
మహిళా పొదుపు సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఇప్పటికే వీరి ఆర్ధికాభివృద్ది కోసం ప్రభుత్వం అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోంది. మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు వివిధ అవకాశాలు కల్పిస్తోంది. పెట్రోల్ బంకులు ఓపెన్ చేయించడం, ఆర్టీసీ బస్సులను కేటాయించడం లాంటి అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో మహిళలకు ఆర్ధికంగా తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాల కోసం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే 221 క్యాంటీన్లను నెలకొల్పగా.. మహిళలు అదనపు ఆదాయం పొందేందుకు వీటిల్లో విజయ డెయిరీ పార్లర్లను ఏర్పాటు చేయనుంది. తొలి దశలో 96 క్యాంటీన్లలో వీటిని నెలకొల్పనుండగా.. అనంతరం అన్ని క్యాంటీన్లలో ఏర్పాటు చేయనున్నారు.
ఒక్కొ పార్లర్ ఏర్పాటు కోసం రూ.2 లక్షల ఖర్చు అవుతుంది. వీటిని ఏర్పాటు చేసుకునేందుకు మహిళలకు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా రుణం అందించనున్నారు. ఈ క్యాంటీన్లలో విజయ డెయిరీ ఉత్పత్తులను విక్రయించుకుని మహిళలు అదనపు ఆదాయం సంపాదించవచ్చు. పాలు, పెరుగు, లస్సీ, దూద్ పేడ, టీ, కాఫీ, ఐస్ క్రీమ్ వంటి ఉత్పత్తులను విక్రయించవచ్చు. రెండో విడతలో మిగిలిన 125 క్యాంటీన్లలో కూడా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లలో భోజనంతో పాటు పిండి వంటకాలు లభిస్తున్నాయి. ఇప్పుడు ఈ క్యాంటీన్లలో పాలు, పెరుగు లాంటి ఉత్పత్తులు కూడా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం క్యాంటీన్లు ఉన్న ప్రాంతాల్లో మహిళా సంఘాల్లోని మహిళలను ఎంపిక చేసి పార్లర్లను కేటాయిస్తారు. దీంతో మహిళలకు అదాయం లభించడంతో పాటు వినియోగదారులకు పాల ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి.
త్వరలో ఈ క్యాంటీన్లలో మహిళా ఇందిరా శక్తి క్యాంటీన్లను అధికారులు ప్రారంభించేందుకకు సిద్దమవుతున్నారు. తొలి దశలో కొన్ని క్యాంటీన్లలో ఏర్పాటు చేయనుండగా.. రెండో దశలో మిగతా క్యాంటీన్లలో కూడా నెలకొల్పనున్నారు. మహిళలకు అదనపు ఆదాయ అవకాశాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. క్యాంటీన్ నిర్వహణతో పాటు డెయిరీ పార్లర్ వల్ల అదనంగా ఆదాయం సమకూరుతుంది. దీని వల్ల మహిళా సంఘాల ఆదాయం కూడా పెరుగుతుంది. త్వరలోనే మహిళా సంఘాల్లోని సభ్యులను ఎంపిక చేయనున్నారు. అనంతరం ఆసక్తి గల వారికి ఈ పార్లర్లను మంజూరు చేయనున్నారు. బ్యాంక్ నుంచి వీటి కోసం రుణం కూడా ప్రభుత్వం అందించనుంది.