
మహబూబాబాద్, జూన్ 8: మీ ఊర్లో వరుస మరణాలకు కారణం దెయ్యాలు – భూతాలు, సంచరిస్తున్నాయని… ఎవరో చేతబడి చేశారని నమ్మించి మంత్రాలతో వాటిని తరిమేస్తామని వచ్చారు. గ్రామస్తులకు నమ్మబలికి ఇద్దరు కేటుగాళ్లు కటకటాల పాలయ్యారు.. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గూడూరు మండలం వేంగంపేట పాల్తీయతండాలో గత కొద్ది రోజులుగా వరుస మరణాలు సంభవిస్తున్నాయి.. అనారోగ్య సమస్యలు, వడ దెబ్బ మరణాలు కలవర పెడుతున్నాయి.
ఇదే అదనుగా భావించిన కొందరు కేటుగాళ్లు తండాకు వచ్చారు.. ఎవరో ఈ తండాకు చేతబడి చేశారని నమ్మించే ప్రయత్నం చేశారు.. గ్రామంలో భూతాలు సంచరిస్తున్నాయని మంత్రాలతో వాటిని తరిమేస్తామని నమ్మించి ప్రయత్నం చేశారు. వారిపై అనుమానం వచ్చిన స్థానికులు నిలదీయగా పొంతనలేని సమాధానం చెప్పారు.. దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. చాలాగ్రామాల్లో ఇదేవిధంగా నమ్మ బలికి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అమావాస్య మంత్రాలు, పూజలతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.