Telangana Congress: ఎంపీ కోమటిరెడ్డిని సమర్థించిన జగ్గారెడ్డి.. ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ..

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల దుమారం తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ పార్టీలోని కొందరు నేతలు ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబడుతుంటే..

Telangana Congress: ఎంపీ కోమటిరెడ్డిని సమర్థించిన జగ్గారెడ్డి.. ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ..
Jagga Reddy On Komatireddy Venkata Reddy

Updated on: Feb 16, 2023 | 3:51 PM

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల దుమారం తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ పార్టీలోని కొందరు నేతలు ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబడుతుంటే.. మరికొందరు మాత్రం సమర్ధిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ఇన్‌ఛార్జి ఠాక్రేతో భేటీ తర్వాత ఈ వివాదం ముగిసినట్లేనని నేతలు చెబుతున్నా కోమటిరెడ్డికి కొందరు నేతలు ఫుల్‌ సపోర్ట్‌ చేయడం ఆసక్తిగా మారింది. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న ఠాక్రేను వరుసగా కలుస్తున్నారు పార్టీ సీనియర్లు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేయవలసిన పాదయాత్రలపై చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాను కూడా పాదయాత్ర చేయడానికి సిద్ధమని ప్రకటించారు పార్టీ సీనియర్‌ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇదే సందర్భంలో కోమటిరెడ్డికి పూర్తి మద్దతు ప్రకటించారు జగ్గారెడ్డి. వెంకట్‌రెడ్డి వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం లేనే లేదన్నారు. కానీ కావాలనే కొందరు ఆయన వ్యాఖ్యల్ని వక్రీకరించారని విమర్శించారు.

‘పార్టీలోని అంతర్గత విషయాలపై మా మధ్య చర్చ జరగలేదు. ఠాక్రే అనుభవం తెలంగాణ కాంగ్రెస్‌కు ఉపయోగపడుంది. రాష్ట్రంలోని 70 స్థానాల్లో విజయం కోసం పనిచేస్తాం. కాంగ్రెస్‌ బలం, బలహీనతను ఠాక్రేకు వివరించా. చాలా మంది సీనియర్లు పాదయాత్ర షెడ్యూల్‌ఇచ్చారు. నా పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ను త్వరలో తెలియజేస్తా. ఎంపీ కోమటిరెడ్డి మాటలను వక్రీకరించారు. ఆయన చెప్పింది ఒకటైతే.. మీడియాలో వచ్చింది మరొకటి.. ప్రజలకు అది మరోలా అర్థమైంది. ఎవరు ఏం మాట్లాడినా కాంగ్రెస్‌కు నష్టం జరగదు. పార్టీకి నష్టం జరిగేలా కోమటిరెడ్డి మాట్లాడలేద’ని జగ్గారెడ్డి అన్నారు.

ఇదే తరహాలో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి కూడా వెంకట్‌రెడ్డికి మద్దతుగానే మాట్లాడారు. కోమటిరెడ్డి కాంగ్రెస్‌ సిద్ధాంతాన్ని నమ్మిన నాయకుడి కూడా అన్నారు మహేశ్వర్‌రెడ్డి. కాగా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రెండు రోజుల క్రితం అంటే.. ఫిబ్రవరి 14న ‘‘వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి 60 సీట్లు కూడా రావు. ఆ పరిస్థితిలో కాంగ్రెస్‌తో కలవడం ఒక్కటే బీఆర్‌ఎస్‌కు ఉన్న మార్గం. అందుకే వచ్చే ఎన్నికల ముందు ఎలాంటి పొత్తులు లేకపోయినా ఫలితాల తర్వాత మాత్రం కచ్చితంగా పొత్తులతో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కానీ కాంగ్రెస్‌లో ఐక్యత లేకపోవడమే ప్రధాన సమస్య. సీనియర్ అయినా, జూనియర్ అయినా.. గెలిచే సత్తా ఉన్న వాళ్లకే టికెట్లు ఇవ్వాలి’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం లేవనెత్తినట్లయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Follow Us