TS Rains: బీభత్సం సృష్టించిన గాలివాన.. పిడుగుపడి వడ్ల కుప్పవద్దే రైతు, మనవడు మృతి

|

May 13, 2024 | 8:24 AM

మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేట రామోజిపల్లిలో ఆదివారం (మే 12) విషాదం చోటు చేసుకుంది. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే సమయానికి మృత్యువై వాన ముంచుకొచ్చింది. వడ్లు అమ్మేందుకు కొనుగోలు కేంద్రంలో పోసి నాలుగు రోజులు ఎండబెడితే, ఎట్టకేలకు శనివారం వడ్లు కాంటా వేశారు. ఇక వడ్లు లోడెత్తడమే మిగిలింది. ఇంతలో వాన ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాన పోటెత్తింది. చమటోడ్చి పండించిన వడ్లబస్తాలు..

TS Rains: బీభత్సం సృష్టించిన గాలివాన.. పిడుగుపడి వడ్ల కుప్పవద్దే రైతు, మనవడు మృతి
Two Killed By Lightning As Rains
Follow us on

మెదక్‌, మే 13: మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేట రామోజిపల్లిలో ఆదివారం (మే 12) విషాదం చోటు చేసుకుంది. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే సమయానికి మృత్యువై వాన ముంచుకొచ్చింది. వడ్లు అమ్మేందుకు కొనుగోలు కేంద్రంలో పోసి నాలుగు రోజులు ఎండబెడితే, ఎట్టకేలకు శనివారం వడ్లు కాంటా వేశారు. ఇక వడ్లు లోడెత్తడమే మిగిలింది. ఇంతలో వాన ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాన పోటెత్తింది. చమటోడ్చి పండించిన వడ్లబస్తాలు ఎక్కడ తడుస్తాయోనని భయపడిన టార్ఫాలిన్లు కప్పుదామని వానలోనే మనవడిని వెంటబెట్టుకొని కొనుగోలు కేంద్రానికి వెళ్లాడు. వడ్ల బస్తాలపై టార్ఫాలిన్‌ కప్పుతుండగా పిడుగుపడటంతో తాతామనుమడు అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం రామోజిపల్లిలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా విషాదం నింపింది. ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనుగోలు చేసి ఉంటే ఆ తాతామనుమడు బతికేవారంటూ రోధించారు. మృతుడిని రామోజిపల్లి గ్రామానికి చెందిన రైతు పాల్వంచ శ్రీరాములుగా గుర్తించారు.

రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్న ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పొలం సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే శ్రీరాములు.. గత యాసంగిలో వరిని పండించి, విక్రయించేందుకు 4 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చాడు. ఒడ్లు కాస్త తేమగా ఉన్నాయని చెప్పడంతో అక్కడే బయట ఆరబోశాడు. శనివారం ధాన్యం కాంటా వేసినా.. ధాన్యాన్ని ఆదివారం తరలించడానికి వాయిదా వేశారు. ఈలోగా భారీ వర్షం రావడంతో వడ్ల బస్తాలపై టార్పాలిన్లు కప్పడానికి పరుగు పరుగున వెళ్లిన శ్రీరాములు (45), ఆయన మనుమడు శివరాజ్‌ (13) పిడుగుపాటుకు గురై ధాన్యం బస్తాల మీద పడి చనిపోయారు. సమాచారం అందుకున్న ఆర్‌ఐ శరణప్ప, నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవ్‌కుమార్‌, ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.

కాగా ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. కొత్తగూడలో అత్యధికంగా 9.75 సెం.మీ వర్షం నమోదైంది. ఆదిలాబాద్‌లో జిల్లాలో పలుచోట్ల వడగండ్లు కురిశాయి. కామారెడ్డి జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన కురిసింది. ఈదురుగాలులకు పలు గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. చెట్లు విరిగిపోయాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం కూడా హైదరాబాద్‌, రంగారెడ్డి, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మేడ్చల్‌ -మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి సహా పలు జిల్లాల్లో వానలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వివరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.