
తెలంగాణ క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం నోటీసుల యుద్ధం ప్రకంపనలు సృష్టిస్తోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన TG 20 లీగ్పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ లీగ్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుండి అసలు అనుమతి ఉందా? ఉంటే ఆ పత్రాలను, రిఫరెన్స్ నంబర్లను బహిర్గతం చేయాలని TCA డిమాండ్ చేసింది.
వివాదానికి ప్రధాన కారణం పారదర్శకత లోపం, నిబంధనల ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తుంది. BCCI ఆమోదం ఉందని చెబుతూ HCA తప్పుదోవ పట్టిస్తోందని TCA నాయకులు ఆరోపిస్తున్నారు. 2021లో BCCI ఇచ్చిన ఆదేశాల ప్రకారం రెండు అసోసియేషన్లు సమన్వయంతో పనిచేయాలని, కానీ HCA ఏకపక్షంగా వ్యవహరిస్తోందని TCA పేర్కొంది. అనుమతి లేని లీగ్లలో ఆడటం వల్ల యువ క్రికెటర్ల కెరీర్ దెబ్బతినే ప్రమాదం ఉందని TCA ఆందోళన వ్యక్తం చేస్తోంది.
మరోవైపు, TCA ఇప్పటికే జూన్ నెలలో తెలంగాణ ప్రీమియర్ లీగ్ (TPL) నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ పోటీ నేపథ్యంలో రెండు సంస్థల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. క్రికెట్ అభివృద్ధికి కలిసి పనిచేయాల్సిన సంస్థలు ఇలా వివాదాలకు దిగడం పట్ల క్రీడాభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ గుర్తింపు, BCCI మార్గదర్శకాల విషయంలో ఎవరి వాదన నెగ్గుతుందనేది ఇప్పుడు సంచలనంగా మారింది. HCA ఇచ్చే వివరణ ఆధారంగా తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని TCA స్పష్టం చేయడంతో, ఈ వివాదం ఎటు దారితీస్తుందో అన్నది ఉత్కంఠ రేపుతోంది. బీసీసీఐ జోక్యం చేసుకుని స్పష్టత ఇస్తే తప్ప ఈ గందరగోళానికి తెరపడేలా లేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..