
Telangana Sir Survey: తెలంగాణ ప్రజలకు శుభవార్త. కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Telangana Sir Survey) ప్రక్రియ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఓటర్ల వివరాల నమోదు, సవరణల్లో ఏ ఒక్కరూ నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించేందుకు చివరి తేదీని ఆగస్టు 10 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.
ఇదిలా ఉండగా, వాస్తవానికి ఈ గడువు మొదట జూలై 24తో ముగియాల్సి ఉండగా, దానిని ఆగస్టు 3 వరకు విస్తరించారు. తాజాగా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా 10వ తేదీ వరకు మరోసారి పొడిగించారు. ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 77.12 శాతం ఎన్యూమరేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యిందని ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్లో 56.31 శాతం, రంగారెడ్డిలో 63.43 శాతం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 61.37 శాతం మాత్రమే నమోదు అయ్యాయి. ఇప్పుడు గడువు పొడిగించడంతో ఇప్పటి వరకు నమోదు చేసుకోలేని వారికి ఎంతగానో ఉపయోగపడనుంది.
ఎన్నికల సంఘం కల్పించిన ఈ అదనపు సమయాన్ని అర్హులైన ప్రతి ఒక్క పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కోరారు. ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి అందించని వారు వెంటనే స్థానిక BLOలను సంప్రదించి తమ వివరాలను సరిచూసుకోవాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి