HYDRA: హైడ్రా చుట్టూ తెలంగాణ పాలిటిక్స్.. BRSకు పొలిటికల్‌గా వర్కౌట్ అయ్యిందా..?

| Edited By: Janardhan Veluru

Sep 30, 2024 | 7:08 PM

తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. పదేళ్ల తర్వాత అధికారం కోల్పోయి, పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు చేజారుతున్న తరుణంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి హైడ్రా రూపంలో సరికొత్త అస్త్రం అందివచ్చినట్లయింది. హైడ్రా పట్ల సామాన్య ప్రజల్లో తాజాగా వ్యక్తమవుతున్న వ్యతిరేకతను పార్టీ పునరుజ్జీవనం కోసం వాడుకోవడంలో సఫలీకృతం అవుతున్నది.

HYDRA: హైడ్రా చుట్టూ తెలంగాణ పాలిటిక్స్.. BRSకు పొలిటికల్‌గా వర్కౌట్ అయ్యిందా..?
Hydra
Follow us on

హైదరాబాద్ పరిధిలోని ఆక్రమణలను కూల్చే ప్రక్రియలో హైడ్రా (హైద‌రాబాద్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్‌, అస్సెట్ మానిట‌రింగ్ అండ్ ప్రొటెక్ష‌న్ ఏజెన్సీ) దూసుకుపోతోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా.. కొత్తగా కూల్చే నిర్మాణాలకు మార్కింగ్‌ చేపడుతోంది. పలు చోట్ల ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నా.. వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోతున్నారు. ఓవైపు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతుండగానే.. దీనిపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఓ రకంగా తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు హైడ్రా చుట్టూనే నడుస్తున్నాయి. హైడ్రా తీరుపై ఇప్పటికే విపక్షాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీఆర్‌ఎస్‌కు అస్త్రంగా హైడ్రా..

తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. పదేళ్ల తర్వాత అధికారం కోల్పోయి, పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు చేజారుతున్న తరుణంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి హైడ్రా రూపంలో సరికొత్త అస్త్రం అందివచ్చినట్లయింది. హైడ్రా పట్ల సామాన్య ప్రజల్లో తాజాగా వ్యక్తమవుతున్న వ్యతిరేకతను పార్టీ పునరుజ్జీవనం కోసం వాడుకోవడంలో సఫలీకృతం అవుతున్నది. ఎమ్మెల్యేల ఫిరాయింపులు మొదలు… రైతుభరోసా, రుణమాఫీ, ఆరుగ్యారెంటీలు ఇవేవీ ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం కల్పించలేకపోయాయి. కానీ తాజాగా హైడ్రా మాత్రం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ముప్పేట దాడి చేయడానికి బీఆర్ఎస్‌కు అందివచ్చిన అవకాశంగా మారింది. పేద, మధ్యతరగతి ప్రజలు కష్టపడి కట్టుకున్న ఇళ్లను హైడ్రా అన్యాయంగా కూల్చేస్తోందన్న అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రజల్లో కలిగించడంలో బీఆర్ఎస్ సఫలీకృతం అయ్యింది. అంతేకాదు, తమదెబ్బకు ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిందని భావిస్తోంది గులాబీ హైకమాండ్‌… ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపకుండా.. సేమ్‌ ఫ్లో కంటిన్యూ చేయాలని నిర్ణయించినట్లు గులాబీ జోష్‌ తేటతెల్లం చేస్తుంది.

Harish Rao, Sabita Reddy

గులాబీ వాకిలి తొక్కుతున్న బాధితులు

తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఇక నుంచి మాది ఫక్తు రాజకీయ పార్టీ, జాతీయ రాజకీయాలను శాసిస్తామంటూ బీఆర్‌ఎస్‌గా పేరు మార్చుకుంది. అనంతరం వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై పదేళ్ల అధికారాన్ని కాంగ్రెస్‌కు అప్పజెప్పింది. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో దారుణ ఓటమిని చవి చూసింది. ఒక్కటంటే ఒక్క పార్లమెంటు సీటును కూడా గెలువలేకపోవడం 24 ఏళ్ల పార్టీ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. వరుస ఓటములతో నిస్తేజంలో కూరుకుపోయిన బీఆర్ఎస్ కు హైడ్రా కూల్చివేతలు రాజీకీయంగా అస్త్రాలు మారాయి.

పేదల ఇళ్లను కూలుస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు క్షేత్రస్థాయికి వెళ్లి ఆందోళనలకు దిగుతున్నారు. తమను రక్షించాలని బాధితులు గులాబీ వాకిలి తొక్కుతుండటం ఆ పార్టీ నేతలు మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు రాస్తా క్లియర్‌ చేసింది. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ రాజకీయంగా బలమైన అస్త్రంగా మార్చుకోడానికి ఉపయోగపడింది. ఆలస్యంగా కళ్లు తెరిచిన బీజేపీ హైడ్రాకు వ్యతిరేకంగా కొండంత రాగం తీసినా లాభం లేకపోయింది.

మారిపోయిన రాజకీయ వాతావరణం

చెరువులు, కుంటల రక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాకు తొలుత అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. చెరువులు, నాళాలను అక్రమించి కట్టిన కట్టడాలను కూల్చివేసిన హైడ్రాకు ప్రజలు జేజేలు పలికారు. ప్రతిపక్ష పార్టీలు సైతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయాన్ని ముక్తంకంఠంతో సమర్థించించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. దీంతో హైడ్రా మరింత దూకుడు పెంచింది. ఈ క్రమంలో హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న కూల్చివేతలపై సర్వత్రా చర్చ జరిగింది. మరీ ముఖ్యంగా నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయడంతో అందరి దృష్టి హైడ్రాపై పడింది.

N Convention

చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమణల కూల్చివేతల విషయంలో హైడ్రా దూకుడుగా వెలుతోంది. దీంతో కూల్చివేతలపై పలు చోట్ల స్థానికంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్యాయత్నాల వరకు వెళ్లింది. బాధితులకు అండగా ఉంటామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. కూల్చివేతల విషయంలో ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అటు హైడ్రా విషయంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లాంటి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ సర్కారును మరింత ఇరుకున పెడుతున్నాయి.  దీంతో హైడ్రా చుట్టూ  తెలంగాణ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

బీఆర్‌ఎస్‌కు పొలిటికల్‌ మైలేజ్‌

ఆరు గ్యారంటీలు, రుణమాఫీ విషయంలో ప్రభుత్వాన్ని కార్నర్ చేసి రైతులతో కలిసి ఆందోళనలు నిర్వహించాలని భావించిన బీఆర్ఎస్‌కు ఆశించినంత మైలేజ్‌ రాలేదు. సరిగ్గా ఈ సమయంలోనే మూసి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్లాన్‌లో భాగంగా ఆ నది పరివాహక ప్రాంతంలోని రివర్ బెడ్‌లో ఉన్న నిర్మాణాలను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పేద కుటుంబాల్లో అలజడి రేగింది.

అధికారులు క్షేత్రస్థాయిలో కూల్చేయాలనుకున్న ఇండ్లకు రెడ్ మార్క్ వేయడం ఆ కుటుంబాల్లో కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఈ అంశాన్ని టేకప్ చేసిన బీఆర్ఎస్.. ఆ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఉచితంగా న్యాయసహాయం అందివ్వడానికి 24 గంటలు పని చేసే హెల్ప్ లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంలో బీజేపీ సైతం గొంతు విప్పినా మీడియా సమావేశాలకు మాత్రమే పరిమితమయ్యారు.

Telangana Politics Around Hydra

మూసీ కూల్చివేతలతో అగ్నికి ఆజ్యం

నగరంలోని ఇప్పటికే హైడ్రా కూల్చివేతలు దడ పుట్టిస్తుంటే మరోవైపు మూసీ పరీవాహక ప్రాంతంలో ఆక్రమణలు తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్దమవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. మూసీ నది సుందరీకరణ ప్రోగ్రామ్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులు, మరోవైపు అక్రమ ఆక్రమణల కూల్చివేత పనుల్లో హైడ్రా అధికారులు ఏక కాలంలో నిమగ్నం కావడం పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. హైడ్రా వ్యవస్థపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియా ద్వారా పేద కుటుంబాలకు క్లారిటీ ఇచ్చినా భయం పోగొట్టలేకపోయారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి షిప్టు చేయడం, సొంత పట్టాలు ఉన్నవారికి ఆర్థిక సాయం.. ఇలాంటి హామీలను ప్రభుత్వం, అధికారులు ఇచ్చినా పేద కుటుంబాలు మాత్రం మీరే దిక్కు అంటూ తెలంగాణ భవన్‌ వైపు అడులేస్తున్నాయి.

