
నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ నివాసంపై జరిగిన దాడిని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఖండించారు. హైదరాబాద్లోని ఎంపీ నివాసానికి వెళ్లిన మంత్రి.. దాడి జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అర్వింద్ నివాసంపై అధికార పార్టీ గూండాలు దాడి చేయడం హేయమైన చర్య అని మండి పడ్డారు. ఎంపీ ఇంటిపై దాడి జరుగుతుంటే అక్కడే ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాజధాని నడిబొడ్డున ప్రముఖులు, రాజకీయ నాయకులు నివసించే ఎమ్మెల్యే కాలనీలోనే ఇలాంటి ఘటన జరిగిందంటే తెలంగాణ రాష్ట్రం ఎటుపోతుందో అర్థం చేసుకోవచ్చన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
అధికార పార్టీ గూండాయిజానికి, రౌడీయిజానికి, అహంకారపూరితమైన పరిపాలనకు ఈ దాడే నిదర్శనం అని అన్నారు. నిరాశ.. నిస్పృహలో, అభద్రతా భావంతో టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోంది. వచ్చే ఏడాది అక్టోబరు వరకు సర్వేలు ఆపాలని సీఎం కేసీఆర్ను కోరుతున్నామన్నారు. సర్వేలు చేసి అభద్రతా భావంతో, ఓడిపోతామనే భయంతో ఇలాంటి దాడులు చేయిస్తున్నారు.
పోలీసులు, మజ్లిస్ను అడ్డుపెట్టుకుని దాడులు చేస్తున్నారు. టీఆర్ఎస్ దాడులకు తెలంగాణ ప్రజలు సమాధానం చెప్తారు. ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకోవాలనే కోరిక మాకు లేదు. భయపెట్టి, బతిమిలాడి పార్టీలో చేర్చుకునే అవసరం మాకు లేదు.
ఊరికొక ఎమ్మెల్యే, మంత్రి కూర్చుంటేనే మునుగోడులో గెలిచారు. పార్టీ ఫిరాయింపుల కేసు పెట్టాలంటే మొదట కేసీఆర్ మీదే పెట్టాలి. ఆయన ఇప్పటికే ఎన్ని పార్టీల గొంతు నొక్కారో అందరికీ తెలుసు. దేశంలో ఇతర పార్టీల మెప్పు కోసమే కేసీఆర్ ప్రయత్నాలు. మోదీని ఢీకొంటున్నట్టు ఇతరులు అనుకోవాలనే ఈ చర్యలు’’ అని కిషన్రెడ్డి మండిపడ్డారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం