ఆదిలాబాద్, సెప్టెంబర్ 3: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణిలో గులాబీ జెండా ఎగరాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి ప్రాంతాల్లో ఉన్న అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి సీఎం కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం (సెప్టెంబర్ 3) బీఆర్ఎస్ సింగరేణి సంస్థకు సంబంధించిన పాఠశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది సమస్యలపై నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో తమ సమస్యలను పరిష్కరించాలంటూ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కవితకు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ..
సింగరేణిని ప్రైవేటీకరణను తప్పించిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించి ఆ సంస్థను కేసీఆర్ కాపాడారని అన్నారు. ఆర్టీసీ సంస్థను కూడా ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్ర సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారని పేర్కొన్నారు.
ఉమ్మడి తెలంగాణ సమయంలో వారసత్వ ఉద్యోగాల అంశం తీవ్రమైన సమస్యగా ఉండేదని గుర్తుచేశారు. అప్పట్లో రాష్ట్ర ప్రజలకు కేవలం 4 వేల ఉద్యోగాలు మాత్రమే ఇస్తే.. నేడు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు 20 వేల ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆలోచించి వారసత్వ ఉద్యోగాలను కల్పించినట్లు కవిత పేర్కొన్నారు. ఇదే మాదిరి సింగరేణి సంస్థ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను కూడా రాష్ట్ర సర్కార్ సానుకూలంగా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ విషయమై తాను కూడా చొరువ తీసుకొని సీఎం కేసీఆర్తో చర్చిస్తానన్నారు. సింగరేణి కార్మిక నాయకులతో సీఎం కేసాఆర్తో సమావేశం ఏర్పాటు చేయించే ఏర్పాటు చేస్తానన్నారు. కాగా ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిరియాల రాజిరెడ్డి, టీబీజీకేస్ నాయకులు తదితర నాయకులు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.