ఒకవైపు ప్రజా భవన్‌లో ప్రతీ వారం రెండు రోజులపాటు ప్రజావాణి జరుగుతున్నా, గాంధీ భవన్‌లో వారానికి ఇద్దరు మంత్రులు అందుబాటులో ఉంటున్నా బాధిత కుటుంబాలు మాత్రం గులాబీ పార్టీ వాకిలి తొక్కుతుండటం కార్యాలయాన్ని ఆశ్రయించడం అధికార పార్టీకి జీర్ణించుకోలేని పరిణామం.

రంగంలోకి హరీశ్‌రావు

అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయి, పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెల్చుకోలేని పరిస్థితుల్లో, ఆ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం.. మరికొంత మంది క్యూలో ఉన్నారనే అధికార పార్టీ ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ చతికిలపడిందనే భావన పాతుకుపోయింది. ఈ క్రమంలో కూల్చివేత బాధితులు తెలంగాణ భవన్‌కు క్యూ కట్టడం ఆ పార్టీ నేతల్లో సరికొత్త ఆశలు చిగురించాయి.

ప్రజలు కదిలినప్పుడు ఆందోళనలను ముందుండి నడిపించడంతో ఫలితాలు వస్తాయన్న కేసీఆర్ ఆలోచన హైడ్రా బాధితుల రూపంలో పట్టాలెక్కింది. ఈ అంశాన్ని గట్టిగా పట్టుకుని ప్రభుత్వ మెడలు వంచాలన్నది బీఆర్ఎస్ లక్ష్యంగా ఉంది. హరీశ్‌రావు మూడు రోజులుగా బాధిత కుటుంబాలతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. అండగా ఉంటామని భరోసా కల్పించడంతో బీఆర్ఎస్ గ్రాఫ్ కాస్త పెరిగిందనే ధీమా నేతల్లో వ్యక్తమవుతున్నది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల వ్యూహం

వ‌చ్చే ఏడాది జీహెచ్‌ఎంసీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. గతంలో మాదిరిగా బల్దియాలో గులాబీ జెండాను రెపరెపలాడించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ భావిస్తోంది. తద్వారా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమితో తీవ్ర నైరాశ్యంలో ఉన్న శ్రేణులకు ఉత్తేజం నింపినట్లువుతుంది. అధికార పార్టీవైపు తొంగి చూస్తున్న నాయకులకు అడ్డుకట్ట వేసినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలను బీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఈ ఎన్నిక‌ల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా గెలిపించుకునేందుకు గులాబీ ప‌క్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నార‌న్న‌ది ప‌రిశీల‌కులు అంచనా వేస్తున్నారు. జీహెచ్ ఎంసీ ప‌రిధిలో క్లాస్ కంటే కూడా.. మ‌ధ్య త‌ర‌గ‌తి, మాస్ ఓటింగ్ ఎక్కువ‌. వీరిని త‌న‌వైపు తిప్పుకోగ‌లిగితే.. జీహెచ్ ఎంసీలో పాగా వేయ‌డం న‌ల్లేరుపై న‌డ‌కే అవుతుంద‌న్న‌ది గులాబీ బాస్‌ వ్యూహంగా తెలుస్తోంది.

GHMC

ముందుకెళతారా? ముగిస్తారా?

హైడ్రాకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాను బీఆర్‌ఎస్‌ ఆయుధంగా మలుచుకుంది. మరోవైపు హైడ్రా విషయంలో ప్రజలకు ఎంతగా క్లారిటీ ఇచ్చినా పరిస్థితి అనుకూలంగా మారకపోవడంతో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే రంగంలోకి దిగాల్సి వచ్చింది. హైడ్రా, మూసీ బ్యూటిఫికేషన్ అంశాలను, ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించి బాధితులకు ప్రభుత్వం ఏ తరహాలో అండగా ఉంటుందో భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ హైడ్రాను భూతంగా చూపిస్తున్నదని, పేద కుటుంబాలను ముంపు నుంచి కాపాడేందుకు మూసీ ఒడ్డు నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్న అంశాన్ని వివిరిస్తున్నారు. బాధిత కుటుంబాల్లో మరింత ఆందోళనలు పెంచాలనుకుంటున్న బీఆర్ఎస్ ఎత్తుగడలకు రేవంత్ ఏ రకంగా బ్రేక్ వేస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి