
మహిళల గర్బాదరణ సమయంలో ఇచ్చే మెటర్నెటీ లీవ్ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మొదటి ప్రసవంలో కవలలు పుట్టారని చెప్పి.. రెండో గర్భధారణకు ప్రభుత్వ మహిళా ఉద్యోగికి ప్రసూతి సెలవు (మేటర్నిటీ లీవ్) నిరాకరించలేమని తెలిపింది. మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్న జాది స్వరూపారాణికి 2023లో తొలి గర్భంలో కవలలు జన్మించారు. అనంతరం 2026 ఏప్రిల్లో రెండోసారి గర్భం దాల్చి మరో బిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారనే కారణంతో కళాశాల అధికారులు ఆమె మేటర్నిటీ లీవ్ దరఖాస్తును తిరస్కరించారు.
చట్టంలోని ఇద్దరు పిల్లల నిబంధన ప్రకారం ఇప్పటికే ఇద్దరు సజీవ సంతానం ఉన్నందున రెండో కాన్పుకు ప్రసూతి సెలవు వర్తించదని అధికారులు వాదించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన స్వరూపారాణి తరఫు న్యాయవాది, మొదటి కాన్పులో కవలలు పుట్టడం అనేది తల్లి చేతుల్లో ఉండే విషయం కాదని, అలాంటి కారణంతో ప్రసూతి హక్కులను నిరాకరించడం అన్యాయమని వాదించారు. విచారణ అనంతరం జస్టిస్ కె. శరత్ ప్రభుత్వ వాదనను తిరస్కరించారు. మొదటి కాన్పులో కవలలు పుట్టిన ప్రత్యేక పరిస్థితుల్లో నిబంధనలను యాంత్రికంగా కాకుండా మానవీయ కోణంలో చూడాలని పేర్కొన్నారు.
ప్రసూతి సెలవు ఉద్దేశం మహిళ ఆరోగ్యాన్ని కాపాడడం, ఉద్యోగాన్ని కొనసాగించేలా సహాయం చేయడం. నిబంధనలను అక్షరాలా అమలు చేస్తే ఆ ఉద్దేశమే దెబ్బతింటుంది” అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించింది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో తమిళనాడు ప్రభుత్వం అదనపు కాన్పుకూ ప్రసూతి సెలవు కల్పించేలా నిబంధనలను సవరించిందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పిల్లల సంఖ్యపై ఉన్న పరిమితినే తొలగించిందని గుర్తుచేసింది.
చివరగా స్వరూపారాణికి 2026 ఏప్రిల్ 14 నుంచి అక్టోబర్ 11 వరకు 180 రోజుల ప్రసూతి సెలవు మంజూరు చేయాలని, ఆ కాలానికి సంబంధించిన పూర్తి జీతభత్యాలు చెల్లించాలని తెలంగాణ హైకోర్టు అధికారులను ఆదేశించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.