Telangana: పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య.. ఫీజుల బాదుడు నుంచి ఊరట..!
Telangana Public Schools: ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (TPS)’ అనే కొత్త విద్యా విధానాన్ని తీసుకొస్తోంది. ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్లో విద్య, కార్పొరేట్ స్థాయి వసతులు, అల్పాహారం, భోజనం, స్నాక్స్తో కూడిన సెమీ రెసిడెన్షియల్ విధానం ఇందులో ప్రత్యేకత. ఒక్కో పాఠశాలలో సుమారు 1,500 మంది విద్యార్థులు చదివేలా రూపకల్పన చేయగా, రాష్ట్రవ్యాప్తంగా 99 నియోజకవర్గాల్లో ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడమే కాకుండా.. సామాన్య విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉచిత విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (TPS) అనే వినూత్న కాన్సెప్ట్ను తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చింది. ప్రస్తుతం ఉన్న గురుకులాలు, ప్రభుత్వ బడులను సమన్వయం చేస్తూ.. ఒకే ప్రాంగణంలో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునేలా ఈ మెగా క్యాంపస్లను డిజైన్ చేస్తున్నారు.
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలోకి రాని 99 అసెంబ్లీ నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రాజెక్ట్ను చేపడుతున్నారు. ఇప్పటికే 2 నియోజకవర్గాల్లో ప్రయోగాత్మక పనులు పూర్తి కాగా.. మిగిలిన 97 నియోజకవర్గాల్లో త్వరలోనే టీపీఎస్లను మంజూరు చేసేందుకు రేవంత్ సర్కారు రంగం సిద్ధం చేసింది. భవిష్యత్తులో ప్రతి మండలంలో కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను టీపీఎస్లుగా మార్చాలనేది ప్రభుత్వ బృహత్ లక్ష్యం. ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థులకు ఇంటి వాతావరణంలోనే కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడం. సెమీ రెసిడెన్షియల్ విధానంలో భాగంగా విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం పోషక విలువలతో కూడిన భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ బస్సులను ఏర్పాటు చేసి, రవాణా ఇబ్బందులను తొలగించనున్నారు.
దీనివల్ల విద్యార్థులు రోజంతా పాఠశాల ప్రాంగణంలోనే ఉంటూ చదువుతో పాటు క్రీడలు, ఇతర నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశం లభిస్తుంది. ఒక్కో టీపీఎస్ నిర్మాణం, ఆధునీకరణకు సగటున 10 కోట్ల బడ్జెట్ అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ పాఠశాలల నిర్వహణకు 4 నుంచి 6 ఎకరాల సువిశాల స్థలాన్ని కేటాయించి, సుమారు 1500 మంది విద్యార్థులు ఒకేసారి అభ్యసించేలా డిజైన్ చేస్తున్నారు.
ప్రయోగాత్మకంగా 4 స్కూళ్లు ఎంపిక..
ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ప్రభుత్వం 4 పాఠశాలలను ఎంపిక చేసి రూ. 56.69 కోట్లను కేటాయించింది. రంగారెడ్డి జిల్లామంచాల, ఆరుట్ల హైస్కూళ్లు, నాగర్ కర్నూల్ జిల్లాలో వంగూర్, పోల్కంపల్లి హైస్కూళ్లు రానున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల పాఠశాల పనులు రూ. 9.86 కోట్లతో దాదాపు పూర్తయ్యాయి. ఇటీవల విద్యా కమిషన్ చైర్మన్ అకూనూరి మురళీ.. ప్రభుత్వ విప్లు, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఈ మోడల్ స్కూల్ను సందర్శించారు. పనులు పూర్తి కావడంతో.. జూన్ 13న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ నూతన విద్యా విధానాన్ని (TPS) అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. ప్రైవేటు పాఠశాలల ఫీజులు భరించలేక ఇబ్బంది పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇదొక పెద్ద ఊరట కానుంది.
