఏసీపీ.  పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ లకు నోటీసులను అందించారు వర్దన్నపేట ఏసీపీ. జనగామ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని నోటీసులో పేర్కొన్న పోలీసులు.  పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. రెచ్చగొట్టే ప్రకటనలతో ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలను రప్పిస్తుండటంతో జిల్లాలో శాంతిభద్రతల విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని నోటీసులో తెలిపారు పోలీసులు. తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరించారు. నోటీసును పరిగణలోకి తీసుకోకుండా తిరిగి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తే శాంతిభద్రతల సమస్య కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు.

అయితే పోలీసులు జారీ చేసిన నోటీసులపై బీజేపీ నాయకులు స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్. పోలీసుల అనుమతితోనే గత మూడు విడతలుగా పాదయాత్ర కొనసాగిస్తున్నమని వివరణ ఇచ్చారు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్.  అప్పుడు లేని అభ్యంతరాలు… ఇప్పుడెందుకు?అంటూ ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ఎన్ని ఆంక్షలు పెట్టినా పాదయాత్ర కొనసాగించి తీరుతామన్నారు.

అనుకున్న షెడ్యూల్ ప్రకారం భద్రకాళి అమ్మవారి పాదాల చెంత వరకు పాదయాత్ర కొనసాగిస్తామని స్పష్టం చేశారు.  ఈనెల 27న హన్మకొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి తీరుతామని ప్రకటించారు. పాదయాత్ర ముగింపు సభకు జేపీ నడ్డా హాజరుకాబోతున్నారని వారు తెలిపారు. అయితే ఇదే అంశంపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ను సాయంత్రం 6.30గంటలకు కలిసి.. ఫిర్యాదు చేయనున్నారు బీజేపీ నాయకులు.

ఇవి కూడా చదవండి

ఇదిలావుంటే.. తన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంపై తీవ్రంగా మండిపడ్డారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌. ఎక్కడ యాత్రను ఆపారో అక్కడే మళ్లీ ప్రారంభిస్తానని ప్రకటించారు. యాత్రను అడ్డుకుని సీఎం కేసీఆర్‌ తప్పు చేశారని వ్యాఖ్యానించారు. 27న వరంగల్‌లో బహిరంగ సభ జరిపి తీరతామని ప్రకటించారు. మరోవైపు ఢిల్లీ తరహాలోనే తెలంగాణలోనూ త్వరలో లిక్కర్‌ స్కామ్‌ బయట పడుతుందని వ్యాఖ్యానించారు బండి సంజయ్‌. జనగామలో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కరీంనగర్‌లోని ఇంటి దగ్గర వదిలిపెట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Loading...
Unable to load recommendations.
Follow Us