Dharani Portal: ధరణి స్థానంలో భూమాత.. నిర్వహణ బాధ్యతలు ఎన్​ఐసీకి.. ఉత్తర్వులు జారీ

|

Oct 22, 2024 | 2:56 PM

ఇప్పటి వ‌ర‌కు ధరణి బాధ్యతలు నిర్వహిస్తున్న టెరాసిస్ ప్రైవేటు సంస్థ నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేష‌న‌ల్ ఇన్‌ఫ‌ర్మేటిక్ సెంట‌ర్‌ కి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Dharani Portal: ధరణి స్థానంలో భూమాత.. నిర్వహణ బాధ్యతలు ఎన్​ఐసీకి.. ఉత్తర్వులు జారీ
Bhumata Portal
Follow us on

గత ప్రభుత్వం తీసువచ్చిన ధరణి పోర్టల్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ధ‌ర‌ణి పోర్టల్ నిర్వహ‌ణ బాధ్యత‌ల‌ను ఎన్​ఐసీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వ‌ర‌కు ధరణి బాధ్యతలు నిర్వహిస్తున్న టెరాసిస్ ప్రైవేటు సంస్థను కాదని, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేష‌న‌ల్ ఇన్‌ఫ‌ర్మేటిక్ సెంట‌ర్‌ కి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఎన్ఐసీతో కీలక ఒప్పందం చేసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మూడేళ్ల పాటు ధరణి నిర్వహ‌ణ‌ బాధ్యతలు నిర్వహించనుంది ఎన్ఐసీ. ఎన్​ఐసీ ప‌నితీరు బాగుంటే మరో రెండేళ్లు నిర్వహ‌ణ బాధ్యత‌ల‌ను పొడిగించ‌నున్నట్లు రేవంత్ రెడ్డి సర్కార్ తెలిపింది.

టెరాసిస్ నుంచి ఎన్ఐసీకి అప్పగించ‌డం ద్వారా దాదాపు కోటి రూపాయ‌ల నిర్వహ‌ణ భారం కూడా త‌గ్గుతుంద‌ని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. అయితే ధ‌ర‌ణి పోర్టల్‌కు చెందిన సాంకేతిక అంశాల‌ను పూర్తి స్థాయిలో ఎన్ఐసీకి బ‌ద‌లాయించనున్నారు. న‌వంబ‌రు 30వ తేదీ వ‌ర‌కు టెరాసిస్ సంస్థ సిబ్బంది ఎన్ఐసీకి స‌హ‌క‌రిస్తార‌ని రెవెన్యూ ప్రిన్సిప‌ల్ సెక్రట‌ర్ న‌వీన్ మిట్టల్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ధరణి పోర్టల్‌ స్థానంలో భూ మాత

మరోవైపు ధరణి పోర్టల్‌ స్థానంలో భూ మాత పేరుతో పోర్టల్‌ ఏర్పాటుకు సర్కార్ కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నడుం బిగించింది. ధరణి వైఫల్యాలను అధిగమించే లక్ష్యంతో క్షేత్రస్థాయి అధ్యయానికి శ్రీకారం చుట్టింది. త్వరలో దేశానికే రోల్‌ మోడల్‌గా ఉండేలా నూతన ఆర్‌వోఆర్‌ చట్టాన్ని తెచ్చే పనిలో పడింది. ధరణి పోర్టల్‌ను ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వ ఎన్‌ఐసీకి బదలాయింపు ప్రక్రియను సర్కార్‌ ఇటీవల పూర్తిచేసింది. ఇక పేరు మార్పు మారిస్తే ప్రక్రియ పూర్తవుతుంది. ధరణి పోర్టలల్‌లో ఉన్న పెండింగ్‌ దరఖాస్తుల స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా దాదాపు పరిష్కరించారు. కొత్త చట్టంతో ముడిపడి ఉన్న అంశాలకు సంబంధించిన దరఖాస్తులే మిగిలిపోయినట్లు సంబంధిత వర్గాల సమాచారం.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ధరణి సమస్యలకు చరమగీతం పాడాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ క్రమంలోనే ధరణి పోర్టల్‌ సమస్యలపై ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ చేత క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయించారు. అందులో సేకరించిన విషయాలన్నింటినీ క్రోడీకరించి కొత్త ఆర్‌వోఆర్‌ చట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. క్షేత్రస్థాయిలో భూ సమస్యల అధ్యయానికి రాష్ట్రంలో రెండు మండలాలను ఎంపిక చేసింది. అందులో ఒకటి నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి మండలం. ఇక రెండోది రంగారెడ్డి జిల్లా యాచారం మండలం. నిర్ణీత కాలంలో భూ సమస్యలను పరిష్కరించి ఇక్కడ వచ్చిన ఫలితాల ద్వారా ఇదే నమూనాను రాష్ట్రమంతటా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..