
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మరోసారి మార్పులకు లోనవుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల వాతావరణం కొంత చల్లబడినప్పటికీ, హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా మరో వర్ష హెచ్చరికను జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి, క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించింది. శుక్రవారం ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్లలో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. వర్షం పడే సమయంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అలర్ట్ ఇచ్చింది. మరో రెండ్రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
రాగల రెండు రోజుల్లో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే, ఇవి గతంలో కురిసిన భారీ వర్షాల మాదిరిగా కాకుండా కేవలం తేలికపాటి జల్లుల మాత్రమే పడతాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణ వాతావరణం నెలకొంటుందన్నారు.
ఉష్ణోగ్రతలు: నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 31 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చు.
ఉక్కపోత: గాలిలో తేమ శాతం 41 నుంచి 80 మధ్య ఉండటం వల్ల మధ్యాహ్న సమయాల్లో ఉక్కపోత ఎక్కువగా అనిపించే అవకాశం ఉంది.
రాత్రి ఉష్ణోగ్రత: కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండటం వల్ల రాత్రి, ఉదయం వేళల్లో వాతావరణం చల్లగానే ఉంటుంది.
ప్రస్తుత వర్షాల ప్రభావం మరో రెండు రోజులు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత వేసవి సెగలు మొదలవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకోవడంతో పాటు, వడగాలులు(Heat waves) వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుండే ఎండలు ప్రారంభమైనప్పటికీ, మార్చిలో అకాల వర్షాల వల్ల కొంత ఉపశమనం లభించింది.