Warangal Medical College: తెలంగాణవాసులకు గుడ్‌న్యూస్.. వరంగల్‌లో కొత్త మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు సర్కార్ అనుమతి

|

Sep 24, 2021 | 7:07 AM

వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. హన్మకొండలో 150 సీట్లతో మెడికల్‌ కాలేజీకి పర్మిషన్ ఇవ్వగా.. 2022-23 అకడమిక్‌ ఇయర్‌లో అడ్మిషన్లకు అనుమతి ఇచ్చింది.

Warangal Medical College: తెలంగాణవాసులకు గుడ్‌న్యూస్.. వరంగల్‌లో కొత్త మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు సర్కార్ అనుమతి
Pratima Medical College In Warangal
Follow us on

Pratima Medical College: తెలంగాణ వైద్య విద్యార్థులకు శుభవార్త. రాష్టంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలు రాబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా అడుగుులు వేస్తోంది. ఇందులో భాగంగా 8 వైద్య కళాశాలలు 2022-23 విద్యా సంవత్సరంలోనే ప్రారంభం కానున్నాయి. ఈక్రమంలోనే కొత్త మెడికల్ కాలేజీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. హన్మకొండలో 150 సీట్లతో మెడికల్‌ కాలేజీకి పర్మిషన్ ఇవ్వగా.. 2022-23 అకడమిక్‌ ఇయర్‌లో అడ్మిషన్లకు అనుమతి ఇచ్చింది. ప్రతిమ రిలీఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ పేరుతో మెడికల్‌ కాలేజీ చేస్తున్నట్లు ప్రతిమ గ్రూప్‌ ఎండీ హరిణి బోయినపల్లి ప్రకటించారు. ప్రతిమ గ్రూప్ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మూడు హాస్పిటల్స్ నిర్వహిస్తోంది. వరంగల్‌లో 300 బెడ్స్ కెపాసిటీ కల్గిన క్యాన్సర్ హాస్పిటల్‌లో రోగులకు సేవలందిస్తోంది. గడిచిన 20 సంవత్సరాలుగా కరీంనగర్‌లో 300 బెడ్స్‌ సామర్ధ్యం కల్గిన మెడికల్ కాలేజ్‌ నడిపిస్తోంది. హైదరాబాద్‌లో కాచిగూడ, కూకట్‌పల్లిలో 300 బెడ్స్‌తో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో రోగులకు వైద్యం అందిస్తోంది.

ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు తక్కువ ధరకే మెరుగైన వైద్యం అందించే క్రమంలో సేవలందిస్తోంది ప్రతిమ గ్రూప్. కోవిడ్‌ కాలంలో ప్రతిమ ఆస్పత్రులు విస్తృత సేవలను అందించాయి. ఎప్పటికపుడు ప్రజలకు మంచి చేయాలన్న దృక్పథంతో పనిచేస్తున్నాయి ప్రతిమ హాస్పిటల్స్‌. ఇప్పుడు సంస్థను మరింతగా విస్తరించి.. మెడికల్‌ సైన్సెస్‌లో నిష్ణాతులను తయారుచేసే ప్రణాళికలు సిద్ధం చేసింది. కరీంనగర్‌ మెడికల్‌ కాలేజీ ద్వారా వందల మంది డాక్టర్లను ప్రొడ్యూస్‌ చేసింది ప్రతిమ గ్రూప్‌. ఇప్పుడు హన్మకొండ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు ద్వారా అటు ఉత్తమ డాక్టర్లను తయారుచేయడమే కాకుండా.. ఇటు ప్రజలకు ఉత్తమ వైద్యాన్ని అందించేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే అత్యాధునిక హంగులతో ఈ కాలేజీ ఏర్పాటు జరుగుతుందని గ్రూప్‌ ఎండీ ప్రకటించారు.

ఇదిలావుంటే, రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మంచిర్యాల, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, జగిత్యాల, రామగుండం, వనపర్తిలో వచ్చే ఏడాదే కొత్త వైద్య కళాశాలలు ప్రారంభం అవుతాయి. ప్రతీ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున 1200 సీట్లు 2022-23 విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వస్తాయి. ఇవి కాకుండా మరో 8 వైద్య కళాశాలల ద్వారా 2023-24 విద్యా సంవత్సరంలో మరో 1200 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం జాతీయ వైద్య కమిషన్‌కు సెప్టెంబర్ 23న దరఖాస్తు పంపనుంది. నవంబర్, డిసెంబర్‌లో నేషనల్ హెల్త్ కమిషన్ అధికారులు తనిఖీలకు వచ్చే అవకాశం ఉంది.

2023-24 విద్యా సంవత్సరంలో వికారాబాద్, సిరిసిల్ల, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వైద్య కళాశాలలు ప్రారంభం అవుతాయి. మరో 4 వైద్య కళాశాలల్ని ఎక్కడ ప్రారంభించాలన్న నిర్ణయాన్ని ఇంకా తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేదు. 2023-24 విద్యా సంవత్సరం నాటికి మొత్తం16 మెడికల్ కాలేజీల ద్వారా 2,400 సీట్లు అందుబాటులోకి వస్తాయి. వైద్య వృత్తి చేపట్టాలనుకునే విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి.

ప్రస్తుతం తెలంగాణలో 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సిద్దిపేట, నల్గొండ, సూర్యపేట, మహబూబ్‌నగర్‌లో మెడికల్ కాలేజీలు ఏర్పాటైన సంగతి తెలిసిందే. అంతకుముందు ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, కాకతీయ మెడికల్ కాలేజ్‌తో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్‌లో మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దీంతో వైద్య కళాశాల సంఖ్య 9 కి చేరుకుంది.

Read Also….  Prabhas: ఆ సినిమా చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.. లవ్‌స్టోరీపై ఆసక్తికర పోస్ట్‌ చేసిన ప్రభాస్‌.