
Telangana Assembly Elections: తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సంగ్రామంలో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమతి ప్రచారం స్పీడును పెంచింది. రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్ ఇప్పటికే తొలి విడత ప్రచారాన్ని పూర్తిచేశారు. దసరా పండుగ తర్వాత రెండో విడత ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మరోవైపు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. చేరికలతోపాటు.. ప్రచారం బాధ్యతలను కూడా మోస్తూ.. హ్యాట్రిక్ గెలుపుకోసం శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. పార్టీ నియోజకవర్గాల ఇంచార్జ్లతో హైదరాబాద్ జలవిహార్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ డివిజన్ల ఇంచార్జ్లకు పలు కీలక ఆదేశాలిచ్చారు. గెలుపే లక్ష్యంగా నేతలందరూ సమన్వయంతో పనిచేయాలంటూ కేటీఆర్ దిశానిర్దేశంచేశారు. అందర్ని కలుపుకోని వెళ్లాలని.. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవద్దంటూ సూచించారు. అంతేకాకుండా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించి పలు సూచనలు చేశారు.
సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. నవంబర్ 30న జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించబోతోందని మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. చేసిన అభివృద్ధిని, మేనిఫెస్టోని ఇంటింటికీ తీసుకెళ్లాలని తీర్మానం చేసినట్లు వివరించారు. కచ్చితంగా హ్యాట్రిక్ విజయం సాధిస్తామని చెప్పిన కేటీఆర్.. బీజేపీకి అసలు అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి 100 స్ధానాల్లో, కాంగ్రెస్కు 40 స్థానాల్లో అభ్యర్థులు లేరని కేటీఆర్ వివరించారు. టికెట్లు అమ్ముకునే కాంగ్రెస్ పార్టీ నుంచి నేర్చుకునేది ఏమీ లేదంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల వచ్చిన సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యత చూపాయంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
తమ గెలుపును ఆపలేరని.. కాంగ్రెస్ ఇచ్చే హామీలను ఎవ్వరూ నమ్మరంటూ కేటీఆర్ పేర్కొన్నారు. సంస్కారం తమకు ఎవరూ నేర్పించాల్సిన అవసరం లేదని.. రేవంత్ కు తమకు చెప్పే అర్హత లేదంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలుసంటూ వ్యాఖ్యానించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..