Telangana Election: నేడే నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు.. ఇంకా తేలని బీజేపీ అభ్యర్థుల జాబితా..!

బీజేపీ మరో 11 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. టికెట్‌ ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల ప్రక్రియ ముగిశాక వీరంతా ప్రచారంపై దృష్టిసారించాల్సి కూడా ఉండటంతో ఆశావాహులు గుబులుపడుతున్నారు. ఇదిలావుంటే, కొందరు నేతలకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫోన్ చేసి నామినేషన్లు వేసుకోమని చెప్పినట్టు సమాచారం.

Telangana Election: నేడే నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు.. ఇంకా తేలని బీజేపీ అభ్యర్థుల జాబితా..!
Nominations

Updated on: Nov 10, 2023 | 7:21 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు నేడు ఆఖరి రోజు. అయినా బీజేపీ మాత్రం ఇప్పటివరకూ ఇంకా 11 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించలేకపోయింది. దీంతో ఆశావహుల్లో టెన్షన్‌ పెరిగిపోతోంది.

తెలంగాణ శాసనసభ ఎన్నికల వేళ మరికొద్ది గంటల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియబోతోంది. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,317 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం ఒక్కరోజే 1,129 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నవంబర్ 9వ తేదీ మంచి ముహూర్తం ఉండటంతో సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్‌ వేశారు. మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల నుంచి, హరీశ్‌ రావు సిద్దిపేట నుంచి నామినేషన్లు వేశారు. నామినేషన్లకు సరిగ్గా ఒక రోజు ముందు కాంగ్రెస్‌ పార్టీ చివరి జాబితాను విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ తుది జాబితాలోని అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. దీనికి తోడు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి నేడు కామారెడ్డిలో నామినేషన్‌ వేయనున్నారు. కామారెడ్డిలో నేడు బహిరంగ సభ కూడా ఉంది. బీసీ డిక్లరేషన్‌ ప్రకటించనున్న ఈ సభకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య హాజరుకానున్నారు.

ఇక నామినేషన్లకు సరిగ్గా ఒకరోజు ముందు బీజేపీ కూడా ఓ జాబితాను విడుదల చేసింది. మల్కాజ్‌గిరి నుంచి రామచంద్రరావుకు, పెద్దపల్లి నుంచి ప్రదీప్‌రావుకు టికెట్లు దక్కాయి. శేరిలింగంపల్లి టికెట్ విషయంలో పంతం నెగ్గించుకున్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఉత్కంఠ రేపిన శేరిలింగంపల్లి నుంచి రవికుమార్ యాదవ్‌కు టికెట్‌ దక్కింది. నాంపల్లి నుంచి రాహుల్ చంద్ర, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నుంచి కృష్ణ ప్రసాద్, నకిరేకల్‌ నుంచి మొగిలయ్యకు టికెట్లు దక్కాయి. వీరంతా నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. దీనికి తోడు వేములవాడ బీజేపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీజేపీ అభ్యర్థిగా తుల ఉమను ఇప్పటికే బీజేపీ అధిష్టానం ప్రకటించింది. అయితే బీజేపీ యువ నాయకుడు వికాస్‌రావు నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. వేములవాడ టికెట్‌ వికాస్‌రావుకే ఇవ్వాలంటూ ఆయన మద్దతుదారులు నిరసనలు కూడా చేపట్టారు.

మరోవైపు బీజేపీ మరో 11 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. టికెట్‌ ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల ప్రక్రియ ముగిశాక వీరంతా ప్రచారంపై దృష్టిసారించాల్సి కూడా ఉండటంతో ఆశావాహులు గుబులుపడుతున్నారు. ఇదిలావుంటే, కొందరు నేతలకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫోన్ చేసి నామినేషన్లు వేసుకోమని చెప్పినట్టు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…