Trs Land Issue: టీఆర్ఎస్ అధినేతకు నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు.. ఏ విషయంలోనంటే..!
Trs Land Issue: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాల కోసం జిల్లాల్లో..
Trs Land Issue: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాల కోసం జిల్లాల్లో భూమి కేటాయింపుపై జరిగిన విచారణలో భాగంగా ఈ నోటీసులు జారీ చేసింది ధర్మాసనం. జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాలకు భూ కేటాయింపులపై, రిటైర్డ్ ఉద్యోగి మహేశ్వర్రాజ్ దాఖలు చేసిన పిల్పై హైకోర్టు విచారణ చేపట్టింది. అలాగే, టీఆర్ఎస్ హైదరాబాద్ ఆఫీస్ కోసం బంజారాహిల్స్లో 4వేల 935 గజాలు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు పిటిషనర్. అత్యంత ఖరీదైన భూమిని గజం కేవలం 100 రూపాయలకే ఇవ్వడంపై పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, కేసీఆర్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డితో పాటు సీఎస్, సీసీఎల్ఏ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు, జిల్లా కేంద్రాల్లో వంద రూపాయలకు గజం చొప్పున ఎకరానికి మించకుండా స్థలం కేటాయించేందుకు, 2018లో ఆగస్టు 16న జారీ చేసిన జీవో రాజ్యాంగ విరుద్ధమని, పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. దీంతో పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విచారణలో భాగంగానే కేసీఆర్కు కూడా నోటీసులు ఇచ్చింది. అయితే, కేసీఆర్కు నోటీసులు జారీ చేయడం తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.