CM KCR Yadadri District Tour: జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఇవాళ భువనగరి యాదాద్రి జిల్లాకు రానున్నారు. శుక్రవారం జనగాం(Jangoan)లో పర్యటించిన సీఎం కేసీఆర్ నూతన కలెక్టరేట్(Collectorate), టీఆర్ఎస్(TRS) జిల్లా కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 12వ తేదీ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్లోని ప్రగతి భవన్ నుంచి బయలుదేరి.. మధ్యాహ్నం 12:30 గంటలకు యాదాద్రిలో నిర్మించిన ప్రెసిడెన్షియల్స్ సూట్స్, వీవీఐపీ కాటేజీలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం శరవేగంగా జరగుతున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను కేసీఆర్ సమీక్షించనున్నారు.
అలాగే, మధ్యాహ్నం 1 గంటకు సుదర్శన మహా యాగం కోసం ఏర్పాటు చేసి యాగశాల పరిశీలించనున్నారు. అక్కడి నుంచి భువనగిరికి బయలుదేరుతారు. భువనగిరిలో నూతనంగా నిర్మించిన అధునాతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు రాయగిరి వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం కేసీఆర్.. తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభ సక్సెస్ కోసం ఉమ్మడి జిల్లాలోని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు.. నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి.. జిల్లా టీఆర్ఎస్ నేతలతో పలుమార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. నిన్న జనగామ జిల్లా పర్యనటలో వరాలు కురిపించారు. ఈ సభలో కేంద్రంపై విరుచుకుపడిన కేసీఆర్.. నేడు రాయగిరిలో జరిగే బహిరంగ సభలో కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉందని తెలుస్తోంది.