High Court: విద్యార్థులకు బిగ్‌ రిలీఫ్.. ఆ విషయంలో ప్రైవేట్‌ విద్యా సంస్థలకు హైకోర్టు వార్నింగ్

రాష్ట్రంలోని విద్యార్థులకు ఇదో బిగ్ రిలీఫ్‌ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థులకు సర్టిఫికేజ్‌ జారీ చేసే విషయంపై ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించలేదనే సాకుతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్స్ తమ వద్దే ఉంచుకునే ప్రైవేటు సంస్థలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

High Court: విద్యార్థులకు బిగ్‌ రిలీఫ్.. ఆ విషయంలో ప్రైవేట్‌ విద్యా సంస్థలకు హైకోర్టు వార్నింగ్
Private Colleges Withholding Certificates

Edited By:

Updated on: Jun 12, 2026 | 2:52 PM

రాష్ట్రంలోని విద్యార్థులకు ఇదో బిగ్ రిలీఫ్‌ అనే చెప్పాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించలేదనే సాకుతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్స్ ప్రైవేట్ కాలేజీలు తమ వద్దే ఉంచుకోవడాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను తిరిగి పొందేందుకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా సూచించింది.

సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు మానవ హక్కుల కమిషన్, హైకోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొనడం ఆందోళనకరమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ తరహా వివాదాలను త్వరితగతిన పరిష్కరించే స్పష్టమైన వ్యవస్థ అవసరమని అభిప్రాయపడింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్యపై ‘అసీమ్’ (అసోసియేషన్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ అండ్ ఇస్లామిక్ స్టూడెంట్స్) దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై గురువారం ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్ సింగ్, న్యాయమూర్తి మహ్మద్ మొయినుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్య కేవలం మైనారిటీ విద్యార్థులకే పరిమితం కాదని, వివిధ వర్గాలకు చెందిన విద్యార్థులందరినీ ప్రభావితం చేస్తోందని తెలిపారు. ఈ అంశంలో సంబంధిత సంక్షేమ శాఖల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు.

వాదనలు విన్న ధర్మాసనం సంబంధిత సంక్షేమ శాఖలను కేసులో ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, సర్టిఫికెట్ల విడుదల అంశాల్లో ప్రభుత్వం సమగ్ర విధానం రూపొందించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us